-
విదేశాలకు వెళ్లాలా? వద్దా?
సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఆర్థిక సాయం అందించే ఓవర్సీస్ విదేశీ విద్యానిధి పథకాల లబ్ధిదారుల ఖరారు అంశం పెండింగ్లో పడింది. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొంతకాలం ఆపేయాలని నిర్ణయించాయి. వివిధ సంక్షేమ శాఖలు క్షేత్రస్థాయి నుంచి దరఖాస్తుల స్వీకరించడంతోపాటు ఆయా విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను సైతం పూర్తి చేశాయి. మెరిట్ ఆధారంగా వడపోసినప్పటికీ అర్హుల జాబితాలను మాత్రం ప్రకటించలేదు. నెలన్నరపాటు వివిధ దశల్లో వడపోత చేపట్టినా... సకాలంలో ఇందుకు సంబంధించి పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదు. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో సంక్షేమ శాఖలు ఒక్కసారిగా ఈ ప్రక్రియను నిలిపివేశాయి. విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి దాదాపు పక్షం రోజులవుతోంది. రాష్ట్రంలో పోలింగ్ ప్రక్రియ మే 13తో పూర్తి కానుంది. కానీ దేశవ్యాప్తంగా జూన్ 1న ఎన్నికలు ముగియనుండగా, జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో అప్పటివరకు కోడ్ అమల్లో ఉంటుంది. అప్పటివరకు విదేశీ విద్యానిధి పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితా వెలువడే అవకాశం లేదు. ఈ క్రమంలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. విదేశీ వర్సిటీల్లో ఏప్రిల్ నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే సంక్షేమ శాఖలు ఓవర్సీస్ విద్యానిధి లబ్ధిదారుల ఎంపికను జనవరిలోనే మొదలుపెడతాయి. దరఖాస్తుల స్వీకరణ, ధ్రువపత్రాల పరిశీలన, ఇతర ప్రక్రియ పూర్తి చేసి మార్చి మొదటి వారంలో లబ్ధిదారుల జాబితాలను ఖరారు చేసేది. కానీ ఈ దఫా అర్హుల జాబితా విడుదలలో జాప్యం జరిగింది. విదేశీ విద్యానిధి సాయం వస్తుందన్న ఆశతో వందల సంఖ్యలో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. అప్పు చేసి మరీ... ఈ పథకం కింద అర్హత సాధిస్తేనే ఉన్నత విద్యలో చేరేందుకు సిద్ధమయ్యే పరిస్థితి ఉండగా... ఇప్పుడు పథకం కింద లబ్ధి చేకూరుతుందా? లేదా? అనే గందరగోళం అభ్యర్థుల్లో నెలకొంది. దీంతో విదేశాలకు వెళ్లాలా? వద్దా? అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నారు. మరికొందరు మాత్రం అర్హత సాధిస్తామనే ధీమాతో అప్పు చేసి మరీ విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. విమానం టికెట్లు బుక్ చేసుకుని గడువులోగా యూనివర్సిటీలో చేరేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఓవర్సీస్ విద్యానిధి కింద బీసీ సంక్షేమ శాఖ ద్వారా 300 మందికి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల నుంచి 350 మందికి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 500 మందికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి ఉన్నత విద్యా కోర్సు పూర్తి చేసే వరకు రూ.20 లక్షలు రెండు వాయిదాల్లో ఇస్తారు. ఈ మొత్తాన్ని సదరు విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
Vidya Deevena: నిధుల్ని విడుదల చేయనున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి: విదేశాల్లోని టాప్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం పేద విద్యార్థులకు సైతం కల్పిస్తూ.. మరోవైపు, సివిల్ సర్వీస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి అత్యున్నత స్థాయి విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామి కావాలన్న విద్యార్థుల కలల సాకారానికి ఆర్థిక తోడ్పాటునందిస్తూ.. ‘జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం అందించనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ.41.6 కోట్లను, సివిల్ సర్విసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు ప్రోత్సాహకంగా రూ.100.5 లక్షలను మొత్తం రూ.42.6 కోట్లను ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వారి ఖాతాల్లో నేరుగా జమచేయనున్నారు. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం సివిల్ సర్విస్ పరీక్షలో ప్రిలిమినరీ పరీక్ష పాసైన విద్యార్థులకు రూ.1లక్ష ప్రోత్సాహకం.. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైతే అదనంగా మరో రూ.50 వేల ప్రోత్సాహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శిక్షణతోపాటు వారు సొంతంగా ప్రిపేర్ అయ్యేందుకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తోంది. అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నగదు ప్రోత్సాహకం అందిస్తోంది. నిజానికి.. గత ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు మేలు కలిగేలా అరకొరగా పథకాన్ని అమలుచేసింది. కానీ, వైఎస్ జగన్ ప్రభుత్వం లంచాలకు, వివక్షకు తావులేకుండా అర్హులైన ప్రతి అభ్యర్థికీ లబ్ధిచేకూరుస్తూ నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన కేవలం శ్రీమంతుల పిల్లలకే అందుబాటులో ఉన్న విదేశీ విద్యను పేద విద్యార్థులు సైతం అభ్యసించే వీలు కల్పిస్తూ.. వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్/టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ ప్రకారం ఇంజనీరింగ్, మెడిసిన్, లా, జర్నలిజం తదితర 21 ఫ్యాకలీ్టలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు రూ.1.25 కోట్ల వరకు, ఇతర విద్యార్థులకు రూ.1 కోటి వరకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తోపాటు విమాన ప్రయాణం, వీసా ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. దీనిద్వారా ప్రపంచంలోని టాప్–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు మన రాష్ట్ర విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు. -
విదేశీ విద్యను ఇక్కడే కల్పించేలా...
భారతదేశంలో విదేశీ ఉన్నత విద్యా సంస్థల (ఎఫ్హెచ్ఇఐ) క్యాంపస్ల ఏర్పాటు, నిర్వహణ కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్రమబద్ధీకరణను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఈ క్రమబద్ధీకరణ ఉదారంగానూ, సమర్థంగానూ ఉందని చెప్పాలి. ఇది నూతన విద్యా విధానపు సిఫార్సులను అనుసరిస్తోంది. అయితే, ఇది ఇప్పటికే ఉన్న దేశంలోని విద్యా వ్యవస్థలను సవాలు చేయడానికి ప్రయత్నించడం అనేది ఒక అవకాశంతోపాటు ఆందోళన కరమైన విషయం కూడా! ఇంకా, విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన భారతీయ క్యాంపస్లోని విద్యాపరమైన నాణ్యతను తమ దేశంలోని ప్రధాన క్యాంపస్తో సమానంగా ఉండేలా చూసుకోవాలి. చాలా గొప్ప ఆలోచనే అయినప్పటికీ, క్రమబద్ధీకరణ యంత్రాంగం దీన్ని ఎలా అనువర్తించగలుగుతుంది? యూజీసీ క్రమబద్ధీకరణ విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు పాలన పరంగా ప్రత్యేక అధికారాలకు అనుమతిస్తోంది. అన్ని విభాగాలలో యూజీ/ పీజీ/ డాక్టోరల్/ పోస్ట్డాక్టోరల్ అధ్యయనాలు, డిగ్రీల ప్రదానం, డిప్లొమాలు, సర్టిఫికేట్లను ఇచ్చే వీలు కల్పిస్తోంది. ఈ విదేశీ విద్యా సంస్థలు మొత్తం సబ్జెక్ట్వారీగా, ప్రపంచ ర్యాంకింగ్స్లో 500 లోపు ఉంటే అది నిజంగా గొప్ప అడుగే. కాకపోతే, ప్రపంచంలో కనీసం 20 ప్రముఖ ర్యాంకింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక సంస్థలు వివిధ కారణాల వల్ల ఈ ర్యాంకింగ్ సంస్థల చర్యలలో పాల్గొనడం లేదనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ ర్యాంకింగ్లను ఎలా ప్రామాణీ కరిస్తారనేది ప్రశ్న. కాకపోతే భారతీయ, విదేశీ ఉన్నత విద్యాసంస్థల మధ్య సహకారం కోసం 2022లో జరిగిన విద్యా సంబంధ సహకార నియంత్రణ నేపథ్యంలో చూస్తే, ఉమ్మడి డిగ్రీ, ద్వంద్వ డిగ్రీ కార్య క్రమాలకు ఉత్తేజకరమైన కాలం ముందుందని చెప్పొచ్చు. దేశంలో అడుగుపెట్టే విదేశీ ఉన్నత విద్యా సంస్థలు, ఈ క్రమ బద్ధీకరణ ద్వారా, భారతీయ ఉన్నత విద్యా సంస్థలు లేదా భారతీయ కంపెనీలతో జాయింట్ వెంచర్లోకి ప్రవేశించవచ్చు. జాయింట్ వెంచర్లు అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పక్షాలు తమ వనరులతో ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడానికి అంగీక రించే వ్యాపార పరమైన ఏర్పాటు అని మనం అర్థం చేసుకున్నప్పటికీ – విదేశీ ఉన్నత విద్యా సంస్థ భౌతిక, విద్యా, పరిశోధనా మౌలిక సదుపాయాలతో కూడిన స్వతంత్ర క్యాంపస్ను కలిగి ఉండాలని ఈ నిబంధన ఎందుకు నొక్కి చెబుతోంది? దాని విద్యాపరమైన, పరిశోధనా కార్యక్రమాలను సీరి యస్గా నిర్వహించడానికి ఏ విదేశీ ఉన్నత విద్యా సంస్థ అయినా భారతదేశంలో ఉండటం కోసం భూమిపై, వనరులపై పెట్టుబడి పెడుతుందా? దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్న భారతీయ క్యాంపస్ లతో వనరులను పంచుకునే సహకార క్యాంపస్ నమూనా మరింత ఆచరణీయంగా ఉంటుంది. ఇప్పుడు ‘కంపెనీ’ పాత్రను చూద్దాం. నిర్దేశిత లక్ష్యాల కోసం, సెక్షన్ 8 కింద నమోదు అయిన కంపెనీ, లాభాలు ఏవైనా ఉంటే, వాటిని ఆ నిర్దేశిత లక్ష్యాల కోసమే ఉపయోగించాలి. లాభాలను దాని సభ్యులకు చెల్లించకూడదు. ఇంకా, ఇండియన్ ట్రస్ట్ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం, ఒక విదేశీయుడు లేదా ఎన్నారై, భారతీయ ట్రస్ట్కు ట్రస్టీగా ఉండకూడదు. అయితే ఫెమా చట్టం, 1999 నిబంధనలకు అనుగుణంగా ఉండే పక్షంలో నిధులను సరిహద్దులు దాటించడానికీ, విదేశీ కరెన్సీ ఖాతాల నిర్వహణకూ, చెల్లింపులకూ, అమ్మకాలకూ అను మతిస్తోందని తెలుస్తున్నప్పుడు ఇక్కడ ఏదో లోపం ఉందని గమనించాలి. నిధులను స్వదేశానికి పంపగలిగే వీలు ఉన్నట్లయితే, సంబంధిత విదేశీ ఉన్నత విద్యా సంస్థ లాభాలను పొందగలదని దీని అర్థమా? అంటే ఇప్పుడు విద్య ‘లాభార్జన’ కోసమా? భవిష్యత్తులో భారతదేశం ఆకర్షణీయమైన ప్రపంచ అధ్యయన గమ్యస్థానంగా మారుతుందని ఈ క్రమబద్ధీకరణ ఆశిస్తోంది. ఏ విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ఏయే కార్యక్రమాలతో తమ క్యాంపస్లను మన దేశంలో ఏర్పరుస్తాయి; వారు స్థానిక అధ్యాపకులను తీసుకుంటారా, అంతర్జాతీయంగానా; విద్యార్థుల ప్రవేశం కోసం వారు ఉప యోగించే కొలమానాలు ఏవి అనే అంశాలపై ఇది ఆధారపడి ఉంటుంది. సాంప్రదాయకంగా, అక్రిడిటేషన్ అనేది భారతదేశంతో పాటు చాలా దేశాలలో నాణ్యతా