పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్‌ సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంతో మూడు ట్రావెల్స్‌ సీజ్‌

Jun 21 2023 12:54 AM | Updated on Jun 21 2023 1:15 PM

ఆదిలాబాద్‌: అల్పాహారాన్ని వడ్డిస్తున్న అధికారులు  - Sakshi

ఆదిలాబాద్‌: అల్పాహారాన్ని వడ్డిస్తున్న అధికారులు

ఆదిలాబాద్‌టౌన్‌: పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ట్రావెల్స్‌లను రవాణ శాఖాధికారులు సోమవారం అర్ధరాత్రి సీజ్‌ చేశారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను ఆర్టీసీ బస్టాండ్‌లో దింపారు. హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు కార్మికులను తీసుకెళ్తున్నారు. ఒక్కో బస్సులో 30వరకు పరిమితి ఉండగా వంద మంది వరకు ప్రయాణికులను తరలిస్తున్నారు. ఈ క్రమంలో తనిఖీలు చేపట్టిన రవాణ శాఖాధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ట్రావెల్స్‌లను సీజ్‌ చేసి ఆర్టీసీ డిపోలో ఉంచారు. అందులో ప్రయాణిస్తున్న వారిని బస్టాండ్‌లో దింపడంతో వారు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం రవాణ శాఖాధికారులు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వారికి భోజనం ఏర్పాటు చేయించారు.

వీరిని ఛత్తీస్‌ఘడ్‌కు తరలించేందుకు ఆ బస్సుల యజమానుల నుంచి డబ్బులు రాబట్టి రెండు ఆర్టీసీ బస్సుల ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చేవిధంగా చర్యలు చేపట్టారు. మిగిలిన మరికొంత మంది కోసం మరో బస్సును ఏర్పాటు చేస్తామని డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ తెలిపారు. ఇదిలా ఉండగా రెండుమూడు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్తున్న రెండు బస్సులను సీజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఆదిలాబాద్‌: ప్రయాణికుల సౌకర్యం కోసం అల్పాహారం పంపిణీ చేయడం అభినందనీయమని ఆదిలాబాద్‌ ఆర్టీసీ ఆర్‌ఎం జానీ రెడ్డి, డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న మూడు ప్రైవేటు ట్రావెల్స్‌లను సోమవారం సీజ్‌ చేశారు. ఆదిలాబాద్‌ ఆర్టీసీ డిపోలో బస్సులను నిలుపగా, ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంగణంలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులకు లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో అల్పాహారాన్ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంవీఐ శ్రీనివాస్‌, డీఎం కల్పన పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement