breaking news
Sathya Sai Baba
-
సత్యసాయి సమాజాన్ని మానవత్వం వైపు నడిపారు
ప్రశాంతి నిలయం: సత్యసాయి మానవతా విలువల బోధనతోపాటు నిస్వార్థసేవలతో సమాజాన్ని మానవత్వం వైపు నడిపారని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ గుర్తు చేశారు. ఆయన భౌతికంగా లేకపోయినా బాబా సంకల్పాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మానవతా వాదులు, భక్తులందరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. పుట్టపర్తిలోని సత్యసాయి హిల్వ్యూ స్టేడియంలో సత్యసాయి శతవర్ష జయంతి వేడుకలు ఆదివారం అశేష భక్తుల నడుమ విశ్వవేడుకలా జరిగాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి బాబా అహింస, ప్రేమ, నిస్వార్థ సేవలకు ప్రతిరూపంగా నిలిచారన్నారు. తన చిన్నతనంలో తమిళం మాత్రమే మాట్లాడే తన అత్త సుదూరంలో ఉండే పుట్టపర్తికి వచ్చి 15రోజులు ఇక్కడే నుండి సత్యసాయి ఆశీర్వాదాలు పొందడం బాబా దైవిక శక్తికి నిదర్శనమని చిన్ననాటి అనుభవాన్ని స్మరించుకున్నారు.‘లవ్ ఆల్.. సర్వ్ ఆల్’, ‘హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్’ అన్న సత్యసాయి నినాదాలు కోట్లాది గుండెలను కదిలించాయన్నారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా అందుతున్న సేవలు కోట్లాది మంది ప్రజలకు జీవనాడిగా ఉన్నాయన్నారు. ప్రపంచం ఘర్షణలు, ఒత్తిడితో నిండిన పరిస్థితులలో సత్యసాయి చూపిన మార్గం వాటికి పరిష్కారం చూపగలదన్నారు. ఆధ్యాత్మిక, సేవాస్ఫూర్తి సత్యసాయి నేటి తరానికి ఇచి్చన వారసత్వం అన్నారు. రాబోయే తరానికి బాబా వారసత్వాన్ని మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిçÜ్తూ అందించాలని పిలుపునిచ్చారు. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్రాజు మాట్లాడుతూ.. సత్యసాయి సంకల్ప బలం కుగ్రామం పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చిందన్నారు.సత్యసాయి నిరాడంబరతతో మానవాళికి నిస్వార్థ సేవలు అందించి ప్రేమ మూర్తిగా, సేవా స్ఫూర్తిగా కోట్లాది మంది భక్తులను సేవామార్గం వైపు నడిపారన్నారు. త్రిపుర గవర్నర్ ఎన్.ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. బాబా మానవాళి శ్రేయస్సు కోసం ఏడు దశాబ్దాల క్రితం స్థాపించిన సత్యసాయి ట్రస్ట్ ప్రపంచవ్యాప్త సేవా ఉద్యమంగా మారిందని, ఇది సత్యసాయి సంకల్ప బలానికి నిదర్శనమని అన్నారు. విద్య, వైద్యం, తాగునీటి రంగాలలో సత్యసాయి అందించిన సేవలు ఎంతో గొప్పవన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సత్యసాయి అవతార పురుషుడన్నారు. మానవతా విలువలను, ఆధ్యాత్మిక చింతనను బోధిస్తూ నూతన అధ్యాయాన్ని లిఖించారన్నారు. ఆయన అడుగుజాడల్లో నడవడం నేటి తరం బాధ్యత అన్నారు. కనుల పండువగా స్వర్ణ రథోత్సవం ఆదివారం ఉదయం 9 గంటలకు సత్యసాయి స్వర్ణ రథోత్సవం కనుల పండువగా సాగింది. దేశం నలుమూలల నుంచి తరలివచి్చన సత్యసాయి సేవా సంస్థల ప్రతినిధులు, భక్తులు ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సత్యసాయి బోధనలు, సూక్తుల ప్లకార్డులను చేతబూని, నృత్య ప్రదర్శనలతో ముందు సాగగా.. ఆ వెనుక సత్యసాయి స్వర్ణ రథం కదిలింది. ‘కదిలింది.. కదిలింది సాయి రథం.. స్వర్ణరథం’ అంటూ ప్రముఖ గాయకుడు మను గానానికి అనువుగా భక్తులు ఆనంద డోలికల్లో తేలుతూ రథోత్సవాన్ని సాగించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల బాలవికాస్ చిన్నారులు మానవతా విలువలను చాటుతూ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు మైమరపించాయి. సాయంత్రం సత్యసాయి జోలోత్సవం నిర్వహించారు.ప్రజల్లో దేవుడిని చూసిన మహానుభావుడు: సీఎం రేవంత్సత్యసాయి ప్రజల్లో దేవుడిని చూస్తూ మానవసేవే మాధవ సేవ అని నిరూపించిన మహానుభావుడని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బాబా తన ప్రేమతో మనుషుల్ని గెలిచారని, ప్రేమతో ఏదైనా సాధించవచ్చని నిరూపించారని చెప్పారు. ‘కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తూ ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు. ప్రభుత్వాలు కూడా చేయలేని సేవలను సత్యసాయి చేసి చూపించి తన సంకల్ప బలాన్ని చాటుకున్నారు. పేదలకు ఉచిత వైద్యం లాంటి తన సేవలతో దేవుడిగా పూజింపబడుతున్నారు.గతంలో పాలమూరు జిల్లాలో బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజలకు తాగునీటి కష్టాల నుంచి విముక్తి కల్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనే కాదు తమిళనాడు, కర్ణాటకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 140 దేశాల్లో బాబా ట్రస్ట్ సేవలు కొనసాగుతున్నాయి. ఆయన మన మధ్య లేకపోయినా వారి స్ఫూర్తి మనందరిలో ఉంది. మనతో పాటు ప్రపంచంలోని కోట్లాది మంది జీవితాలలో బాబా స్ఫూర్తి నింపారు. తెలంగాణలోనూ ఉత్సవాలు సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవం, అరుదైన అవకాశం. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు రావడం ఈ నేల పవిత్రతను తెలియజేస్తోంది. బాబా సేవలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణలోనూ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించాం. తెలంగాణలో బాబా సేవలను విస్తృతం చేసేందుకు మా ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
మనసే ప్రశాంతి నిలయం
ఆధునిక ప్రపంచంలో ప్రతి వ్యక్తి శాంతిని పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తాడు. అయితే కేవలం ఆధ్యాత్మిక సూత్రాల ద్వారానో లేదా మార్కెట్ నుండి వస్తువుగానో ప్రశాంతత పొందలేము. అలాగే గ్రంథాల జ్ఞానం ద్వారా లేదా జీవితంలో ఉన్నత స్థానం ద్వారా కూడా దానిని పొందలేము. ‘నాకు ప్రశాంతత కావాలి’ అని పరితపించేవారు ముందుగా ‘నేను, నాకు, నాది’ అనే స్వార్థాన్ని విడనాడాలని, అలాగే, ‘ఇది ఎలాగైనా నా సొంతం కావాల్సిందే’ అనే దురాశను తొలగించుకోవాలి. అప్పుడే అన్ని అశాంతులూ తొలగి మానసిక ప్రశాంతత చేకూరుతుందంటారు భగవాన్ సత్యసాయి బాబా.నిష్కామ కర్మ ఆచరిస్తూ, ఆధ్యాత్మిక ధర్మాలను పాటిస్తూ, జ్ఞాన చక్షువులతో అందరిలో, అన్నింటిలో ఆ దైవాన్ని దర్శించడమే అసలైన వేదాంతం అంటారు సాయి. భగవాన్ చెప్పిన ‘అందరినీ ప్రేమించు అందరినీ సేవించు’ అనే ఒక్క మహా వాక్యం అందరి జీవితాలను ఉన్న స్థితినుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లే మహాబోధ. మోక్షానికి దగ్గర చేసే మార్గం. ‘ప్రచారం, ఆర్భాటం, ప్రదర్శన కోసం చేసే సేవ మీ కీర్తిప్రతిష్ఠలు పెంచవచ్చునేమో కానీ అది సమాజానికి మంచి సందేశాన్ని, స్ఫూర్తిని ఇవ్వలేదు’ అన్నది సత్యసాయి బోధల సారం. ‘మనలో సేవాభావం ఉంటే, అది వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ఉన్నతమైన గుణసంపదను ఇస్తుంది’ అని భగవాన్ తన విద్యాసంస్థలలో చదువుకునే విద్యార్థులకు బోధించేవారు.దృఢమైన భక్తి, నియమ పాలన, కర్తవ్య శీలత, యుక్తాయుక్త విచక్షణ, సాధించి తీరాలనే సంకల్పం... ఈ అయిదూ విజయానికి చేరువ చేసే సోపానాలని బాబా బోధించేవారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస, విలువలు పాటించే ప్రతి మనిషీ దైవ సమానుడేనన్నది సత్యసాయి సందేశం. – డి.వి.ఆర్. -
సత్య సాయి సేవలో విఖ్యాత వ్యాపారవేత్తలు
తన ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులను సంపాదించుకున్న సత్య సాయిబాబా (Sri Sathya Sai Baba) ముఖ్యంగా సేవా కార్యక్రమాల ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు. అన్ని రంగాలలోనూ సత్య సాయిబాబా భక్తులు ఉన్నారు. అలాగే వ్యాపార రంగానికి చెందిన ఎందరో ప్రముఖలు, పారిశ్రామికవేత్తలూ ఆయన సేవలో తరించారు. సత్య సాయిబాబా శత జయంతి సందర్భంగా వారిలో కొందరి గురించి..ర్యుకో హిరా: జపాన్కు చెందిన హెచ్ఎంఐ హోటల్ గ్రూప్ వ్యవస్థాపకులు. ప్రముఖ అంతర్జాతీయ సాయి భక్తులలో ఒకరు. ప్రశాంతి నిలయంలోని సాయి హీరా గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ దాత ఈయనే. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ధర్మకర్తగా కూడా ఉన్నారు.రతన్ టాటా: టాటా సన్స్ దివంగత చైర్మన్. సాయిబాబా కార్యక్రమాలకు హాజరై ఆయన పట్ల గౌరవప్రదమైన ఆధ్యాత్మిక అభిమానాన్ని కొనసాగించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమ రూపకల్పనకు సహాయ సహకారాలందించారు.ఇందులాల్ షా: చార్టర్డ్ అకౌంటెంట్ అయిన ఈయన వ్యాపార వర్గాలలో ప్రముఖుడిగా పేరు గాంచారు. సాయి సంస్థల ప్రపంచ విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఏవీఎస్ రాజు: పారిశ్రామికవేత్త, ఎన్సీపీ (నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ) వ్యవస్థాపకుడు. సాయిబాబాకు అత్యంత భక్తుడు. సాయిబాబాపై అనేక పుస్తకాలు రాశారు.మనోహర్ శెట్టి: ఆతిథ్య, మౌలిక సదుపాయాల రంగంలో వ్యాపారవేత్త. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్కు ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో అనేక సేవ, నిర్మాణ కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు.వేణు శ్రీనివాసన్: టీవీఎస్ మోటార్ కంపెనీ ఛైర్మన్. బాబా దీర్ఘకాల భక్తుడు. సాయిబాబాతో తన ఆధ్యాత్మిక అనుభవాల గురించి పలుసార్లు పంచుకున్నారు. అనేక సాయి సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.లియో ముత్తు: లియో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ (తమిళనాడు) వ్యవస్థాపకుడు. సాయి బోధనల ప్రభావానికి గురై ఆయనకు భక్తుడిగా మారారు.క్రిస్ గోపాలకృష్ణన్: యాక్సిలార్ వెంచర్స్ చైర్మన్. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఈయన సత్యసాయి ఆరాధకుడిగా పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. -
బాబాకు ఇష్టమైన ఏనుగు
సాయిగీత అనేది శ్రీ సత్యసాయిబాబాకు ఎంతో ఇష్టమైన ఏనుగు. ఈ ఏనుగును సత్యసాయి బాబా ప్రేమగా చూసుకునేవారు. ఆ ఏనుగు చనిపోయిన తర్వాత దానికి పుట్టపర్తిలో ఒక సమాధి నిర్మించారు. ఇక్కడ సాయిగీత (ఏనుగు) సమాధికి నిత్యపూజలు నిర్వహిస్తారు. శ్రీ సత్యసాయిబాబా 1962లో ముదుమలై అటవీ ప్రాంతానికి పర్యటనకు వెళ్లినప్పుడు, అనాథగా మిగిలిన గున్నటేనుగును అటవీ అధికారులు అప్పగించారు. బాబా దానిని చేరదీసి, దానికి సీసాతో పాలు తాగించారు. తనతో పాటు పుట్టపర్తికి తీసుకొచ్చారు. సాయిగీత అని పేరు పెట్టి అల్లారుముద్దుగా చూసుకునేవారు. సాయిగీత ఎల్లవేళలా శ్రీ సత్యసాయిబాబాను వెన్నంటి ఉండేది. సాయిగీత 2007 మే 22న తుదిశ్వాస విడిచింది. బాబా స్వయంగా దగ్గరుండి శాస్త్రోక్తంగా అంతిమసంస్కారం జరిపించారు. -
నేను సాయిబాబాను
ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేకత ఉంది. మూడు పవిత్రతల సమ్మేళనం భగవాన్ శతజయంతి ఉత్సవాలు, దీపావళి పర్వదినం, అవతార ప్రకటన దినం ఒకేసారి రావడంతో భక్తుల్లో పండుగ వాతావరణం నెలకొంది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల రోజుల ముందు నుంచి పుట్టపర్తి వ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అవతార ప్రకటన దినం ఓ వేడుకలా సాగింది. అదే రోజున దీపావళి పండుగ రావటంతో సందడి వాతావరణం నెలకొంది. నాదస్వరం, వేదఘోష, సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ బ్యాండ్ వాయిద్యాలతో సభా మందిరం సాయి నామస్మరణతో మార్మోగింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ ఉదయం ప్రశాంతి నిలయంలో భక్తి ఆధ్యాత్మికతలు వెల్లివిరిశాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థినులు దేశం నలుమూలల నుంచి చేరి సాయి చరిత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టమైన అవతార ప్రకటన దినోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎనభై ఐదేళ్ల క్రితం ఇదే రోజున పుట్టపర్తికి చెందిన పద్నాలుగేళ్ల దివ్యబాలుడు, చిన్న సత్య తన దివ్య స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేశాడు. ‘నేను సాయిబాబాను’ అని ప్రకటించిన ఆ మాటలు మానవ చరిత్రలో దిశ మార్చిన శబ్దాలుగా మారాయి. అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, దైవ అవతరణకు నిదర్శనంగా అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థులు ‘సాక్షాత్ పరబ్రహ్మ సాయి’ అనే ప్యానల్ చర్చ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవాన్ అవతార లక్ష్యం, మార్గం గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. వేడుకలు సంగీత సమర్పణతో ముగిశాయి. సాయిబాబాపై రాసిన ప్రతి పాటలోనూ.. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం కనిపించాయి. -
శ్రీ సత్యసాయి బాబా సూక్తులు
→ ఆశలకోసం కాదు, ఆశయాలకోసం జీవించు→ నిన్ను ఇతరులు ఎలా గౌరవించాలని ఆశిస్తావో ముందు నీవు వారిని ఆ రీతిగా గౌరవించు.→ అతి భాష మతిహాని, మితభాష అతిహాయి→ సత్యం నా ప్రచారం, ధర్మం నా ఆచారం, శాంతి నా స్వభావం, ప్రేమ నా స్వరూపం.→ ప్రార్థించే పెదవులకన్న సేవచేసే చేతులు మిన్న→ గ్రామసేవే రామ సేవ, జనసేవే జనార్దన సేవ→ హరికి దాసులు కండి, సిరికి కాదు.→ విద్య జీవిత పరమావధికే గానీ జీవనోపాధికి కాదు→ భక్తి అనేది దేవుని కోసం కన్నీరు పెట్టడం కాదు, దేవుని సంతోషం కోసం జీవించడం.→ భక్తి అంటే నిరంతర ప్రేమ, ప్రతిఫలం ఆశించని ప్రేమ.→ నా భక్తుల ప్రేమే నాకు ఆహారం, వారి సంతోషమే నా శ్వాస.→ నీ దినచర్యను ప్రేమతో ప్రారంభించు, ప్రేమతో నింపు, ప్రేమతో అంత్యం గావించు. దైవ సన్నిధికి మార్గం ఇదే.→ ప్రేమే నా స్వరూపం, సత్యమే నా శ్వాస, ఆనందమే నా ఆహారం.→ ఉన్నది ఒకే కులం – మానవ కులం. ఉన్నది ఒకే మతం –ప్రేమమతం. ఉన్నది ఒకే భాష – హృదయ భాష. ఉన్నది ఒకటే దైవం – ఆయన సర్వాంతర్యామి.→ భగవంతుడు బాహ్యప్రియుడు కాదు. భావ ప్రియుడు→ మతులు మంచివైతే అన్ని మతములూ మంచివే.→ భగవంతుడు నీ మతమును చూడడు, నీ మతిని చూస్తాడు.→ ప్రేమతో ‘సాయీ’ అని పిలిస్తే ‘ఓయీ’ అని పలుకుతాను→ నా జీవితమే నా సందేశం. -
సేవకు ప్రతిరూపం... ఆధ్యాత్మిక కెరటం
సత్యసాయిబాబా తన జీవన ప్రస్థానంలో సత్య ధర్మ శాంతి ప్రేమలనే విలువలను బోధిస్తూ, మానవాళిని విలువైన జీవన మార్గం వైపు పయనింపజేశారు. ఆధ్యాత్మిక బోధనలతో అజ్ఞానాంధకారాన్ని పారదోలుతూ భక్త కోటిలో చైతన్యకాంతులు నింపారు. ప్రేమను పంచే ప్రేమమూర్తిగా, సేవకు ప్రతి రూపంగా; ఉచితంగా తాగునీరు, విద్య, వైద్య సేవలను అందించి సేవాప్రదాతగా కీర్తి గడించారు. పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. ఆపదలో భక్తులను ఆదుకునే ఆపద్బాంధవుడిగా, ఆరాధ్య దైవంగా భక్తుల మదిలో గూడుకట్టుకున్న సత్యసాయి నిర్యాణం చెంది పద్నాలుగేళ్లు పూర్తవుతున్నా, భక్తులు మాత్రం ఆయననే తమ శ్వాసగా, ధ్యాసగా కొలుస్తున్నారు. సత్యసాయి జయంతిని ఎంతో పవిత్రంగా భావించే భక్తులు పుట్టపర్తిలో జరుగుతున్న జయంతి వేడుకలకు తరలి వచ్చి భక్త నీరాజనాలు అర్పిస్తున్నారు.కరవుకు నిలయమైన అనంతపురం జిల్లాలోని అప్పటి కుగ్రామమైన పుట్టపర్తిలో 1926 నవంబర్ 23న ఈశ్వరాంబ, పెద్ద వెంకమరాజు దంపతులకు సత్యసాయి జన్మించారు. బాల్యం నుంచి ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉన్న సత్యసాయి, తన 14 వ ఏట తాను సత్యసాయి బాబాను, భూమిపై ధర్మ పరిరక్షణకు అవతరించినట్లు ప్రకటించుకున్నారు. నాటి నుంచి పుట్టపర్తిలో మందిరం ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మిక బోధనలు వినిపిస్తూ, తనను ఆరాధించే భక్తులను దగ్గరకు చేర్చుకున్నారు.మానవ సేవయే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి, ఒక వైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే, కనీస అవసరాలకు నోచుకోని బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను ప్రారంభించారు. అప్పటి నుంచి విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందించే కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రకృతి విపత్తులు సంభవించే సమయాల్లో తన సేవాదళ్ విభాగాల ద్వారా బాధితులకు సేవలు అందిస్తున్నారు.కేజీ నుంచి పీజీ వరకువిద్య మనిషిని అవివేకం నుంచి వివేకవంతుణ్ణి చేస్తుందని విశ్వసించిన సత్యసాయిబాబా.. పుట్టపర్తి కేంద్రంగా కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా మానవతా విలువలతో కూడిన విద్యను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. పుట్టపర్తిలో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ యూనివర్శిటీని (డీమ్డ్ టు బి యూనివర్సిటీ) ఏర్పాటు చేశారు. పుట్టపర్తి, నందిగిరి, అనంతపురం, బెంగళూరు సమీపాన బృందావనం వద్ద నాలుగు క్యాంపస్లు నిర్వహిస్తున్నారు. అనంతపురం క్యాంపస్ ద్వారా మహిళా విద్యను ప్రోత్సహిస్తున్నారు.ప్రతి ఏటా సుమారు పదివేల మందికి పైగా విద్యార్థులు సత్యసాయి విద్యాసంస్థల ద్వారా ఉచిత విద్యను పొందుతున్నారు. దేశీయంగా గ్రామీణ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉన్న మారుమూల ప్రాంతాలలో విలువలతో కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో 2010లో విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం దేశీయంగా 126 పాఠశాలలు ఈ పథకం ద్వారా విద్యను అందిస్తున్నాయి. ఈ సంస్థల ద్వారా విద్యను పొందిన ఎందరో విద్యార్థులు నేడు ఉన్నత స్థానాలలో సేవలు అందిస్తున్నారు.పైసా ఖర్చు లేకుండా‘వైద్యో నారాయణ హరి’ అనే నానుడిని సాకారం చేస్తూ సత్యసాయి ఉచిత వైద్యసేవకు ప్రాధాన్యం ఇచ్చారు. పుట్టపర్తి ప్రాంతంలో పేదలు వైద్యం అందక బాధలు పడుతున్నారని, ఒక ఆసుపత్రి నిర్మించాలని తల్లి ఈశ్వరాంబæకోరగా, తన తల్లికి ఇచ్చిన మాటకు కట్టుబడి పుట్టపర్తిలో 1956లో పుట్టపర్తి నడిబొడ్డున 30 పడకల జనరల్ ఆసుపత్రి నిర్మించారు. తర్వాత 1991లో ఆధునిక వసతులతో కూడిన శ్రీసత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని స్థాపించారు. ఈ ఆసుపత్రుల ద్వారా రోగులు ఉచితంగా ఖరీదైన వైద్యసేవలు పొందుతున్నారు.ఉచిత తాగునీటి సరఫరానిత్యం కరవుతో అల్లాడే రాయలసీమలో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవు. రాయలసీమ ప్రజల కష్టాలను చూసి చలించిన సత్యసాయి 1995 నవంబర్లో రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు సత్యసాయి తాగునీటి పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో సుమారు 1,400 గ్రామాలు ఈ పథకం ద్వారా తాగునీటిని పొందుతున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి కూడా తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరు నుంచి ‘సత్యసాయి తాగునీరు’ సరఫరా అవుతోంది. ప్రతిరోజూ సుమారు 20 లక్షల మంది సత్యసాయి తాగునీటి పథకం వినియోగించుకుంటున్నారంటే.. సాయి సంకల్పం ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. -
‘అనంత’ భగీరథుడు సత్యసాయి
జలం జీవాధారం. నీరు లేని చోట జీవితం లేదు. ఎక్కడ దాహార్తి ఉందో... అక్కడే సేవ ఉండాలి... -భగవాన్ శ్రీ సత్యసాయి బాబాఅనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు రూ.300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1995 నవంబర్ 18న ప్రారంభించారు.దివిజ గంగను భువికి దించిన భగీరథుడు ఎంతటి లోకోపకారం చేశాడో, శ్రీ సత్యసాయిబాబా కూడా తాగునీటికి అల్లాడుతున్న ప్రాంతాల్లోని ప్రజలకు అంతటి ఉపకారం చేశారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లోని 1051 గ్రామాలకు; తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 452 ఎత్తయిన ప్రాంతాలు, గిరిజన ఆవాసాలకు, చెన్నై నగరానికి తాగునీటిని అందించడానికి సత్యసాయి గంగ ప్రాజెక్టును, నీటిశుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజల దాహార్తి తీరుతోంది.అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టుఆంధ్రప్రదేశ్లోని కరవుపీడిత జిల్లా అనంతపురం. దేశంలో రాజస్థాన్లోని జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే రెండోప్రాంతం అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో ప్రవహించే పెన్నా, హగరి, చిత్రావతి నదులు వేసవిలో ఎండిపోతాయి. ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటమే కాకుండా, నీటిలో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండటం వల్ల ఇక్కడి ప్రజలలో శారీరక వైకల్యాలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉండేవి. ప్రజలు తమ దైనందిన అవసరాల కోసం నీరు తెచ్చుకోవడానికి చాలా దూరం నడవాల్సి వచ్చేది. ఫలితంగా విపరీతమైన అలసటకు లోనై కీళ్లనొప్పులతో బాధపడేవారు.అనంతపురం జిల్లాలోని గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం ట్రస్టు నిధులు సమకూరుస్తుందని శ్రీ సత్యసాయి బాబా 1994లో ప్రకటించారు. రూ. 300 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టును నాటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావు 1995 నవంబర్ 18న ప్రారంభించారు. దీనిని 1997 అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించారు.ఈ ప్రాజెక్ట్ నిర్మాణం, నిర్వహణల కోసం లార్సెన్ అండ్ టూబ్రో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా రెండువేల కిలోమీటర్ల పొడవున వివిధ పరిమాణాల్లోని పైప్లైన్లు వేశారు. దాదాపు 100,000 లీటర్ల నుంచి 2,500,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 43 సంపులు నిర్మించారు. అలాగే,3,00,000 లీటర్ల నుంచి 10,00,000 లీటర్ల సామర్థ్యం కలిగిన 18 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను కొండల పైభాగంలో నిర్మించారు. వీటికి తోడు 270 ఓవర్హెడ్ రిజర్వాయర్లను, 125 గ్రౌండ్–లెవల్ రిజర్వాయర్లను ఏర్పాటు చేశారు. వివిధ గ్రామాల్లో 2500 లీటర్ల సామర్థ్యం కలిగిన 1500 కంటే ఎక్కువ ప్రీకాస్ట్ కాంక్రీట్ సిస్టెర్న్లను ఏర్పాటు చేశారు. ప్రతి సిస్టెర్న్లో ప్రజలు నీటిని సేకరించడానికి నాలుగు కుళాయిలు ఉన్నాయి. భారత ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందిన ఈ భారీ ప్రాజెక్టు కింద 731 గ్రామాలకు ఉచితంగా తాగునీరు సరఫరా అవుతోంది.భారత ప్రభుత్వం తొమ్మిదవ పంచవర్ష ప్రణాళిక పత్రం ఈ ప్రాజెక్టును ప్రశంసిస్తూ ట్రస్ట్కు ఒక ప్రశంసాపత్రాన్ని అందించింది, ఆ ప్రశంసాపత్రంలో ‘శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఏ రాష్ట్ర బడ్జెట్ మద్దతు లేకుండా, సొంతంగా ఒక ప్రాజెక్టును అమలు చేయడంలో అసమానమైన ఉదాహరణగా నిలిచింది, ఇది 731 నీటిఎద్దడి, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని కొన్ని పట్టణాలకు దాదాపు 18 నెలల కాలపరిమితిలో ప్రయోజనం చేకూర్చేలా రూ. 300 కోట్ల్ల వ్యయంతో ఒక భారీ నీటి సరఫరా ప్రాజెక్టు’ అని శ్లాఘించింది.గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడంలో సత్యసాయి బాబా చేసిన నిరుపమానమైన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వ తపాలా శాఖ 1999 నవంబర్ 23న ఒక తపాలా బిళ్ళను, ఒక పోస్టల్ కవర్ను విడుదల చేసింది.జపాన్లోని ఒసాకాలో 2003లో జరిగిన మూడవ ప్రపంచ జల వేదికలో సత్యసాయి నీటి ప్రాజెక్టును ప్రస్తుతిస్తూ ఒక ప్రతినిధి దీనిని కేస్ స్టడీగా మాత్రమే కాదు, మానవాళికి ప్రేమను పంచే కథగా కూడా చూడాలని కొనియాడారు. మెక్సికోలో 2006లో జరిగిన నాలుగో ప్రపంచ జల వేదికలో ఈ ప్రాజెక్టు ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన మిలీనియం అభివృద్ధి లక్ష్యాలకు దోహదపడే అత్యుత్తమ పది స్థానిక కార్యాచరణలలో ఒకటిగా ఎంపికైంది.సత్యసాయి గంగ కాలువతమిళనాడు రాజధాని చెన్నై (అప్పటి మద్రాస్), దాదాపు 1.19 కోట్ల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ నగరం . ‘డెట్రాయిట్ ఆఫ్ ఆసియా’గా పేరుపొందిన చెన్నై మహానగరం– ఆటోమొబైల్స్, బీపీఓ, సాఫ్ట్వేర్, డేటా సెంటర్లు, వస్తూత్పత్తి, వైద్య పర్యాటకం, ఫిన్ టెక్ పరిశ్రమలకు కేంద్రంగా ఉంది. ఈ నగరంలో 2004 డిసెంబర్ వరకు తీవ్రమైన నీటి ఎద్దడి ఉండేది. ప్రజలు మంచినీటి కోసం కుళాయిల వద్ద బారులు తీరి ఉండేవారు. చెన్నై నగరానికి సమీపంలో ప్రధాన నదులేవీ ప్రవహించవు. అందువల్ల చెన్నై పంతొమ్మిదో శతాబ్ది చివరి రోజుల నుంచి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉండేది. 2004 సంవత్సరానికి ముందు నగరంలోని కొన్ని ప్రాంతాలు వేసవిలో ఒక్కోసారి వరుసగా మూడు రోజులు నీటి సరఫరా లేకుండా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నగరానికి రోజుకు దాదాపు 750 మిలియన్ లీటర్ల నీరు అవసరమైతే, కేవలం 250 మిలియన్ లీటర్ల సరఫరా మాత్రమే ఉండేది.1960ల ప్రారంభంలో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా 15 టీఎంసీల నీటిని కృష్ణానది నుంచి మద్రాసుకు తీసుకువస్తామని ప్రకటించింది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలు తమ వాటా కృష్ణా నీటిలో 5 టీఎంసీలను సమకూరుస్తాయి.శ్రీశైలం జిల్లాలోని సోమశిల జలాశయం నుండి 150 కిలోమీటర్ల పొడవైన కాలువ ద్వారా నీటిని నెల్లూరు జిల్లాలోని కండలేరు జలాశయానికి, అక్కడి నుండి చెన్నై నగరానికి నీటిని సరఫరా చేసే తమిళనాడులోని పూండి జలాశయానికి తీసుకెళ్లాలి. కండలేరు, పూండి జలాశయాలను కలిపే కండలేరు–పూండి కాలువను తెలుగు గంగ అని పిలుస్తారు. ఇది 1996లో పూర్తయింది.అయితే, ప్రణాళికాబద్ధమైన 15 టీఎంసీల నీటిలో, కేవలం 0.5 టీఎంసీ నీరు మాత్రమే పూండి జలాశయానికి చేరుకునేది. మిగిలిన నీరు బాష్పీభవనం, నీరు కారడం, కాలువ గోడల కోత కారణంగా పోయింది. కొన్ని సంవత్సరాల తరువాత కాలువ శిథిలావస్థకు చేరుకుంది. లక్షలాది మంది చెన్నై ప్రజలకు నీటి ఎద్దడి తీవ్రమై, ఈ సమస్యకు పరిష్కారం కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో చెన్నై నీటి సమస్యను పరిష్కరించడానికి తాను దృఢ సంకల్పంతో ఉన్నట్లు శ్రీ సత్యసాయి బాబా 2001 జనవరి 19న ప్రకటించారు.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ చేపట్టిన చెన్నై నీటి ప్రాజెక్టు జూలై 2002లో ప్రారంభమైంది. ఇది చెన్నైకి తగినంత తాగునీటిని సరఫరా చేయడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని దాదాపు 3 లక్షల ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందిస్తుంది.ఈ ప్రాజెక్టులో భాగంగా శిథిలావస్థలో ఉన్న కండలేరు–పూండి కాలువను పునరుద్ధరించి, కండలేరు జలాశయం సామర్థ్యాన్ని పెంచారు. మొత్తం 150 కి.మీ. పొడవున్న కండలేరు–పూండి కాలువలో 65 కిలోమీటర్లు లైనింగ్ వేశారు. వరదలు సంభవించినప్పుడు నీటిని మళ్లించడానికి మూడు ఎస్కేప్ రూట్లను నిర్మించారు.ఈ ప్రాజెక్టు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని, వేగంగా అభివృద్ధి చెందింది. దీని నిర్మాణానికి దాదాపు నాలుగువేల మంది కార్మికులు అహరహం పనిచేశారు. ఈ ప్రాజెక్టు రికార్డు సమయంలో కేవలం పదహారు నెలల వ్యవధిలోనే పూర్తయింది.ఇప్పుడు చెన్నైకి సరఫరా అయ్యే నీరు తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు కండలేరు వద్ద ఉన్న జలాశయం నిండిపోవడం విశేషం. చివరగా బాబా 79వ పుట్టినరోజున– 2004 నవంబర్ 23న, కండలేరు జలాశయం గేట్లు తెరిచారు. ఇది వరకు గేట్లు తెరవగానే ఇక్కడ ఉప్పొంగే జలాలు చెన్నై వరకు 150 కిలోమీటర్లు చేరుకోవడానికి దాదాపు పదిరోజులు పట్టేది. పునరుద్ధరణ తర్వాత కేవలం నాలుగు రోజుల్లోనే ఈ జలాలు తమిళనాడు సరిహద్దులకు చేరుకుంటుండటం విశేషం. పునరుద్ధరణ తర్వాత నీరు విడుదలైన కొద్ది రోజులకు– 2004 డిసెంబర్ 11న చెన్నై నుంచి పలువురు భక్తులు బాబాకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ప్రశాంతి నిలయం చేరుకున్నారు. బాబాకు కృతజ్ఞతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కండలేరు–పూండి కాలువ ప్రాజెక్టును ‘తెలుగు గంగ’కు బదులుగా ‘సత్యసాయి గంగ’గా నామకరణం చేసింది.శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తాగునీటి సరఫరా, నీటి శుద్ధీకరణ అవసరాలను తీర్చడానికి శ్రీ సత్యసాయి బాబా ఆధ్వర్యంలో ‘శ్రీ సత్యసాయి జాతీయ తాగునీటి మిషన్’ ఏర్పాటైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలకు చెందిన 177 జిల్లాల్లో తాగునీటి వనరులు మోతాదుకు మించిన ఫ్లోరైడ్తో కలుషితమయ్యే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి వల్ల దాదాపు 6.2 కోట్ల మందికి పైగా ప్రజలు సతమతం అవుతుండేవారు. ఈ సమస్యను చక్కదిద్దడానికి శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ఆధ్వర్యంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సెంట్రల్ ట్రస్టు నిధులతో నీటి శుద్ధీకరణ వ్యవస్థల ఏర్పాటుకు శ్రీకారం చుట్టాయి. ఇందులో భాగంగా 2020 నాటికి ఆరు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో రూ.5.4 కోట్ల పెట్టుబడితో 108 నీటి శుద్ధీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నీటి శుద్ధీకరణ కేంద్రాలు నీటి నుంచి కాలుష్య కారకాలైన ఆర్సెనిక్ వంటి భార లోహాలను తొలగించగలవు.ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఈ మిషన్ 10 మండలాల్లోని 350 గ్రామాలకు తాగునీటిని అందించింది, ఈ ప్రాంతంలో 4,40,585 జనాభా ఉంది. ఈ ప్రాజెక్టులో కొండ ప్రాంతాల గుండా పైపులైన్లు వేయడంతో పాటు నిల్వ సౌకర్యాలను ఏర్పాటు చేశారు. 2018–2019లో కేరళలోని సత్యసాయి సేవా సంస్థ ప్రారంభించిన సత్యసాయి ప్రేమధార ప్రాజెక్ట్ 119 నీటి వడపోత యూనిట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 14 జిల్లాల్లోని దాదాపు 1,65,000 మంది పౌరులకు ప్రతిరోజూ స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తోంది.మెదక్, మహబూబ్ నగర్ ప్రాజెక్ట్అనంతపురం తాగునీటి సరఫరా ప్రాజెక్టు విజయవంతం అయిన తరువాత, తెలంగాణ రాష్ట్రంలోని (అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని కరువు పీడిత, ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాల ప్రజలకు సురక్షితమైన స్వచ్ఛమైన తాగునీటిని అందించడానికి ట్రస్ట్ ఇలాంటి ప్రాజెక్టులను చేపట్టింది. దాదాపు 320 గ్రామాలు ఈ ప్రాజెక్టుల లబ్ధిదారులుగా ఉన్నాయి.ప్రాజెక్ట్ వివరాలు» రూ.300 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు నోచుకుంది.» దాదాపు 2800 కిలోమీటర్ల పైపులైన్లు వేసి, సుమారు 40 లక్షల మందికి నీటి సరఫరా చేసే సామర్థ్యంతో రూపొందింది.ముఖ్య నిర్మాణాలు» పెద్దకోట్లలో హెడ్వర్క్స్ నిర్మాణం» మద్దెల చెరువులో 10 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం» అప్పరా చెరువు, కృష్ణాపురం రోడ్ క్రాస్, కేశాపురం, కొత్తచెరువు ప్రాంతాల్లో 5 సంపులు» కొత్తచెరువు (కొండపై), పెదపల్లి, హెచ్ఎన్ ఎస్ఎస్ టన్నెల్ వద్ద 2 గ్రౌండ్ లెవల్ బాలెన్సింగ్ రిజర్వాయర్లు» వివిధ ప్రాంతాల్లో 2 ఓవర్హెడ్ రిజర్వాయర్లు, పంప్ హౌస్లుతూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాజెక్టులుఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని వెనుకబడిన కొండ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులు, పేద ప్రజలు బోరుబావులు, వాగుల నుంచి నీటిని పొందుతున్నారు. నిత్యం ప్రవహించే గోదావరి, దాని ఉపనది పాములేరు నుంచి నీటిని సేకరించి, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ తూర్పు గోదావరిలోని 212 జనావాసాలలో సుమారు 2,20,000 మందికి; పశ్చిమ గోదావరి జిల్లాల్లోని 240 జనావాసాలలో 4,70,000 మందికి సురక్షితమైన తాగునీరు అందించడానికి ప్రాజెక్టులను చేపట్టింది . రెండు జిల్లాల్లోని ప్రాజెక్టులు పూర్తిచేసి, 2007 సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. -
సమాజ సేవే.. విద్యార్థి ధర్మం: భగవాన్ శ్రీసత్యసాయిబాబా
భారతదేశంలో ప్రాచీనకాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థకు ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఉపాధి కోసం కావలసిన భౌతిక జ్ఞానం సంపాదించుకుంటే సరిపోదు. విద్యార్థి జీవితంలో నిజమైన ఆనందం పొందాలంటే, జ్ఞానాన్ని సమాజ సేవకు వినియోగించాలని మన ప్రాచీన గురువులు తెలుసుకున్నారు. అందుకే వారు విద్యాబోధనతో పాటు ధార్మికత, బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల సౌశీల్యాన్ని పెంపొందించడమే విద్యకు గల పరమలక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఏర్పాటు చేశారు.‘సా విద్యా యా విముక్తయే’ అని వేదోక్తి. అంటే, విద్యతోనే మనిషికి విముక్తి సాధ్యం. మనిషిని విముక్తి వైపు నడిపించేదే నిజమైన విద్య. నేటికాలంలో విద్య వాణిజ్యంగా మారింది. సమాజం భౌతికంగా అభివృద్ధి చెందుతున్నా, నైతికంగా పతనమవుతోంది. సత్యం, ధర్మం, కృతజ్ఞత, భక్తి వంటి ఉన్నత విలువలు వెనుకబడిపోయి; ధనాసక్తి, అధికారదాహం పెచ్చుమీరుతున్నాయి. విద్యార్థులలో పెరుగుతున్న అశాంతి, నిరాశ, ఆందోళన– విద్యా వ్యవస్థ తన లక్ష్యాన్ని కోల్పోయిందనేందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.ఎడ్యుకేర్ – బాబా ఆవిష్కరించిన విద్యా సూత్రంవిద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయిబాబా ‘ఎడ్యుకేర్’ భావనను ప్రవేశపెట్టారు. ‘ఎడ్యుకేర్’ లాటిన్ పదం. దీని అర్థం ‘మనలో దాగి ఉన్నదానిని వెలికి తీయడం’. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల్లో ఈ విధానం విద్యార్థుల్లో ఉన్న అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి, వారిలో ఉన్నత విలువలను పాదుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్ విద్య కాదు, మనసు, హృదయం, చేతులు అనే మూడు కోణాల సమగ్రాభివృద్ధి.శ్రీ సత్యసాయి విద్యాసంస్థల ఆవిర్భావంశ్రీ సత్యసాయిబాబా 1981లో అప్పటికే అనంతపురం, వైట్ఫీల్డ్, పుట్టపర్తిలలో ఉన్న కళాశాలలన్నింటినీ ఏకీకృతం చేసి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (డీమ్డ్ యూనివర్సిటీ) నెలకొల్పారు. ఆ తర్వాత రెండేళ్లకు శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్ ప్రారంభించారు. ఈ సంస్థల్లో ప్రైమరీ స్థాయి నుంచి పోస్ట్ డాక్టరల్ స్థాయి వరకు విద్యాబోధన జరుగుతుంది. ఈ సంస్థల్లో విద్య పూర్తిగా ఉచితం. విద్యార్థులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పని ఉండదు. శ్రీ సత్యసాయి విద్యాసంస్థల విశిష్టతకు ఇదే నిదర్శనం.శ్రీ సత్యసాయి విద్యావాహిని దేశంలోని ప్రతి విద్యార్థికి సమగ్ర విద్యను అందించాలనే సంకల్పంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 2010 నవంబర్ 23న ‘శ్రీ సత్యసాయి విద్యావాహిని’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను, ప్రావీణ్యాన్ని అందించడంలో ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. ఈ సంస్థల్లో విజయవంతమైన విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించడానికి సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, సత్యసాయి విద్యావిధానాన్ని ప్రతి పాఠశాలకు, ప్రతి గురువుకు, ప్రతి విద్యార్థికి చేరవేయడానికి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవా సంసిద్ధత కలిగిన సచ్ఛీలురైన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులు కేవలం విద్యార్హతలు మాత్రమే కలిగిన వారిగా కాకుండా; దేశసేవ పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌరచైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే దీని సంకల్పం. విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని మూలసిద్ధాంతం. ఈ కార్యక్రమం కింద ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మానవీయ విలువలతో కూడిన పాఠ్యాంశాలను సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉచితంగా అందిస్తుంది.సాంకేతిక సహకారంతో సేవ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమంలో ఉన్నత విద్య, శిక్షణ, సాంకేతిక నైపుణ్యం, అనుభవం కలిగిన స్వచ్ఛంద సేవకులు అంకితభావంతో సేవలు అందిస్తున్నారు. ‘అందరికీ సమీకృత విద్య’ అనే బాబా ఆశయాన్ని సాకారం చేయడానికి నిస్వార్థంగా కృషి చేస్తున్నారు. ఇది సాధారణమైన విద్యా కార్యక్రమం కాదు, భారతీయ విద్యా వ్యవస్థను సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి అనే విలువలతో పునరుజ్జీవింపజేసే మహాయజ్ఞం. ‘విద్య అనేది కేవలం ఉపాధి కోసమే కాదు, అది దైవత్వానికి, సేవకు, సమగ్రతకు దారి చూపాలి’ అనే ప్రాచీన భారతీయ మౌలిక సూత్రానికి ఆధునిక కార్యాచరణ ప్రస్థానం.శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విద్యాసంస్థలుపుట్టపర్తి, అనంతపురం, నందిగిరి, బెంగళూరులలో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఉచిత రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ విద్యాసంస్థలను నిర్వహిస్తోంది. మానవీయ విలువలు, నైతికతలకు ప్రాధాన్యమిస్తూ ఈ విద్యాసంస్థల్లో బోధన కొనసాగుతోంది. పాఠ్యాంశాల బోధన మాత్రమే కాకుండా, పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా విద్యార్థులలో క్రమశిక్షణ, త్యాగస్ఫూర్తి, సామాజిక సేవా నిబద్ధతలను పెంపొందించేలా ఈ సంస్థలు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. వీటిలో చదువుకునే విద్యార్థులు తమ విద్యాసంస్థలకు సమీపంలో ఉన్న గ్రామాలను సందర్శించి, తప్పనిసరిగా అక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను బోధిస్తారు. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యాసంస్థలు ఇవీ...శ్రీమతి ఈశ్వరమ్మ ఇంగ్లీష్ మీడియం స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం ప్రారంభించిన నాన్ రెసిడెన్షియల్ పాఠశాల. తొలుత దీనిని 1972లో తెలుగు మీడియం పాఠశాలగా బాబా తల్లి పేరిట ప్రారంభించారు. తర్వాత 2010లో సీబీఎస్ఈ సిలబస్ ప్రకారం ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా మార్చారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం మొదటి బ్యాచ్ 2010 జూన్ 10న ప్రారంభమైంది. పుట్టపర్తి, చుట్టుపక్కల గ్రామాల విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుంటుంటారు.శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్, పుట్టపర్తి ఇది బాల బాలికల కోసం నెలకొల్పిన రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల. ఇందులో ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాబోధన జరుగుతుంది.శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖ గుర్తింపు పొందిన స్వయంప్రతిపత్తి సంస్థ. ఇది పుట్టపర్తి, వైట్ఫీల్డ్–బెంగళూరు, నందిగిరి, అనంతపురం క్యాంపస్లలో పనిచేస్తోంది.ఇది విద్యార్థులకు ఉచితంగా గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ కోర్సులను అందిస్తుంది. ఈ క్యాంపస్లలోని విద్యా వ్యవస్థ పూర్వకాలపు గురుకుల విద్యావ్యవస్థను పోలి ఉంటుంది. ఇక్కడ విద్యాబోధనతో పాటు వ్యక్తిత్వ వికాసానికి కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ పుట్టపర్తి క్యాంపస్లో సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సీఆర్ఐఎఫ్) ఉంది. అధునాతన పరిశోధన వసతులు ఈ సంస్థ ప్రత్యేకత. శ్రీ సత్యసాయి మీర్పురి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్, పుట్టపర్తి ఈ సంగీత కళాశాల 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఇది వివిధ సంగీత విభాగాలలో ఫౌండేషన్, డిప్లొమా, బ్యాచిలర్స్, మాస్టర్స్ కోర్సులను అందిస్తుంది. దీనిని 2017లో సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్లోని ఒక విభాగంగా మార్చారు.ఇతర రాష్ట్రాలలో శ్రీ సత్యసాయి పాఠశాలలుశ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని స్టేట్ ట్రస్టులు దేశంలోని వివిధ రాష్ట్రాలలో పాఠశాలలను నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్, ఇండోర్, ముంబై, దక్షిణ కన్నడ తదితర ప్రాంతాల్లో శ్రీ సత్యసాయి పాఠశాలలు నడుస్తున్నాయి. మీ తల్లిదండ్రులను గౌరవించండి.. గురువులను ఆరాధించండి..సమాజానికి సేవ చేయండి..ఇదే నిజమైన విద్యార్థి ధర్మం.‘గురువు ఇచ్చేది జ్ఞానం మాత్రమే కాదు, జీవన మార్గం చూపే వెలుగు’ అనేదివిద్యార్థులకు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా తరచుగా చేసే ఉద్బోధ.రతన్ టాటా చేతుల మీదుగా శ్రీ సత్యసాయి విద్యా వాహిని ప్రారంభంశ్రీ సత్యసాయిబాబా 2010లో తన పుట్టినరోజు సందర్భంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమ రూపకల్పనకు టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఇతోధికంగా సహాయ సహకారాలందించారు. శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమం కింద 2023 నవంబర్లో దేశంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో నైపుణ్యాలను పంచుకోవడానికి ఎన్సీఈఆర్టీ, సీఐఈటీలతో సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
శ్రీ సత్యసాయి ట్రస్ట్ ద్వారా అతున్యత వైద్య సేవలు
వైద్యులు త్యాగ స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలి. దీనికంటే గొప్ప సేవ మరొకటి లేదు. దిక్కులేని వారికి, నిస్సహాయులకు దేవుడే ఏకైక ఆశ్రయం. మానవుడు దేవుని స్వరూపం కాబట్టి, దిక్కులేని వారికి, నిస్సహాయులకు సహాయం చేయడం అతని ప్రాథమిక కర్తవ్యం. – శ్రీ సత్యసాయి బాబా‘సేవే సత్యసాధన’ అనే సూత్రంతో, సమాజంలో ఆర్థిక, సామాజిక స్థాయులకు అతీతంగా అందరికీ ఉచితంగా ఆరోగ్య సేవలు అందించడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ విస్తృతంగా కృషి చేస్తోంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, మానవాళి సేవలో అగ్రగామిగా నిలిచిన ఒక పుణ్య సంస్థ. ‘ప్రేమతో చేసే సేవే నిజమైన సేవ’ అనే సూత్రాన్ని ఆచరణలో అమలు చేస్తూ, ఈ ట్రస్ట్ సమాజంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం లేకుండా ఉచిత వైద్య సేవలను అందిస్తోంది.శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ లక్ష్యాలుపేద ప్రజల ఇంటి ముంగిటకు సమగ్ర ఆరోగ్య సంరక్షణను సాధించడం.ఆరోగ్యం – పరిశుభ్రతతో సహా నివారణ ఆరోగ్య సంరక్షణపై ఆడియో విజువల్ ప్రెజెంటేషన్ల ద్వారా అనారోగ్యానికి దూరంగా ఎలా ఉండాలో ప్రజలకు అవగాహన కల్పించడం.ఆరోగ్య సంరక్షణ అమలులో అనుసరించే సూత్రాలు :శ్రీ సత్యసాయి బాబా అమలు చేసిన ఆరోగ్య సంరక్షణకు ఈ కింది ఆరు సూత్రాలే మార్గదర్శకాలు. వీటిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఆరోగ్య సంరక్షణ సంస్థల కార్యకలాపాలలో శ్రద్ధగా అనుసరిస్తారు. అత్యాధునిక ఆరోగ్య సంరక్షణ ఉచిత ఆరోగ్య సంరక్షణ కారుణ్య ఆరోగ్య సంరక్షణ సమగ్ర ఆరోగ్య సంరక్షణ సకాలంలో ఆరోగ్య సంరక్షణ అందించడం వైద్యుడికి, రోగికి మధ్య హృదయపూర్వక, ప్రేమపూర్వక సంబంధాన్ని పెంపొందించడమే వైద్యసేవల ఉద్దేశం. శ్రీ సత్యసాయి మెడికల్ మిషన్ సమగ్ర ఆరోగ్య సంరక్షణ, వైద్య చికిత్సలను క్రమం తప్పకుండా అందించడం ద్వారా ఈ అంశాన్ని వివరిస్తుంది. శ్రీ సత్యసాయి ఆసుపత్రులలోని సంరక్షణలో మానవీయ అంశ స్పష్టంగా కనిపిస్తుంది.శ్రీ సత్యసాయి హెల్త్ కేర్ త్రికోణ విధానంశ్రీ సత్యసాయి హెల్త్ కేర్ ఒక సమగ్ర విధానాన్ని కలిగి ఉంది, ఇది కింది మూడు కోణాల విధానం ద్వారా అమలవుతోంది. నివారణ కార్యాచరణ, నివారణ దృష్టి, ఆధ్యాత్మిక స్థావరం వ్యక్తిగత స్థాయి, కుటుంబ స్థాయి, సమాజ స్థాయి వంటి అన్ని స్థాయులలోను ఆరోగ్య విద్యకు సత్యసాయి ఆసుపత్రులు ప్రాధాన్యం కల్పిస్తున్నాయి. అలాగే, అన్ని స్థాయులలోనూ స్క్రీనింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అసంఖ్యాక రోగులకు శ్రీ సత్యసాయి సేవా మెడికల్ మిషన్ ఆశాకిరణంగా నిలుస్తోంది. ఈ సంస్థ అందించే వైద్యసేవలు ఇవీ:వివిధ రాష్ట్రాలలో నిర్వహించే వైద్య శిబిరాలు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలు, స్పెషాలిటీ శిబిరాలు, గ్రామ సేవలో భాగంగా శిబిరాలు, శ్రీసత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో వైద్య కార్యకలాపాల ఏకీకరణ, వ్యక్తిగత వైద్యుల క్లినిక్లు, అల్లోపతి, హోమియోపతి, ఆయుర్వేద చికిత్స కేంద్రాలు కూడా ఇందులో భాగంగా పనిచేస్తున్నాయి. వీటితో పాటు శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ సర్వీసెస్, టెలీ–మెడిసిన్ సేవలు, రక్తదాన శిబిరాలు (లిక్విడ్ లవ్ డొనేషన్ శిబిరాలు), సాయి పునరావాస కార్యక్రమాలు, పోషకాహార లోపం నిర్మూలన, విపత్తు నిర్వహణ తదితర సేవలను అందించడంలో ముందంజలో ఉంటున్నాయి.నివారణ ఆరోగ్య సంరక్షణ శ్రీ సత్యసాయి మొబైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ చికిత్సలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణతో పాటు ప్రివెంటివ్ మెడిసిన్పై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత వంటి ప్రాథమిక ఆరోగ్య విధానాలపై గ్రామస్థులలో అవగాహన కల్పించడానికి నిపుణులతో ప్రసంగాలు, ప్రదర్శనలు, వీడియో ప్రదర్శనలు నిర్వహిస్తారు. మద్యపానం, ధూమపానం, పొగాకు నమలడం వంటి దురలవాట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై కూడా వారికి అవగాహన కల్పిస్తారు.జనరల్ హాస్పిటల్స్ గ్రామీణ వైద్య సేవలుపుట్టపర్తిలో 1956లో స్థాపించిన శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్, 1976లో ప్రారంభమైన వైట్ఫీల్డ్ జనరల్ హాస్పిటల్, మహిళలు, పిల్లలు, వృద్ధులు, గ్రామీణ ప్రజలకు సాధారణ చికిత్సల నుంచి ప్రసూతి సేవల దాకా అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నాయి. అలాగే, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మొబైల్ ఆసుపత్రులు దూర గ్రామాలకు చేరుకుని అక్కడ ప్రజలకు వైద్యపరీక్షలు, మందులు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఉచిత వైద్యానికి ప్రతీకలు1991 నవంబర్ 22న భగవాన్ బాబా చేత శ్రీ సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ – పుట్టపర్తి ప్రారంభించబడింది.ఈ ఆసుపత్రి గుండె, మూత్రపిండాలు, న్యూరో, యూరాలజీ వంటి క్లిష్టమైన వ్యాధులపై అత్యాధునిక శస్త్రచికిత్సలు ఉచితంగా చేస్తుంది.ఆ తర్వాత 2001లో బెంగళూరులోని వైట్ఫీల్డ్లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాపించబడింది. అక్కడ కూడా గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, కేర్ యూనిట్లు ప్రపంచస్థాయి సదుపాయాలతో ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.ఈ రెండు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు లక్షలాది మంది రోగులు ఉచితంగా చికిత్స పొందారు. ప్రతి రోగికి బాబా ఆశీర్వాదం, వైద్యుల సేవానిరతి కలసిన మానవతా వాతావరణం అక్కడ ప్రతి మూలలోనూ కనిపిస్తుంది.ఉచిత వైద్య శిబిరాలుభగవాన్ నిస్వార్థ సేవకు ఉదాహరణగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా చాలామంది తమ తోటి మానవులకు సేవ చేయడానికి ప్రేరణ కల్పించారు. భారతదేశంలోని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు వైద్యసంరక్షణ అందుబాటులో లేని ప్రాంతాలలో ఉచిత వైద్యశిబిరాలను నిర్వహిస్తున్నాయి. ప్రాథమిక ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. భగవాన్ ప్రేమ, ఆశీస్సులతో ఈ సంస్థల సేవకులు నిశ్శబ్ద ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు. ఆరోగ్యప్రచారం, విద్య, శస్త్రచికిత్సలు, ఆరోగ్య సంరక్షణ సహా అన్నిరకాల ఆరోగ్యసేవలను నిర్వహించడానికి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ రోగులకు ఉచితంగా మందులు ఇస్తున్నారు. లక్షలాది మంది రోగులకు కంటి వ్యాధులకు చికిత్స, వేలాది మందికి కంటిశుక్లాల శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలకు చెందిన వివిధ సమితిలు వివిధ ప్రాంతాలలో ఉచిత వైద్యకేంద్రాలను నిర్వహిస్తున్నాయి.భగవాన్ జన్మదిన వేడుకల సందర్భంగా వైద్య శిబిరాలుప్రతి సంవత్సరం నవంబర్ నెలలో ప్రశాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మదిన వేడుకలలో భాగంగా ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా వేలాది మంది రోగులకు ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు అందిస్తారు. ఈ శిబిరాలకు రోగ నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన వారిలో ఎవరికైనా అధునాతన చికిత్స అవసరమైతే, వారిని శ్రీ సత్యసాయి జనరల్ ఆసుపత్రికి పంపుతారు.ప్రశాంతి నిలయం లేదా ప్రశాంతిగ్రామ్లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్ పురోగతిని సమీక్షించడానికి, శ్రీ సత్యసాయిబాబా బోధనలను గుర్తు చేసుకోవడానికి వైద్య శిబిరంలోని ప్రతి ఒక్కరితో రోజూ సాయంత్రం సత్సంగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోనూ స్వామి జన్మదిన వేడుకల సందర్భంగా మారుమూల గ్రామాలకు వైద్య సేవలను విస్తరించడానికి ఎంపిక చేసిన గ్రామాల్లో దాదాపు పది రోజులు మెగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. సాధారణ శస్త్రచికిత్సలు, కంటిశుక్లం రోగులను సమీప పట్టణాలకు తీసుకువచ్చి శస్త్రచికిత్సలు ఉచితంగా చేయిస్తారు.శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్స్శ్రీ సత్యసాయి మొబైల్ హాస్పిటల్ అనేది మరొక ప్రత్యేకమైన ఉచిత గ్రామీణ ఆరోగ్యసేవ. శ్రీ సత్యసాయి బాబా ఈ సేవలను 2006 మార్చి 3న ప్రారంభించారు. వారానికి ఒకసారి శ్రీ సత్యసాయి ఉచిత వైద్య క్లినిక్లను అనేక సమితిలు నిర్వహిస్తున్నాయి.టెలీమెడిసిన్టెలీమెడిసిన్ కేంద్రాలు నేరుగా వైద్య చికిత్సలను అందించవు. రోగులు ఎవరైనా వీటిని సంప్రదిస్తే, వారికి తగిన ఆసుపత్రులను సూచించడం, అక్కడ లభించే చికిత్స వివరాలను తెలియజేయడం సహా అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.వివిధ సంస్థలలో వైద్య పరీక్షలువివిధ రాష్ట్రాలకు చెందిన శ్రీ సత్యసాయి సంస్థల వైద్య బృందాలు అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, కుష్టు వ్యాధిగ్రస్థుల నివాసాలు తదితర ప్రదేశాలను తరచు సందర్శించి, అక్కడి వారికి అవసరమైన వైద్య సేవలను అందిస్తాయి. సాధారణ వైద్య శిబిరాలతో పాటు స్థానిక గ్రామీణ పాఠశాలల విద్యార్థులకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఆరోగ్య సేవలతో పాటు వ్యక్తిగత సంరక్షణ, ఉద్యోగ సంరక్షణ, విద్యా సంరక్షణ, ఆధ్యాత్మిక సంరక్షణ, వ్యవసాయ సంరక్షణ, సామాజిక సంరక్షణ వంటి సేవలన్నీ శ్రీ సత్యసాయి విలేజ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్తో అనుసంధానమై పనిచేస్తుంటాయి.సేవకు ప్రతీక సత్యసాయి వైద్య మిషన్సత్యసాయి ట్రస్ట్ వైద్య సేవలు కేవలం రోగాన్ని నయం చేయడమే కాదు, ప్రేమతో, కరుణతో రోగికి మానసిక బలాన్ని కూడా అందిస్తున్నాయి. ఇందులో పనిచేసే వైద్యు లందరూ సేవా భావంతో పనిచేస్తున్నారు. కుల మత ఆర్థిక వ్యత్యాసాలకు తావు లేకుండా, ప్రతి ఒక్కరూ భగవాన్ బాబా సూత్రం ప్రకారం ‘మానవుడు దేవుని రూపం’ అనే దృష్టితోనే సేవలను అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆరోగ్య సేవలు ప్రపంచానికి మానవతా దృక్పథానికి ఆదర్శం.‘ప్రేమలోనే వైద్యం ఉంది, సేవలోనే దేవుడు ఉన్నాడు’ అనే బాబా వాక్యం ఈ సంస్థ ప్రతి పనిలోనూ ప్రతిఫలిస్తుంది. భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఈ సేవాయజ్ఞం శతాబ్దాల పాటు కొనసాగాలని ఆకాంక్షిద్దాం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం.మారుమూల ప్రాంతాలకూ విస్తరణశ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఉచిత వైద్యసేవలు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించాయి. పుట్టపర్తి, బెంగళూరులోని వైట్ఫీల్డ్లలోని శ్రీ సత్యసాయి జనరల్ ఆస్పత్రులు 2023–24 నాటికి దాదాపు 4.3 లక్షల మంది ఔట్పేషెంట్లకు ఉచితంగా వైద్యసేవలు అందించడంతో పాటు సుమారు 38 వేల మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేశాయి. శ్రీ సత్యసాయి ఆస్పత్రుల ఆధ్వర్యంలో దేశంలోని మారుమూల ఉన్న లద్దాఖ్ సహా ఇతర హిమాలయ ప్రాంతాలలోని రోగులకు ఉచిత వైద్యసేవలు అందిస్తున్నాయి. అలాగే, ప్రసూతి సేవలు, హృద్రోగాలు, మధుమేహం, శిశువైద్యం, దంత చికిత్సలు, మానసిక చికిత్సలు తదితర రంగాలకు చెందిన ప్రత్యేక క్లినిక్లను కూడా నిర్వహిస్తున్నాయి. వైద్య చికిత్సల ఖర్చు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో శ్రీ సత్యసాయి ఆస్పత్రులు ఉచితంగా ఉన్నతస్థాయి వైద్య సేవలను అందిస్తుండటం విశేషం. -
ప్రేమ, సేవే లక్ష్యంగా శ్రీ సత్యసాయి బాబా జీవితం
కోట్లాది భక్తుల ఆరాధ్య దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 1926 నవంబరు 23న జన్మించారు. ఆయన అసలు పేరు సత్యనారాయణరాజు. బాబా జన్మించిన గొల్లపల్లి– ఇప్పుడు పుట్టపర్తిగా మారింది. భక్తులకు షిరిడీ సాయిబాబా అవతార పురుషుడిగా తనను తాను చెప్పుకొన్నారు. షిరిడీ సాయిబాబా మరణించిన ఎనిమిదేళ్లకు బాబా జన్మించారు. సాయిబాబా జీవితంలో ఎన్ని వివాదాలు వచ్చినా, ఆయన సేవలను మాత్రం ఎవరూ వేలెత్తి చూపించలేకపోయారు. బాబా బంగారు ఉంగరాలు, విబూది సృష్టించి భక్తులకు కానుకలుగా ఇచ్చేవారు. కోట్లాదిమంది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. కుల మతాలకు అతీతంగా నిలిచారు.సత్యసాయి భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. సత్యసాయి బాబా తల్లిదండ్రులు ఈశ్వరమ్మ, పెద్ద వెంకమరాజు. సత్యసాయి బాబా బాల్యంలోనే చాలా అద్భుతాలు చేశాడని చెబుతారు. చిన్న వయసులోనే అపర మేధావిగా, సేవాభావం గల వ్యక్తిగా ముద్రపడ్డారు. అపర మేధావి అయిన బాబాకు నాట్యంలో, సంగీతంలో, రచనలలో మంచి పట్టు ఉంది. బాబా స్వయంగా పాటలు, పద్యాలు రాసి భక్తులకు వినిపించేవారు.1940 మే 23న తండ్రి ‘నీవెవరు?’ అని అడిగినప్పుడు ‘నేను సాయిబాబా’ను అని సమాధానం చెప్పారు. నిదర్శనం చూపమంటే చేతిలో గుప్పెడు మల్లెపూలను తీసుకుని నేలపైకి విసరగా అవి ‘సాయిబాబా’ అనే అక్షరాలుగా ఏర్పడా›్డయి. ఆ చర్యతో బాబా తండ్రి– బాబాను ఓ అద్వితీయ మహోన్నతుడిగా భావించారు. అప్పుడు బాబా తాను షిరిడీ సాయిబాబా ప్రతిరూపాన్ని అని చెప్పారు. తాను షిరిడీ సాయికి ప్రతిరూపాన్ని అని, తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పడంతో భక్తులు రావడం ప్రారంభమైంది.1944లో భక్తులు, బాబా స్వగ్రామం పుట్టపర్తిలో ఓ మందిరం నిర్మించారు. ఆ తర్వాత 1948లో ప్రారంభమైన ప్రశాంతి నిలయం 1950 నాటికి పూర్తయింది. 1957 సంవత్సర కాలంలో బాబా ఉత్తర భారతదేశ దేవాలయాల సందర్శనకు వెళ్లారు. 1956లో చిన్నపాటి జనరల్ హాస్పిటల్ను పుట్టపర్తిలో నిర్మించారు. 1968లో బొంబాయిలో ధర్మక్షేత్ర అనే ఒక ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ తర్వాత 1968 జూన్ 29న బాబా మొదటిసారి విదేశాలకు వెళ్లారు. అక్కడ బాబా తాను ఏ మతాన్ని ప్రచారం చేయడానికి రాలేదని, ప్రేమను పంచడానికి వచ్చానని భక్తులకు చెప్పారు. తన వైపు ఎవరినీ తిప్పుకోవాలని రాలేదని, ఎవరికి వారుగా స్వచ్ఛందంగా వస్తున్నారని అన్నారు. 1973లో హైదరాబాద్లో శివం మందిరాన్ని ప్రారంభించారు.అనంతరం 1981 జనవరి 19న చెన్నైలో సుందరం మందిరాన్ని ప్రారంభించారు. 1991లో పుట్టపర్తిలో ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మంచారు. 1995లో రాయలసీమ ప్రాంతంలో బాబా నీటి ప్రాజెక్టు పనులు చేపట్టారు. 2001లో మరొకసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను బెంగళూరులో నిర్మించారు. 1965లో సత్యసాయిబాబా భారతదేశంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థలను స్థాపించారు. దీని ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రజలు సమష్టిగా నిస్వార్థ సేవలో పాల్గొని, సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే శాశ్వత విలువలను పెంపొందించు కోవాలని సూచించారు. ఆయన ప్రసంగంలో లవ్ ఆల్.. సర్వ్ ఆల్ (అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు), హెల్ప్ ఎవర్.. హర్ట్ నెవర్ (అందరికీ మంచి చేయి.. ఎవరికీ హాని చేయకు) అనే పదాలు ప్రతిసారీ వినిపించేవి. పుట్టపర్తిలో ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసం ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం.. ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది.ఉచితంగా విద్య, వైద్యంనిరంతరం ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా 1972లో ‘శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్’ స్థాపించారు. అప్పటి నుంచి ఆ సంస్థలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇప్పటికీ అమలులో ఉంది. అదేవిధంగా ఖరీదైన వైద్యం ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలను తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. అవతార పురుషుడిగా ప్రకటించుకున్న నాటి నుంచి 86 ఏళ్ల వరకు సేవకుడిగానే నిలిచారు. బాబా భౌతికంగా లేకపోయినా, ఆయన పాటించిన, ప్రారంభించిన విధానాలు నేటికీ కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. -
పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)
-
పుట్టపర్తి : కనుల పండువగా సత్యసాయి జయంతి వేడుకలు (ఫోటోలు)
-
భారతీయ సంస్కృతిపై విదేశీయుల ఆసక్తి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు. అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ.. ప్రశాంతతకు మారుపేరు పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్ సంప్రదాయాలు బాగున్నాయి తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీసాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి 1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్ సాయిబాబానే బతికించారు ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ అతిథులకు లోటు రానివ్వం భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్జే రత్నాకర్రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ -
Puttaparthi: ఆ ఏనుగంటే సత్యసాయికి ఎంతో ప్రేమ
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): సత్యసాయి బాబాకు ఎంతో ఇష్టమైన ఓ ఏనుగు చనిపోవడంతో దానికి ఏకంగా ఆలయాన్నే నిర్మించారు. నిత్య పూజలు చేస్తున్నారు. ఈ ‘గజరాజు’ ఆలయం పుట్టపర్తిలో నక్షత్రశాల పక్కనే ఉంది. ఈ ఆలయ నేపథ్యాన్ని పరిశీలిస్తే సత్యసాయి బాబా సకల జీవుల పట్ల చూపిన అంతులేని ప్రేమ స్ఫురణకు వస్తుంది. సత్యసాయిబాబా 1962లో తమిళనాడులోని బండిపూర అడవి నుంచి ఓ గున్న ఏనుగును కొనుగోలు చేసి పుట్టపర్తికి తీసుకొచ్చారు. దానికి ‘సాయిగీత’ అని పేరు పెట్టి.. ప్రేమతో పెంచుకుంటుండేవారు. చదవండి: అరుదైన దేవాలయం... మద్యం మాన్పించే దేవుడు! ప్రశాంతినిలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ, పండుగల్లోనూ, ఊరేగింపుల్లోనూ బాబా ముందర సాయిగీత నడుస్తూ ఉండేది. దాని కోసం ప్రత్యేకంగా మావటీలను ఏర్పాటు చేసి, చిన్న షెడ్డులో ఉంచి సంరక్షించేవారు. ప్రతి రోజూ మావటీలు ఏనుగును వాకింగ్కు తీసుకెళ్లేవారు. వయసు మీద పడడంతో 2007 మే 23న ‘సాయిగీత’ చనిపోయింది. ఆత్మ బంధువుల అంత్యక్రియలకు సైతం వెళ్లని సత్యసాయి ఆరోజు సాయిగీత అంతిమయాత్రలో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. స్థానిక నక్షత్రశాల పక్కనే దాన్ని సమాధి చేశారు. 10వ రోజున వైకుంఠ సమారాధన సైతం ఘనంగా నిర్వహించారు. అక్కడే ఓ ఆలయాన్ని నిర్మించారు. అనంతరం మరో గున్న ఏనుగును అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవుల నాయుడు సత్యసాయికి బహూకరించారు. అది అనారోగ్యంతో 2013లో మృతి చెందింది. దాన్ని సైతం సాయిగీత పక్కనే ఖననం చేశారు. నిత్య పూజలు చేస్తున్న మావటి పెద్దిరెడ్డి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి సాయిగీతకు మావటిగా దాదాపు 23 ఏళ్లపాటు సేవలందించాడు. నిత్యం మేతగా చెరుకులు, నేపియర్ గడ్డి, రావి ఆకులు, మర్రి ఆకులు, అరటి గెలలు అందించేవాడు. ప్రతి రోజూ ఏనుగును సుమారు నాలుగు కిలోమీటర్లు వాకింగ్కు తీసుకెళుతుండేవాడు. ఏనుగు వచ్చినప్పుడు భక్తులంతా రోడ్డుకు ఇరువైపులా నిలబడి నమస్కరించేవారు. పెద్దిరెడ్డి ఇప్పటికీ పుట్టపర్తిలో ఉంటూ సాయిగీత ఆలయంలో నిత్య పూజలు చేస్తున్నారు. సాయిగీతకు మావటిగా పని చేయడం అదృష్టం సత్యసాయి బాబా ఎంతో ప్రేమగా చూసుకున్న సాయిగీతకు రెండు దశాబ్దాలకు పైగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నేను చెప్పిన మాటను బాగా వినేది. చుట్టూ ఎంత మంది భక్తులు ఉన్నా బెదరకుండా నడిచేది. సాయిగీత లేకున్నా బాబా ఆశీస్సులతో ఆశ్రమంలోనే ఉంటున్నా. జీవితాంతం బాబా, సాయిగీత సేవలోనే ఉండిపోతా. – పెద్దిరెడ్డి -
సాయి సత్య బోధ
మనిషి జీవితంలో సైన్స్కి అందని విషయాలు చాలా ఉన్నాయి... రామాయణ.. మహా భారతాల్ని కల్పితాలు అని వాదించే నాస్తికులు, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం సత్యసాయి దర్శనం చేసుకుని ఆయన బోధలను ఆలకించినవారే! సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస అనే వాటిని ఆయుధాలుగా చేసుకుని.. లవ్ ఆల్ సర్వ్ ఆల్ అని తన బోధనల ద్వారా ప్రజల్లో ప్రేమ తత్వాన్ని నింపారు సత్య సాయి. నేను మీ నుంచి ఆశించేది ఒక్కటే...అదే ప్రేమ... మీ ప్రేమ నాకు కావాలి.. అంటూ ఉండేవారు సత్యసాయి. భౌతికంగా ఆయన మనకు కనుమరుగై కొన్ని ఏళ్లు గడిచినా ఇప్పటికీ పుట్టపర్తిలోని ప్రశాంతినిలయంలో భగవాన్ జయంతి వేడుకలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన అందరూ ఇక్కడ 10 నుంచి 15 రోజులు సేవ చేస్తూ ఒకే కుటుంబంగా ఉంటూ వచ్చిన వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు. పదాహారేళ్ల పిల్లలు... ఎవరో తిని తాగిన ఎంగిలి విస్తళ్లు, కప్పులు మేము తియ్యడం ఏమిటా అనుకోకుండా ఒకరితో ఒకరు సేవలో పోటీ పడుతూ సంతోషంగా చేస్తున్నారు. కరోన కారణంగా సామాజిక దూరం పాటించడం కోసం మందిరంలో... ఇంకా చాలా చోట్ల వృత్తాలు గీసి ఉంచారు. బాబా తన బోధలలో ఎక్కువగా ఒక విషయం చెప్పేవారు... చావుకు భయపడద్దు... చెప్పుడు మాటలు నమ్మద్దు... భగవంతుడిని విడవద్దు... అని. బహుశ వీటిని దృష్టిలో పెట్టుకునే కాబోలు... ఎంతోమంది ఈ కరోన సమయంలో కూడా సేవకు వచ్చారు. సత్యసాయి బోధామృతం.. ►రోజును ప్రేమతో మొదలు పెట్టు... ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ►దైవమే ప్రేమ. ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం ప్రతి వైఫల్యం ఒక లాభం ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. – ఇన్పుట్స్: పోరంకి లక్ష్మీప్రసన్న (నవంబర్ 23 సత్యసాయి జయంతి) -
బంగారు రథంపై సత్యసాయి
పుట్టపర్తి: సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాన ఘట్టమైన జోలోత్సవాన్ని గురువారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం సత్యసాయి చిత్రపటాన్ని బంగారు రథంపై అధిష్టింపజేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యజుర్వేద మందిరం నుంచి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్, ప్రసాదరావు, చక్రవర్తి, నాగానంద, మోహన్, డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణతో పాటు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ సభ్యులు రథాన్ని లాగుతూ సాయికుల్వంత్ మందిరంలోకి తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం మహా సమాధి వద్ద వెండి ఊయలలో బాబా చిత్రపటాన్ని ఉంచి జోలోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి గీతాలు ఆలపిస్తూ సత్యసాయిని స్తుతించారు. సంగీత విద్వాంసులు అభిషేక్, రఘురాముల సంగీత కచేరి ఆకట్టుకుంది. మహామంగళ హారతి అనంతరం భజనలు చేపట్టారు. -
సత్యమే సుందరం
ఆయన అమృతహస్తాలు ఆపన్నులను ఆదుకున్నాయి. కష్టాలలో ఉన్నవారిని సేదతీర్చాయి. ఆయన వితరణ దాహార్తితో పరితపిస్తున్న లక్షలాది ప్రజల దాహార్తి తీర్చింది. ఆయన చేసిన విద్యాదానం ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను ఉచితంగా అందించింది. ప్రేమపూరితమైన ఆయన పలుకు, వెచ్చని ఆయన స్పర్శ వేలాదిమందికి ఉపశమనం కలిగించింది. ఆయన నీతిబోధ, సత్యవాక్పాలన, సేవానిరతి ప్రపంచదేశాలన్నింటికీ పాకి, కోటానుకోట్ల మందిని శిష్యులుగా చేసుకుంది. ప్రేమ, శాంతి, సహనం, సత్యం, సేవాతత్పరత వంటి అనేక ఉత్తమ గుణాలు కలగలసిన భగవాన్ శ్రీసత్యసాయిబాబా బోధామృతం నుంచి జాలువారిన కొన్ని బిందువులు... భారతదేశం అపూర్వ ఆధ్యాత్మిక సంపదకు పుట్టినిల్లని, మన పూర్వీకులు, ఋషులు చేసిన కృషి ఫలితమే మన సంస్కృతీ సంప్రదాయాలని, ఇటువంటి పవిత్ర భారతదేశంలో మనం పుట్టడం జన్మజన్మల అదృష్టమని బాబా ఎప్పుడూ చెప్పేవారు. నేను దేవుడనే– మీరూ దేవుడే నేనూ దేవుడినే, మీరూ దేవుడే, కాని, ఆ విషయం నాకు తెలుసు కాని మీకు తెలియదని పలుమార్లు చెప్పేవారు బాబా. మానవ నిజస్వరూపం, మన కంటికి కనిపించే స్వరూపం కాదని, ప్రేమ మన నిజమైన స్వరూపమని, దానిని మనమంతా పెంపొందించుకోవాలని చెబుతూ, అందుకు నిదర్శనంగా అందరినీ ‘ప్రేమస్వరూపులారా’ అనే పిలిచేవారు.భారతదేశంలో పుట్టిన ప్రతివారూ పేదయినా, ధనికుడైనా, ఈ ఆధ్యాత్మిక సంపదకు అందరూ వారసులేనని, దాని విలువ గుర్తించలేక మన సంఘం మనకు చూపించే ధన సంపద, ఆర్జన, సుఖాలు, వైజ్ఞానికత వంటి వాటితో కాలం గడుపుతూ మన జీవితాలను నిష్ప్రయోజనం కావించుకుంటామని అనేక ప్రసంగాలలో ఆవేదన వ్యక్తం చేసేవారు బాబా.మన చుట్టూ ఉన్న సంఘాన్ని చూసి, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని, తాను చనిపోయినప్పుడు తనతో రాదని తెలిసినా, తనకు కావలసిన దానికన్నా అధిక సంపాదన కోసం, భగవంతుడు ఇచ్చిన అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటారని చెబుతారు. భగవంతుడు సృష్టించిన 84 లక్షల జీవరాశులలో, మానవ సృష్టి అత్యద్భుతమని, మానవ జాతికి అదనంగా ఇచ్చిన ‘విచక్షణ’ అనే జ్ఞానం ఒక పెద్ద వరమని, దాని ఉపయోగంలో అంటే ఏది చెడు, ఏది మంచి అని తెలుసుకొని, ఆదర్శంగా, ఆధ్యాత్మికంగా, సుఖమయ జీవితాన్ని అనుభవించవచ్చని బోధిస్తారు. ధనసంపాదనే ధ్యేయంగా ఉన్న ఈ సంఘంలో, మనకు తెలియకుండానే మనలో స్వార్థం పెరుగుతుందని, ఆ స్వార్థమే జాతి, దేశ సంస్కృతి వినాశాలకు దారి తీస్తుందని, ప్రపంచ చరిత్ర కూడా అదే నిజమని నిరూపించిందని చెబుతుంటారు. స్వార్థంతో... సర్వప్రాణులందరూ ప్రేమతత్వాన్ని పెంచుకోవడమే మనకు అంటుకున్న స్వార్థానికి విరుగుడు అని అంటారు. ఈ విషయంలో ‘నీ స్నేహితులెవరో చెబితే, నీవు ఎటువంటి వాడివో నేను చెబుతాను’ అని అంటారు. అంటే మన చుట్టూ ఉన్న సంఘం మనమీద ఎంత ప్రభావం చూపుతుందని చెప్పడం, చాలా సాధారణంగా ‘అందరినీ ప్రేమించు– అందరినీ సేవించు’ ‘అందరికీ సాయం చెయ్యి ఎవరినీ బాధపెట్టకు’ అనే విచక్షణతో, ప్రేమను పెంచుకోవచ్చని, ఎంతటి కరడుగట్టిన స్వార్థాన్ని కూడా కరిగించే అవకాశమని, జీవిత పరమార్థమని బోధిస్తాడు. శక్తి కొలది తనకు భగవంతుడు ఇచ్చిన దానిలో (సంపద కాని, విజ్ఞానం కాని, శక్తి కాని అధికారం కాని, ఏదైనా కాని తోటి అభాగ్యులకు సేవ చేయగలిగితే, ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవచ్చని, తన జీవితమే దానికి నిదర్శనమని అంటారు. పదవుల కోసం, అధికారం కోసం, గుర్తింపు కోసం, ప్రచార నిమిత్తం చేసే సేవలు స్వార్థాన్ని పెంచుతాయేగాని, తగ్గించవంటారు. ప్రతి మానవుడు తన జీవితం కోసం బాధ్యతల కోసం, కావలసిన ధనాన్ని సంపాదించుకుంటూ, తోటి మానవునికి, జీవులకు తన శక్తి కొలది నిస్వార్థమైన సేవ చేస్తే, ప్రేమతత్వాన్ని పెంచుకుంటూ తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటూ భగవంతుణ్ణి సులభంగా చేరుకోవచ్చని చెప్పేవారు. మన జీవన ప్రయాణం మానవత్వం నుంచి దైవత్వానికే మన జీవన ప్రయాణం అనేవారు... సర్వులందు ప్రేమయే వారు జగతికి ఇచ్చిన సందేశం. స్వామి జన్మదిన సందర్భంగా మనం వారు చెప్పిన విధానంలో మనలోని ప్రేమను పెంచుకుంటూ, తోటివారికి శక్తి కొలది సహాయ పడుతూ, ప్రేమతత్వాన్ని పెంపొందించుకుంటూ, సనాతన ధర్మాచరణతో ఈ మిగులు జీవితాన్ని సార్థకత చేసుకునే ప్రయత్నం చేద్దాం. – శంకర నారాయణ ప్లాంజెరి (హ్యూస్టన్, అమెరికా నుంచి) ►క్రమశిక్షణ ఉంటే ఇంకొకరి రక్షణ అవసరం లేదు. ►ఈ రోజును ప్రేమతో మొదలు పెట్టు ఇతరుల కోసం ప్రేమతో సమయం వెచ్చించు. ► రోజంతా నీలో ప్రేమను నింపుకో. ప్రేమతోనే ఈ రోజు ముగించు. దేవుణ్ణి గుర్తించడానికి అదే సరైన దారి. ►కోరికలు ప్రయాణాలలో తీసుకు వెళ్లే వస్తువులలాంటివి. ఎక్కువయిన కొద్దీ జీవిత ప్రయాణం కష్టం అవుతుంది. ► దైవమే ప్రేమ; ప్రేమలో జీవించు. ►ప్రతి అనుభవం ఒక పాఠం. ► ప్రతి వైఫల్యం ఒక లాభం. ►ఎక్కడ దేవుని మీద విశ్వాసం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. ►ఎక్కడ ప్రేమ వుంటుందో అక్కడ శాంతి ఉంటుంది. ►ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ► ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆనందం ఉంటుంది. ►దేవుడు ఆకాశం నుంచి దిగి మరల పైకి ఆకాశానికి వెళ్లేవాడు కాదు. సర్వత్రా వ్యాపించి ఉంటాడు. ►అన్ని ప్రాణులను ప్రేమించు అది చాలు. ►నేటి విద్యార్థులే రేపటి గురువులు. ►ఇంటిలో ఆదర్శం ఉంటే, దేశంలో నిబద్ధత ఉంటుంది. ► సత్యానికి భయం లేదు. అసత్యం నీడను చూసి కూడా వణుకుతుంది. -
నువ్వులేక అనాథలం..
మా ఆర్తి చూస్తావని సాక్షాత్కరిస్తావని వేచాము క్షణం క్షణం సాయి శ్రీరాముడైనా, శ్రీకృష్ణుడైనా ఏ దైవమైన, ఏ ధర్మమైన నీలోనే చూశాము సాయి రావా బాబా.. రక్షా దక్షా నీవే కదా మా బాబా! ‘అందరినీ ప్రేమించు. ఎవరినీ ద్వేషించకు. తోటివారి బాధ నీదిగా భావించు. మానవ సేవే మాధవ సేవ’ అనే సత్యసాయి బోధన విశ్వ వ్యాప్తంగా సేవాకాంతులు ప్రజ్వలిస్తోంది. కులమతాలు.. ప్రాంతాలకు అతీతంగా ఆయన భక్తులు సేవా మార్గంలో పయనిస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన.. మెరుగైన వైద్యం.. ప్రకృతి వైపరీత్యాల్లో సేవా కార్యక్రమాలు.. ఉన్నత వ్యక్తిత్వం పెంపొందించేందుకు సత్య బోధన.. ఒక్క మాటలో చెప్పాలంటే ‘ప్రపంచ సంతోషమే.. తమ సంతోషం’ అని చాటుతున్నారు. ఇప్పటికీ.. ఎప్పటికీ.. బాబా సేవలు అజరామరం. ఇప్పటి వరకూ ‘సత్యసాయి సెంట్రల్ ట్రస్టు’ ఇండియాలో ఏం చేసిందనేది అందరికీ తెలుసు. అయితే ప్రపంచవ్యాప్తంగా ట్రస్టు ఏం చేస్తోంది? భారత్ మినహా ఆఫ్రికా దేశానికి మాత్రమే వెళ్లిన సత్యసాయి విశ్వమానవాళిని ఎలా ప్రభావితం చేశారు? ‘ప్రపంచాన్ని సేవా మార్గం వైపు నడిపిస్తున్న ‘సాయిలీల’ ఏమిటి? అనే అంశాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షిప్రతినిధి, అనంతపురం: సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలపై బాబా ఉన్నన్నిరోజులు వీటి గురించి ఎక్కడా మీడియాలో కథనాలు రాలేదు. ఎందుకని ప్రశ్నిస్తే ‘నా ఇంట్లోకి పది మంది బంధువులు వచ్చి భోజనం చేసి వెళతారు. ఇది పత్రికకు వార్త కాదు కదా? అలాగే ప్రపంచమంతా నా కుటుంబం. మన ఇంట్లోవారికి చేసే సాయానికి ప్రచారమెందుకు?’ అని బాబా చెప్పిన మాటలను ట్రస్టు సభ్యులు గుర్తు చేశారు. భారత్ మినహా బాబా ఆఫ్రికాకు మాత్రమే ఒకసారి వెళ్లారు. అది మినహా మరేదేశానికీ వెళ్లలేదు. పుట్టపర్తికి వచ్చి బాబా బోధనలు విన్న విదేశీభక్తులు ‘స్ఫూర్తి’పొంది విదేశాల్లో సేవ చేయడం మొదలెట్టారు. దీన్ని అక్కడి వారు నిశితంగా గమనించారు. ‘ఉచితంగా రక్తం ఇస్తున్నారు. చికిత్స చేస్తున్నారు. భోజనం పెడుతున్నారు. చదువు చెబుతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటున్నారు.’ ఇంత మంచి కార్యక్రమాల్లో మనమూ భాగస్వాములు కావాలని భావించారు. ‘సాయిసేవ’లో సభ్యులయ్యారు. ఎంతలా అంటే అమెరికాలోని కొన్ని హెల్త్యూనివర్శిటీల డీన్లు కూడా సభ్యులుగా చేరి ‘సాయి మెడికల్ క్లినిక్’లలో సేవ చేస్తున్నారు. సత్యసాయిసేవలు విశ్వాన్ని ఎలా ప్రభావితం చేశాయో ఈ ఘటనలతో సుస్పష్టమవుతుంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు స్వరూపం ప్రపంచవ్యాప్తంగా 195 దేశాలున్నాయి. ఇందులో 123 దేశాల్లో సత్యసాయి ట్రస్టు సేవలందిస్తోంది. ప్రశాంతి సొసైటీ, వరల్డ్ ఆర్గనైజింగ్ కమిటీ, యూత్వింగ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ మొత్తం దేశాలను తొమ్మిది జోన్లుగా విభజించారు. అందులో రీజియన్లు, వాటిలో దేశాలుగా విభజించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వేల సెంటర్లుగా ఏర్పడిన ట్రస్టు... విద్య, వైద్యంతో పాటు పలు రకాల సేవలందిస్తోంది. ప్రశాంతి కౌన్సిల్ పేరుతో జరిగే ఈ కార్యక్రమాకు చైర్మన్గా లాస్ ఏంజెల్స్లోని ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేంద్రనాథరెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వైద్య సేవ అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, సౌతాఫ్రికా, వెనుజులా, జర్మనితో పాటు చాలాదేశాల్లో ప్రపంచ ప్రసిద్ధులైన డాక్టర్లు కూడా సత్యసాయి భక్తులయ్యారు. వీరు తమ వత్తి చేసుకుంటూనే ఏడాదిలో రెండుసార్లు పుట్టపర్తికి వస్తారు. గురుపౌర్ణమి, సత్యసాయి జయంతికి ఇక్కడికి వచ్చి వారం రోజుల పాటు పేదరోగులకు ఉచితంగా వైద్యం, మందులు అందిస్తారు. దీంతోపాటు వారు నివసిస్తోన్న దేశాల్లో కూడా ‘ఫ్రీ మెడికల్ క్లినిక్’లు నిర్వహిస్తున్నారు. ‘మొబైల్ క్లినిక్’లకు కూడా శ్రీకారం చుట్టారు. ఇండోనేషియా, శ్రీలంక, నేపాల్తో పాటు చాలా దేశాల్లో మెబైల్ క్లినిక్లు ఏర్పాటు చేసి చికిత్స చేస్తున్నారు. యువ రక్తం...సేవా మార్గం సత్యసాయి యూత్వింగ్ ఆధ్వర్యంలోనూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గతేడాది పుట్టపర్తిలో వరల్డ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో 36 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. యూత్వింగ్ ప్రపంచాన్ని 11 జోన్లుగా విభజించి, 11 యువజన సంఘాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఎక్కువగా ప్రకతి వైపరీత్యాలు జరిగే ప్రాంతాలకు హాజరవుతుంటారు. వీటితో పాటు మెడికల్ క్యాంపు, బ్లడ్ క్యాంపు, అన్నదానాలు, విద్యాబోధన చేయడంతో పాటు తోటి మనిషిపై సాటి మనిషి ఎలా ప్రేమ చూపాలి అనే కోణంలో అక్కడి ప్రజలకు చైతన్యం కల్గిస్తుంటారు. విద్యాబోధనపై ప్రత్యేక శ్రద్ధ భారత్ కాకుండా ఇతర దేశాల్లో 41 సత్యసాయి స్కూళ్లు ఉన్నాయి. 39 సత్యసాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. వీటిలో నాణ్యమైన, ఉన్నత విలువలతో కూడిన విద్యతో పాటు ‘సేవా మార్గాన్ని’ బోధిస్తున్నారు. బాబా సూక్తులు, వచనాలు, మనిషి పట్ల, సమాజం పట్ల సాటి మనిషికి ఉండాల్సిన బాధ్యతలపై బోధిస్తారు. సత్యసాయి విద్యాసంస్థల్లో బోధన, క్రమశిక్షణ చూసి అక్కడి పాఠశాలల యాజమన్యాలు ఇలాంటి బోధన జరిగేలా తమ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అడిగారు. ఆస్పత్రులలో కూడా సత్యసాయిభక్తులు రోగుల పట్ల వ్యవహరించే తీరు, చూపించే ప్రేమ తమ ఇన్స్టిట్యూట్లలో కూడా అందాలని అక్కడి ఆస్పత్రుల యాజమన్యాలు ట్రస్టులోని డాక్టర్లను తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తోంది. గతేడాది ట్రస్టు చేసిన కొన్ని ముఖ్య కార్యక్రమాలు ♦ నైజీరియా, క్యూబాలో సాయి వాటర్ ప్రాజెక్టు నిర్మించి తాగునీరు అందించారు. ♦ కెన్యాలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ప్రత్యేక చికిత్స చేశారు. ♦ చైనాలో మొక్కలునాటే కార్యక్రమం చేపట్టారు. ఇక్కడ రెగ్యులర్గా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ♦ దుబాయ్లో సత్యసాయి యువజన విభాగం ఆధ్వర్యంలో పేరెంట్స్ వర్క్షాపు నిర్వహించి, పిల్లలను ఎలాపెంచాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. స్వామి ప్రవచనాలను బోధించారు ♦ అబుదాబిలో అన్నదానం, రక్తదానం లాంటి సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ♦ బహ్రేయిన్లో స్కూలు పిల్లలతో మొక్కలు నాటించి పర్యావరణంపై వర్క్షాపు నిర్వహించారు. ♦ కాలిఫోర్నియాలో 400 మంది డాక్టర్లతో ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ♦ సౌదీలో రంజాన్ సందర్భంగా అన్నదానం చేశారు. ♦ ఒమెన్లో 45 వర్క్షాపులు నిర్వహించారు. వీటిని మెచ్చుకుని అక్కడి విద్యాశాఖమంత్రి ట్రస్టుకు ప్రశంసాపత్రం అందజేశారు. ♦ కువైట్లో స్పెషల్నీడ్ చిల్డ్రన్స్కు పలు సేవలు చేశారు. యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమ్మర్క్యాంపు చేపట్టి సేవా కార్యక్రమాలపై శిక్షణ ఇచ్చారు. ♦ నేపాల్ భూకంపం సమయం నుంచి అక్కడి శరణార్థులకు సేవలందిస్తున్నారు. ఖాట్మండు,, పొకారా, భరత్పూర్లో పైపులైన్లు ఏర్పాటు చేసి మంచినీళ్లు అందించారు. ♦ వెస్టిండీస్, ఇటలీలో పక్కా ఇళ్లు నిర్మించారు. ♦ 25 దేశాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిచారు. ఈ ఫొటోలో కన్పిస్తోన్న నర్సుపేరు కృష్ణలీల. ఆస్ట్రేలియా మహిళ. బాబా బోధనలకు ముగ్ధురాలై భక్తురాలైంది. కృష్ణలీల అని పేరు మార్చుకుంది. ఈమె బాబా జయంతి నవంబర్ 23 అంటే పది రోజులు ముందు వస్తుంది. మెడికల్ క్యాంపునకు కావల్సిన సౌకర్యాలను దగ్గరుండి చూస్తుంది. సొంత ఖర్చులతో మలేషియా నుంచి నర్సులను తీసుకొచ్చి ఇక్కడి సేవ చేయిస్తుంది. నెబులైజేషన్, బెడ్స్, మెడిసిన్స్ అన్నీ దగ్గరుండి చూస్తుంది. పేరు ఎందుకు మార్చుకున్నారని ప్రశ్నిస్తే ‘మతాలకు, కులాలకు అతీతమైంది మానవ సంబంధం. సాయిబోధనలో ఇది స్పష్టమైంది. ఈ విషయాలు పలు దేశాల్లో చెబితే మేమూ మీతో ఓ గంట సేవ చేస్తాం’ అని ముందుకొస్తున్నారు. పాత పేరు ఉంటే ఏంటని ప్రశ్నిస్తే...అది గతం. నాపేరు కృష్ణలీల. నేను పాటించేది ఇక్కడి సంస్కృతి అని అంటారు. తెలుగు రాష్ట్రాల్లో అన్నదానం సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులలో రోగులకోసం వచ్చే బంధువులకు భోజనం లభించడం కష్టమవుతోంది. దీంతో శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, ఏలూరు, భీమవరం, ఒంగోలు, నెల్లూరు, కడప, మెట్పల్లి, కరీంనగర్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, అదిలాబాద్ ఆస్పత్రులలో రోజూ 3,500 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. 20న గవర్నర్ రాక అనంతపురం అర్బన్: రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఈ నెల 20న పుట్టపర్తికి విచ్చేస్తున్నారు. ఉదయం 8 గంటలకు శాంతి భవన్ చేరుకుంటారు. అక్కడ అల్పాహారం తీసుకుని 8.35 గంటలకు సాయి కుల్వంత్ హాల్లో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి వేద కాన్ఫరెన్స్, మల్టీ ఫెయిత్ సింపోజిమ్ ఆన్ గ్లోబల్ పీస్ అండ్ హార్మోనీని ప్రారంభిస్తారు. ఉదయం 11 గంటలకు అక్కడి నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారు. ఏటా వస్తుంటా నా వయస్సు 74 ఏళ్లు. 1984 నుంచి సేవాదల్లో పనిచేస్తున్నా! సత్యసాయి ఇంటర్నేషనల్ మెడికల్ క్యాంపునకు హాజరవుతాంటా! పేదవారికి సేవ చేసినప్పుడు కలిగే తప్తి మళ్లీ పుట్టపర్తికి వచ్చే వరకూ ఉంటుంది. సత్యసాయి భోదనలు ఒంటపడితే అందరూ ప్రేమ, సేవకు బానిసలు కావల్సిందే! అదే సాయిలీల మహత్యం. – ఉడో ఫ్రెజల్, జర్మనీ సేవలతో ప్రభావితం ఏడాదికి రెండుసార్లు ఇక్కడ మెడికల్ క్యాంపు నిర్వహిస్తుంటాం. నా భార్యతో కలిసి కొద్దిరోజులు ముందుగానే వచ్చి ఏర్పాట్లు చూసుకుంటా. ఇక్కడ చికిత్స చేసే డాక్టర్ల పిల్లలతో పాటు సేవలందించే విదేశీ భక్తుల పిల్లలు మెడికల్ క్యాంపు చూసి, వారు కూడా డాక్టర్ కావాలని తల్లిదండ్రులతో చిన్నపుడే చెబుతున్నారు. పదేళ్ల వయసు నుంచే డాక్టర్ కావాలనే సంకల్పంతో చదివి డాక్టర్లు అయిన వారూ ఉన్నారు. విదేశీయుల్లో ఇది ఎక్కువగా కన్పిస్తోంది. దీన్నిబట్టే సత్యసాయి సేవలు ఎంత ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. – డాక్టర్ బంగార్రాజు, జనరల్ మెడిసిన్, యూఎస్ఏ సత్యసాయి బోధనలే నడిపిస్తున్నాయి 123 దేశాల్లో సేవాకార్యక్రమాలు నిర్వహించడం చాలా గొప్ప విషయం. అమెరికాలో మెడికల్ క్యాంపులు నిర్వహించడం చాలా కష్టం. అక్కడ ఉచిత వైద్యం అంటే ప్రజలు నమ్మరు. పైగా ఇన్సూరెన్స్ కంపెనీలతో సమస్య. కానీ సత్యసాయి క్యాంపులకు అక్కడి ప్రభుత్వం, ఇన్సూరెన్స్ కంపెనీలు సహకరిస్తున్నాయి. కెన్యా, నైజీరియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలోని రూరల్ ప్రాంతాలకు కూడా వెళ్లి సేవ చేస్తున్నాం. విద్య, వైద్యం చాలా గొప్పగా ఉంటోంది. ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు కూడా ఇలాంటి విద్య, వైద్యం కావాలని కోరుకుంటున్నాయి. ఏడాదికేడాదికీ సత్యసాయి సేవలను మరింత మెరుగ్గా చేస్తాం. 2019లో 95 దేశాలలోని 95 కమ్యూనిటీలతో సదస్సు నిర్వహించి వారిని దత్తత తీసుకుంటాం. తాగునీరు, ఇళ్లు, వైద్యం, విద్య అన్ని రకాలుగా సేవలందిస్తాం. వచ్చే ఏడాది జూలైలో గోగ్రీన్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నాం. – డాక్టర్ నరేంద్రనాథరెడ్డి, ప్రశాంతి కౌన్సిల్ చైర్మన్, యూఎస్ఏ బాబా బాటలో వెళుతున్నా మా తల్లి సైక్రియాట్రిస్టు. వాళ్లు బాబా భక్తులు. ఇక్కడికి సేవ చేసేందుకు వచ్చేవారు. వారి స్ఫూర్తితో నేను ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నా. హెపాటాలజీ ప్రొఫెసర్గా కూడా ఉన్నా. అమెరికాలో హెపటాలజీ విభాగపు డాక్టర్లకు శిక్షణ ఇస్తుంటా. ఎయిమ్స్లో కూడా సేవలందిస్తున్నా. ఉన్నత పదవుల్లో ఉన్నా అంకిత భావం, ప్రేమ ఉండాలని బాబా బోధించిన బాటలోనే వెళుతున్నా! –హరి కంజీవరం, గ్యాస్ట్రో ఎంటరాలజీ ప్రొఫెసర్, యూఎస్ఏ మానవతా విలువలు పెంపొందాలంటే సేవే మార్గం 48 ఏళ్లుగా సత్యసాయి సేవలో ఉన్నా. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు విశ్వవ్యాప్తమయ్యాయి. సాయి చూపిన సేవా మార్గంలో కోట్లాదిమంది భక్తులు నడుస్తున్నారు. ఆయన ప్రేమ–సేవ మార్గాన్ని ప్రపంచదేశాలు ఆచరిస్తున్నాయి. కులమతాలకు అతీతంగా దృక్పథంలో మార్చు వచ్చి అందరూ పుట్టపర్తికి వస్తున్నారు. మానవతా విలువలు ఇంకా పెంపొందాలి. దీనికి సేవే సరైన మార్గం. – హెచ్జే దొర, మాజీ డీజీపీ, సత్యసాయి వరల్డ్ ఫౌండేషన్ డైరెక్టర్, హైదరాబాద్. సాయి వాక్కుతో పీడియాట్రిక్ సర్జన్ అయ్యా.. మా తల్లిదండ్రులు యూఎస్లో స్థిరపడ్డారు. నేను నాసాలో ఎలక్ట్రిక్ ఇంజినీర్గా ఉండేవాన్ని. పుట్టపర్తిలో బాబా దర్శనానికి వెళితే ‘యూ ఆర్ మై ‘పీడియాట్రిక్ సర్జన్’ అన్నారు. మొదట అర్థం కాలేదు. తర్వాత మెడికల్ ఎంట్రెన్స్ రాసి ఈ రోజు పీడియాట్రిక్ న్యూరో సర్జన్గా ఉన్నా. అత్యాధునిక పద్ధతుల్లో రోబోటెక్ ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నా. వారం కిందట కేరళలో మెదడుకు సంబంధించి అరుదైన ఆపరేషన్ చేశా. పుట్టపర్తి, బెంగళూరులో ఆస్పత్రులు నిర్మించి డాక్టర్లు ఎలా ఉండలో, వైద్యం ఎలా సేవగా భావించాలో ప్రపంచానికి చెబుతాను. – డాక్టర్ వెంకట సదానంద్, పీడియాట్రిక్, న్యూరోసర్జన్ -
సత్యసాయి సేవలు వెలకట్టలేనివి
స్పీకర్ మధుసూదనాచారి పుట్టపర్తి టౌన్: సత్యసాయి బాబా మానవాళికి అందించిన సేవలు వెలకట్ట లేనివని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కొనియాడారు. ఏపీలోని అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో జరుగుతున్న శివరాత్రి వేడుకల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన పుట్టపర్తి చేరుకున్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ కరువు జిల్లాలో తాగునీటిని అందించిన మహాను భావుడు సత్యసాయి అని, తెలంగాణలో సైతం పలు జిల్లాల్లో ఆయన సేవలు కొనసాగుతున్నాయన్నారు. అనంతరం శివరాత్రి వేడుకల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న అఖండ భజన కార్యక్రమంలో పాల్గొని సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. -
చిల్లుకుండలో... నీళ్ళు పోయకండి!
సత్యపథం ‘అందరినీ ప్రేమించు- అందరినీ సేవించు’ అన్న నినాదాన్ని ఒక మంత్రంగా, ఒక స్ఫూర్తిగా మలచినవారు శ్రీసత్యసాయిబాబా. బోధలతో కర్తవ్యాన్ని గుర్తు చేసేవారు కొందరైతే, బోధలతోపాటు ఆచరణ ద్వారా లోకానికి దారి చూపేవారు మరికొందరు. సత్యసాయి బోధలు, సేవలు పుట్టపర్తి దాటి ప్రపంచమంతా విస్తరించాయి. 1926 నవంబర్ 23న జన్మించిన సత్యసాయి చిన్నప్పటినుంచే తాత్వికంగా, వైరాగ్యంగా మాట్లాడేవారు. అయితే, మాటల కంటే చేతలే ముఖ్యమని నమ్మిన బాబా విద్య, వైద్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. దాహార్తితో నిండిన ఎన్నో గ్రామాలకు నీటి వసతి కల్పించారు. సత్యసాయి బోధలు దేవుడు ఒకటే. రెండు కాదు. సాధన చేస్తే నువ్వే దైవం కావచ్చు. ఇంద్రి యాలు కోరినవన్నీ ఇస్తూ, మనసు ఆడించినట్టల్లా ఆడుతూ పోతే - నువ్వెప్పటికీ దైవం కాలేవు, దైవాన్ని చేరుకోలేవు. నీ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు చూసుకోవడం నీ బాధ్యత. నీ దైనందిన, వృత్తిపనులు వదిలి పెట్టాలని ఎవరూ కోరుకోరు. ఈ ప్రపంచంలో హాయిగా జీవించు. కానీ ఆధ్యాత్మిక స్రవంతికి ఎన్నడూ దూరం కావద్దు. నాలుక రుచులను కోరుతుంది. రుచులను అందిస్తూ పోతే శరీరానికే ప్రమాదం. నాలుక రుచికీ, మాటకూ ఆధారం. కాబట్టి రెండింతల జాగ్రత్త లేకపోతే, రెండింతల ప్రమాదం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, చిల్లుకుండలో నీరు పోసినట్లే. మాట అదుపు తప్పితే... మరీ ప్రమాదం. తక్కువ మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. అవసరమైనంతే మాట్లాడాలి. మాటలో తీవ్రత పెరగకూడదు. అరుపులు, కేకలుగా మారకూడదు. కోపంలో, ఉత్సాహంలో కూడా మాట జారకూడదు. విద్య, వైద్య, ఆధ్యాత్మిక, సామాజిక సేవల్లో దారిదీపంగా నిలచిన బాబా 2011 ఏప్రిల్ 24న దేహాన్ని విడిచిపెట్టినా, ఆయన బోధలు, సత్యసాయి ట్రస్ట్ సేవలు స్ఫూర్తినిస్తున్నాయి. - పమిడికాల్వ మధుసూదన్ -
సత్యసాయి మెచ్చిన పకోడి...!
పకోడి... ఈ పేరు వింటే చాలు ఎంతో మంది నోళ్లూరిపోతుంటాయి. పకోడి అంటే ఇష్టంలేని వాళ్లు బహుశా ఉండరేమో. హాట్ ఐటమ్స్లో దీని ప్రత్యేకతే వేరు. ఇక పకోడీల్లో కల్లూరు పకోడి వేరయా అని చెప్పకతప్పదేమో. అంత ఫేమస్ కల్లూరు పకోడి. గార్లదిన్నె: అనంతపురం కల్లూరు రైల్వే స్టేషన్లో ఏదైనా ఒక రైలు ఆగిందంటే చాలు ప్రయాణికులంతా ఓ దగ్గర గుమిగూడుతుంటారు. మాకివ్వండి... మాకివ్వండి అంటూ హడావుడి చేస్తుంటారు. ఇదంతా దేనికంటే ఇకెందుకు ఇక్కడ లభించే పకోడి కోసమే అని వేరే చెప్పాలా. గార్లదిన్నె మండలం కల్లూరు రైల్వే క్యాంటీన్లో మాత్రమే ఈ స్పెషల్ పకోడి లభిస్తుంది. ఈ క్యాంటీన్ నిర్వాహకులు తండ్రీకొడుకులే. వారే కల్లూరు ఆర్ఎస్కు చెందిన వి.నరసింహ, వి. శశికాంత్లు. కర్నాటకలోని ఉడిపి జిల్లా కుందాపురం తాలుకాకు చెందిన వి. నరసింహారావు కుటుంబం 50 ఏళ్ల క్రితం కల్లూరు ఆర్ఎస్కు వచ్చారు. 1964లో వి. నరసింహ చిన్నాన్న శంకర్ కల్లూరు రైల్వే క్యాంటీన్ నిర్వహణను దక్కించుకున్నారు. దీంతో నరసింహారావు తన కుటుంబంతో ఇక్కడే స్థిరపడ్డారు. మొదట్లో 13 ఏళ్ల పాటు చిన్నాన్న శంకర్కు క్యాంటీన్ నిర్వహణలో నరసింహరావు తోడ్పాటునందించే వారు. ఆయన నిర్యాణంతో క్యాంటీన్ నిర్వహణ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. కుమారుడు శశికాంత్తో కలిసి శుచి, రుచికరమైన పకోడీని తయారు చేయడలం ప్రారంభించాడు. అనతికాలంలోనే వారి పకోడీకి మంచి పేరు వచ్చింది. అంతేకాదు వీరి పకోడి అప్పట్లో పుట్టపర్తి సత్యసాయిబాబా ఎంతో ప్రీతిగా తినేవారంట. వీరు పకోడితో పాటు రుచికరమైన ఇడ్లీ, వడ, కాఫీ క్యాంటీన్లో విక్రయిస్తారు. ప్యాకింగ్ వెరీ వెరీ స్పెషల్ మామూలుగా బయట ఎక్కడ తీసుకున్న పకోడి అయినా ఏ పేపర్లోనో... కవర్లోనే ఇస్తుంటారు ఇది రొటీనే. అయితే కల్లూరు రైల్వే క్యాంటీన్లో మాత్రం ఎండిన ఇస్తరాకుల్లో ప్యాక్ చేసి ఇస్తారు. ధర కూడా బయటతో పోల్చి చీస్తే తక్కువే. ఒకప్పుడు రూ. 2 కే పకోడి పొట్లం దొరికేది. ఆతర్వాత రూ. 3 చివరికి ఇప్పుడు రూ.5కు దీన్ని విక్రయిస్తున్నారు. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండటంతో కొనేవారు కూడా ఎక్కువే. రుచికరమైన పకోడీయే మా ప్రత్యేకత రుచికరమైన పకోడితోనే మా క్యాంటీన్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. పకోడి తయారీలో నాణ్యతగల శనగపిండి, రీఫండ్ ఆయిల్, పూనా ఉల్లితో పాటు కొద్ది మోతాదులో ఉర్లగడ్డలను ఉపయోగిస్తాం. భద్రంగా ప్యాక్ కూడా చేస్తాం. ఈ పకోడిని 15 రోజుల తర్వాత తిన్నా దాని రుచిలో ఎటువంటి మార్పు ఉండదు. రోస్ట్ తగ్గదు. బూజు పట్టదు. అందుకే మా పకోడికి అంత గిరాకీ. - వి.నరసింహ, క్యాంటీన్ ఓనర్, కల్లూరు ఆర్ఎస్ తక్కువ ధరకే తినుబండారాలు తినుబండారాలను మా కుటుంబ సభ్యులమే తయారు చేస్తాం. అమ్మానాన్నతో పాటు నేనూ దాని తయారీకి సహాయం చేస్తుంటా. సొంత తయారీతో నాణ్యత లోపాన్ని అధిగమిస్తుండటంతో మా తినుబండారాలకు మంచిగిరాకీ. రైల్వే నిర్ణయించిన ధరల కంటే తక్కువకే విక్రయిస్తుండడంతో క్యాంటీన్కు గుర్తింపు లభించింది. - వీ. శశికాంత్ పకోడి తినందే వెళ్లరు క్యాంటిన్లో లభించే పకోడి చాలా రుచికరమైంది. 23 ఏళ్లుగా ఈ పకోడి రుచి చూస్తున్నా. స్టేషన్ను సందర్శించే రైల్వే ఉన్నతాధికారులు పకోడి రుచి చూడందే వెళ్లరు. సందర్శనకు ముందురోజే వారు పకోడి టాపిక్ తేవందే రారు. -
బాబా సేవలో 5 వసంతాలు
నేడు సత్యసాయిబాబా జయంతి తగరపువలస : ఇందుగలడు అందుగలడు ఎందెందు వెదికినా అందందేగలడంటూ భక్త ప్రహ్లాదుడు శ్రీహరిపై నమ్మకం ఉంచి భక్తిని చాటుకున్నాడు. అంతకాకపోయినా అలాంటి నమ్మకంతోనే తగరపువలసకు చెందిన వానపల్లి సన్యాసిరావు అనే 76 ఏళ్ల వృద్ధుడు బాబాపై నమ్మకంతో ఏభై వసంతాలుగా సేవ చేస్తూనే భక్తి మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు. తగరపువలస ప్రధానరహదారిని ఆనుకుని ఉన్న సత్యనారాయణ కొండ దిగువ భాగంలో ఉన్న ఈ పురాతన మందిరాన్ని ఎందరు విడిచిపెట్టి పోయినా ఆయన మాత్రం ఎవ్వరొచ్చినా రాకున్నా భౌతికంగా బాబా లేకపోయినా మందిరంలో ఉదయం, సాయంకాల సేవలను త్యజించలేదు. బాబా జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శనివారం పురాతన మందిరంలో జయంతి వేడుకలు జరుపుతున్నారు. బాబాయే రప్పించుకున్నారు.. నెల్లిమర్ల జూట్మిల్లులో టెక్నీషియన్గా విధులు నిర్వర్తిస్తున్న సన్యాసిరావును 1965లో చిట్టివలస జూట్యాజమాన్యం ఇక్కడకు రప్పించుకుంది. అప్పటినుంచే ఆయనకు బాబా మందిరానికి వెళ్లే అలవాటయ్యింది. 1970లో బాబా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి సన్యాసిరావు వెళ్తే స్వయంగా బాబాయే ఆయన వద్ద ఆగి ఆప్యాయంగా నిమిరారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన దరిదాపులకు ఎలాంటి బాధలూ చేరలేదని, పైగా తన కుటుంబానికి కూడా బాబా ఆశీస్సులు లభించాయని ఆయన చెబుతారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన మందిరం బీటలువారడంతో ఇక్కడి సభ్యులంతా చిట్టివలసలో మందిరం కట్టుకుని వెళ్లిపోయినా సన్యాసిరావు మాత్రం బాబా కొలువైన ఈ పురాతన మందిరాన్ని విడిచిపెట్టి వచ్చేదిలేదని తెగేసి చెప్పారు. హుద్హుద్ తుపాను ధాటికి ఎన్నో నిర్మాణాలు దెబ్బతిన్నా ఈ మందిరంలోకి వర్షపుచుక్కలు కూడా రాలేకపోయాయి. బాబాపై నమ్మకమే నడిపిస్తుంది.. మందిరానికి నేను వచ్చే తొలిరోజుల్లో రంగూరి పెదరమణ, రమణమూర్తి పంతులు, గిడుగు సుబ్బారావు, జోగ అప్పలస్వామి వంటి వారు మందిరంలో వేకువజామున ఓంకారం, సుప్రభాతం, విష్ణుసహస్రనామాలు సాయంత్రం వేళల్లో ధ్యానం, భజనలు నిర్వహించేవారు. అలాంటి ఈ పవిత్రమందిరాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పలేదు. ఇద్దరు, ముగ్గురు సాయంతో క్రమం తప్పకుండా ఈ క్రతువులు ఆచరిస్తూనే ఉన్నాను. బయట నుంచి ఎటువంటి చందాలు వసూలు చేయకుండానే నాకు వచ్చే పెన్షన్తోనే బాబాసేవతో పాటు నారాయణసేవ చేస్తున్నాను. కడ వరకు ఈ మందిరంలో బాబాసేవలోనే గడుపుతాను. రుద్రుడే సాయిరుద్రునిగా అవతరించి ఆరుద్ర నక్షత్రమున నరుని నారాయణుడిగా మార్చడానికి వచ్చినాడని నా నమ్మకం. - వానపల్లి సన్యాసిరావు, తగరపువలస -
అంతా సాయిమయం
-
చంద్రబాబు పుట్టపర్తి పర్యటన రద్దు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా పుట్టపర్తి పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆదివారం పుట్టపర్తిలో జరిగే సత్యసాయి బాబా జన్మదిన వేడుకల్లో చంద్రబాబు పాల్గొనాల్సివుంది. అయితే చంద్రబాబు పర్యటన రద్దయ్యింది. ఏపీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సత్యసాయి జన్మదిన వేడుకల్లో పాల్గొననున్నారు. -
తల్లివి నీవే.. జగన్మాతవూ నీవే
పుట్టపర్తి టౌన్ : సత్యసాయి బాబా 89వ జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ప్రశాంతి నిలయంలో 19వ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి భక్తులైన మహిళలు దేశ విదేశాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. బాబా మహాసమాధి చెంత నిర్వహించిన వేడుకల్లో పాలుపంచుకున్నారు. తల్లిగా, ఇల్లాలిగా, జగతినేలే మాతగా మహిళా ఔన్నత్యాన్ని కీర్తించారు. సత్యసాయి 70వ జన్మదిన వేడుకలలో భాగంగా తొలిసారిగా 1996 నవంబర్ 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతియేటా కొనసాగిస్తూ వస్తున్నారు. మహిళా దినోత్సవాన్ని సత్యసాయి సేవా సంస్థలలోని మహిళా విభాగమే నిర్వహిస్తోంది. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు సత్యసాయి మహాసమాధి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతపురం మహిళా క్యాంపస్కు చెందిన విద్యార్థినుల వేదమంత్రోచ్ఛారణతో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్బ్యాండ్ వాయిద్య బృందం సత్యసాయికి తమ హృదయ నివేదనను అర్పించింది. వేడుకలకు ముఖ్యఅతిథిగా ముంబాయి యూనివర్సిటీ విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ స్నేహలత దేశ్ముఖ్ హాజరయ్యారు. మహిళా దినోత్సవ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఈశ్వరాంబ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ కేపీ సాయిలీల, ట్రస్ట్ సభ్యురాలు మాధురీ నాగానంద్, అనంతపురం మహిళా క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ మధు కపాణి తదితరులు పాల్గొన్నారు. -
సత్యసాయి 88వ జయంతి వేడుకలు
సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు.ఆదర్శనీయుడు సత్యసాయిజ్యోతి ప్రజ్వలనతో సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకలను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిల్లి కృపారాణిహాజరైన మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులుబాబా సమాధి వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులర్పిస్తున్న విద్యార్థులుసత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు నాగానందవార్షిక నివేదిక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు రఘువీరారెడ్డి, గీతారెడ్డి, కేంద్ర మంత్రి కిల్లికృపారాణిబ్యాండ్ వాయిస్తున్న సత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువిలేకరులతో మాట్లాడుతున్న కోడి రామకృష్ణసత్యసాయి విద్యాసంస్థల విద్యార్థినులువేడుకలకు హాజరైన మంత్రి గీతారెడ్డి సాయి కుల్వంత్ హాలు వద్ద సత్యసాయికి ఆత్మ నివేదన అర్పిస్తున్న విద్యార్థులు -
ఘనంగా సత్యసాయి జయంతి
పుట్టపర్తి టౌన్, న్యూస్లైన్ : సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా శనివారం అశేష భక్త జనుల సాయి నామస్మరణతో ప్రశాంతి నిలయం మార్మోగింది. ఉదయం 8.30 గంటలకు సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత విద్యార్థుల వేదపఠనంతో జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళ సంప్రదాయరీతిలో మంగళ వాద్యాలతో సత్యసాయిని కీర్తిస్తూ విద్యార్థులు ఆత్మ స్వరూపుడైన సత్యసాయికి ఆత్మ నివేదనను అర్పించారు. సత్యసాయి ప్రేమతత్వాన్ని వివరిస్తూ సత్యసాయి భోదనల ఆంగ్లఅనువాదకుడు ప్రోఫెసర్ అనిల్ కుమార్ ప్రసంగించారు. సత్యసాయి మానవాళికందించిన వెలకట్టలేని సేవలకు చిహ్నంగా భారత ప్రభుత్వం తరుఫున కేంద్ర సమాచార ప్రసార సాధనాల శాఖ మంత్రి కిల్లి కృపారాణి సత్యాసాయి స్మారక స్టాంపును విడుదల చేశారు. ప్రథమ స్టాంపును సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు జస్టిస్ ఏపీ మిశ్రాకు అందజేశారు. అనంతరం సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ 2012-13 సంవత్సర వార్షిక నివేదికను సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యుడు టీకేకే భగవత్తో కలసి మంత్రి కిల్లి కృపారాణి విడుదల చేశారు. వాటి ప్రతులను రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతారెడ్డికి అందజేశారు. ట్రస్ట్ సభ్యుడు నాగానంద సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ వార్షిక నివేదిక ఆధారంగా సత్యసాయి ట్రస్ట్ సేవలు, చేపట్టబోవు పథకాలను వివరించారు. అనంతరం సత్యసాయి స్మారకార్థం పోస్టల్ కవర్ను విడుదల చేసి మంత్రి కిల్లి కృపారాణి, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు మద్రాస్ శ్రీనివాస్కు అందజేశారు. సాయి సేవలు వెలకట్టలేనివి : కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వేడుకలకు ముఖ్య అథితిగా హాజరైన కిల్లి కృపారాణి ప్రసంగింస్తూ పేదలకు సత్యసాయి అందజేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. నేటి ప్రపంచానికి ఆయన ఆదర్శమన్నారు. సత్యసాయి ఆశయ సాధనకు ప్రతి సాయి భక్తుడు పాటుపడాలన్నారు. దేశవిదేశాల భక్తలకు ప్రశాంతత నందించిన ప్రశాంతి నిలయం పేరుమీద త్వరలోనే మైస్టాంప్ పేరుతో మరో స్టాంపును విడుదల చేస్తామని ప్రకటించారు. అనంతరం విద్యార్థులు బ్రాస్ బ్యాండ్ వాయిద్యంతో సత్యసాయికి శుభాకాంక్షలు తెలుపుతూ స్వరాలొలికించారు. సత్యసాయి విద్యార్థులు, వివిద దేశాలకు చెందిన భక్తులు ప్రత్యేకంగా తయారు చేసిన 88 కేజీల సత్యసాయి జయంతి కేక్ను మంత్రి కిల్లికృపారాణి క్యాండిల్స్ వెలిగించి కట్ చేశారు. వేడుకల్లో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు, దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు,సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి జయంతి వేడుకలకు స్థానిక ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, కలెక్టర్ లోకేష్కుమార్, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, పోస్టల్ పీఎంజీలు సుధాకర్, సంధ్యారాణి, పోస్టల్ డెరైక్టర్ డీఎస్వీఆర్ మూర్తి, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, మద్రాస్ శ్రీనివాస్, చక్రవర్తి, సత్యసాయి యూనివర్సిటీ చాన్సలర్, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ వెంకటాచలయ్య, వైస్చాన్సలర్ శశిధర్ప్రసాద్, రిజిస్ట్రార్ నరేన్ రాంజి, సిమ్స్ డెరైక్టర్ డాక్టర్ ఓలేటి చౌదరి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నరేంద్రరెడ్డి, అంతర్జాతీయ అధ్యక్షుడు గ్యారీబెల్, మాజీ అధ్యక్షుడు గోల్డ్ స్టెయిన్, పారిశ్రామిక వేత్త టీవీఎస్ శ్రీనివాసన్, రిటైర్డ్ డీజీపీ హెచ్జె దొర, అప్పారావు తదితరులు హాజరయ్యారు. -
చెరగని తీపిగుర్తు ‘తెలుగు గంగ’
తిరువళ్లూరు, న్యూస్లైన్: సత్యసాయిబాబాను తిరువళ్లూరు ప్రజలు తమ అరాద్యదైవంగా స్మరించుకుంటారు. తెలుగుగంగ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు ప్రశంసనీయం. శనివారం ఆయన జయంతి సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ.. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత ఇరు రాష్ట్రాల మధ్య 1977లో జల ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ప్రతి ఏటా 15 టీఎంసీల నీటిని ఆంధ్రా ప్రభుత్వం విడుదల చేయాలి. ఈ మేరకు ప్రతి ఏటా ఆంధ్రా నుంచి కృష్ణా జలాలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే తిరువళ్లూరు జిల్లా పూండి రిజర్వాయర్ను 35 అడుగుల నీటి సామర్థ్యం నిల్వ ఉండేలా నిర్మించారు. కృష్ణా జలాలను పూండికి తరలించడానికి కండలేరు-తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన ఊత్తుకోట జీరో పాయింట్ వరకు 160 కిలోమీటర్ దూరంలోనూ, జీరోపాయింట్ నుంచి పూండి వరకు 25 కిలోమీటర్ వరకు కాలువలను నిర్మించారు. తర్వాత 1996లో కండలేరు నుంచి నీటిని విడుదల చేశారు. కొంత కాలం పాటు నీరు పూండికి చేరిన తర్వాత కాలువ పూర్తిగా కుంగిపోయింది. దాని మరమ్మతుల కోసం అప్పటి ముఖ్యమంత్రి కరుణానిది సత్యసాయి ట్రస్టును ఆశ్రయిం చారు. కాలువ మరమ్మతుల కోసం సాయం అందించాలని సాయి బాబాను అభ్యర్థించారు. స్పందించిన బాబా రూ.150 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో పూండి కాలువను పూర్తిగా మరమ్మతు చేశారు. ఆయన కృషిని చెన్నై ప్రజలు నెటికీ స్మరించుకుంటున్నారు. ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. -
బాబా ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయి...