తనిఖీ విధానం. విదేశీ ఉన్నత విద్యా సంస్థ నాణ్యతాపరమైన హామీ, ఆడిట్కు లోనవుతుందనీ, యూజీసీకి తన నివేదికను సమర్పించాలనీ ఈ క్రమబద్ధీకరణ నిర్దేశిస్తోంది. ఏదైనా నెరవేరదగిన హామీ నెరవేర్చని పక్షంలో వినియోగదారు న్యాయస్థానంలో పరిష్కారాన్ని కోరవచ్చు. ఒక విదేశీ ఉన్నత విద్యా సంస్థ తన రుసుముల చట్రాన్ని నిర్ణ యించుకోవడానికి ఈ క్రమబద్ధీకరణ అనుమతించడం నిజానికి ప్రగతి శీలమైనది. భారతదేశంలోని విద్యాసంస్థలు మాత్రం ఫీజు నిర్ణా యక కమిటీల ఇష్టాలకు లోబడుతున్నప్పుడు, విదేశీ ఉన్నత విద్యాసంస్థలకు ఈ ప్రత్యేక గౌరవం ఎందుకు? ఫెమా నిబంధనలు ఉన్నప్ప టికీ, పరిమాణాత్మకం కాని మొత్తాలను ఎల్లప్పుడూ సర్దుబాటు చేయ వచ్చు. అలాంటప్పుడు, అకడమిక్ పరపతి ఆధారితమైన రుసుము చట్రాన్ని తప్పనిసరి చేయడం మరింత విశ్వసనీయమైన ఎంపిక. విదేశీ ఉన్నత విద్యా సంస్థ అందించే కార్యక్రమాలు ఆన్లైన్ , బహిరంగ మరియు దూరవిద్యా (ఓడీఎల్) విధానంలో అనుమతించ బడవు అనే షరతు నిర్బంధపూరితంగా ఉంది. ఎమ్ఐటి, స్టాన్ ఫోర్డ్, హార్వర్డ్ వంటి అ్రగ్రశ్రేణి విద్యాసంస్థలు అద్భుతమైన ఆన్లైన్ ప్రోగ్రామ్లను కలిగి ఉన్నాయి. ఇటీవలి కాలంలో యూజీసీ అనేక ఓపెన్, దూరవిద్యా నిబంధనలను సడలించినప్పుడు, వాటిని మన విద్యార్థులకు ఎందుకు దూరంచేయాలి? విశ్వవిద్యాలయాల ప్రపంచ ర్యాంకింగ్లను గుర్తించడానికి రెండు ముఖ్యమైన కొలమానాలు ఏవంటే... అంతర్జాతీయీకరణ, పరిశో ధన. భారతీయ క్యాంపస్లలో విదేశీ విద్యార్థులు, అధ్యాపకులు వర్ధిల్ల డాన్ని అంతర్జాతీయీకరణ అంటారు. ఒక ప్రముఖ ఫ్యాకల్టీ ఎక్కువ డబ్బు సంపాదించడం లేదా మెరుగైన పరిశోధనా సౌకర్యాల కోసం, లేదా తన పరిధిలోని అత్యుత్తమ వ్యక్తులతో పరస్పర సంభాషణ కోసం; అవకాశాలను అన్వేషించడం లేదా కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలకు దారితీసే పేటెంట్లను, ఐపీఆర్లను తమ హోదాకు జతచేసు కోవడం కోసం పనిచేస్తారు. అవి సాధ్యం కాదని తెలిసినప్పుడు, మహా అయితే ఏదో ఒక వారం సందర్శన కోసం తప్ప, ఎవరూ బయ టకు రారు. అప్పుడు విదేశీ ఉన్నత విద్యా సంస్థ ఎలా పని చేస్తుంది? అధ్యాపకులు, సిబ్బంది నియామకంలో పూర్తి స్వయంప్రతిపత్తి ఈ క్రమబద్ధీకరణలో అత్యంత ముఖ్యమైన భాగం. మన సంస్థలలోని అత్యుత్తమ అధ్యాపకులు విదేశీ ఉన్నత విద్యా సంస్థలకు వలసవెళ్లే అవకాశం ఉండటం ఈ నిబంధనకు రెండో కోణం. బహుశా, చివరికి ఒక కొత్త సాధారణ స్థితి ఏర్పడవచ్చు. ఆ స్థితి మన విద్యా సంస్థలలో నాణ్యతను పెంచినట్లయితే, దానిని స్వాగతించాలి. మన విద్యా సంస్థల ఫీజు కమిటీ సిఫార్సులు, అడ్మిషన్ల కోసం రాష్ట్ర లేదా కేంద్ర నిబంధనలు మొదలైన వాటికి కట్టుబడి ఉండాలి. అధ్యాపకు లను ఎన్నుకోవడంలో, ఫీజులను నిర్ణయించడంలో ప్రవేశ నిబంధనలను ఏర్పర్చడంలో మన సంస్థలకు స్వయంప్రతిపత్తిని ఎందుకు పొడిగించకూడదు? అవన్నీ అంతర్జాతీయ ర్యాంకింగ్ సంస్థలకు చెందిన అవే కొలమానాలపై పోటీ పడాలని భావిస్తున్నాం కదా! ఏదైనా ప్రయోగం విషయంలో దాని విమర్శకులు దానికి ఉంటారు. విదేశాల్లోని మాతృసంస్థల్లో అయ్యేదానితో పోల్చినప్పుడు తక్కువ ఖర్చుతో, విదేశీ విద్యార్హతలతో భారతీయ విద్యార్థులు నాణ్యమైన విద్యను ఇక్కడే పొందేందుకు ఈ క్రమబద్ధీకరణ వీలు కల్పిస్తే, ఇది స్వాగతించాల్సిన విషయమే. అయితే ఐఐటీల వంటి మన ప్రథమశ్రేణి విద్యాసంస్థలను సాధారణంగా ఎంపిక చేసుకునే విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాంపస్లలో చేరేలా ప్రభావితం అయితే, అది ఆందోళన కలిగించే అంశం అవుతుంది. అందుకే, నాణ్యతా ప్రమాణాలు ఎన్నో రెట్లు పెరిగినందున విద్యారంగానికి భారీ పెట్టుబడులు అవసరం. పరిశోధనా సౌకర్యాల్లో భారీ స్థాయి వృద్ధి అవసరం. ప్రభుత్వ నిధులను అలా ఉంచుతూనే, విదేశీ నిధులను అనుమతించడం, విజయవంతమైన వ్యవస్థలను అనుసరించడం మేలు. ఎస్ఎస్ మంథా, ఏఐసీటీఈ (ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్) మాజీ ఛైర్మన్; అశోక్ ఠాకూర్, కేంద్ర ప్రభుత్వ విద్యా శాఖ మాజీ కార్యదర్శి (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
విదేశీ విద్యకే మొగ్గు
సాక్షి, అమరావతి: విదేశీ విద్యపై భారతీయ విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. అంతర్జాతీయ యూనివర్సిటీలు/విద్యా సంస్థలు ప్రదానం చేసే డిగ్రీలకు ప్రత్యేక గుర్తింపు ఉండటంతో విదేశాల బాటపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2022 నాటికి 79 దేశాల్లో 13 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు వివిధ వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. గత ఐదేళ్లతో పోలిస్తే గతేడాది ఏకంగా 7.5 లక్షల మంది విద్యార్థులు విదేశాలకు పయనమయ్యారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3.37 లక్షల మంది తరలివెళ్లారు. ముఖ్యంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలను ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. అమెరికాకే మొదటి ప్రాధాన్యత.. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సుల్లో భారతీయ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు. ఈ కోర్సులకు మంచి అవకాశాలు ఉండటంతో విద్యార్థులు వాటినే ఎంచుకుంటున్నారు. మంచి పే ప్యాకేజీల కోసం బిజినెస్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేవారూ ఉంటున్నారు. ఈ క్రమంలో భారతీయులు తమ మొదటి ప్రాధాన్యతను అమెరికాకే ఇస్తున్నారు. ఇక్కడ స్టెమ్ కోర్సుల్లోనే ఎక్కువ మంది చేరుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో 4.5 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. రెండో స్థానంలో కెనడా.. భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్న దేశాల్లో అమెరికా తర్వాత కెనడా రెండో స్థానంలో నిలుస్తోంది. యూఎస్తో పోలిస్తే వర్సిటీల్లో సీటు సాధించడం, ఇమ్మిగ్రేషన్ విధానాలు అనుకూలంగా ఉండటంతో కెనడాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఆ దేశ ఇమ్మిగ్రేషన్– సిటిజన్షిప్ డేటా ప్రకారం.. కెనడాకు వచ్చిన అంతర్జాతీయ విద్యార్థుల జాబితాలో 1.86 లక్షల మందితో భారత్ అగ్రస్థానంలో ఉంది. ఇక యూకే తక్కువ కాల వ్యవధిలో వివిధ కోర్సులు అందిస్తుండటం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల్లో విద్యాభ్యాసం తర్వాత శాశ్వత నివాసితులుగా మారేందుకు అవకాశాలు ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. ఇక ఇంజనీరింగ్ కోర్సుల్లో తక్కువ ట్యూషన్ ఫీజులు ఉండటంతో జర్మనీని ఎంచుకుంటున్నారు. వెనక్కి వచ్చేవారు తక్కువే.. ముఖ్యంగా 2015–19 మధ్య విదేశాల్లో చదివిన భారతీయ విద్యార్థుల్లో కేవలం 22 శాతం మంది మాత్రమే స్వదేశానికి తిరిగి వచ్చి మంచి ఉపాధిని పొందినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement