సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత! | Bengal Deports 1,930 Bangladeshi Immigrants Under CM Suvendu, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత!

Jun 11 2026 10:42 AM | Updated on Jun 11 2026 11:47 AM

Bengal Deports 1,930 Bangladeshi Immigrants Under CM Suvendu

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో అక్రమ వలసల నియంత్రణకు సంబంధించి సరికొత్త గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో  అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అక్రమ వలసదారుల ఏరివేతపై ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్‌లోని వివిధ సరిహద్దు అవుట్‌పోస్ట్‌ల ద్వారా  2,980 మంది అక్రమ బంగ్లాదేశ్ వలసదారులను తిరిగి వారి దేశానికి పంపించివేసినట్లు అధికారిక గణాంకాల ద్వారా వెల్లడవుతోంది.

సువేందు సర్కార్ యాక్షన్ ప్లాన్
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ప్రక్రియ  వేగాన్ని పుంజుకుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే, అంటే మే 19 నుండి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1,930 మంది అక్రమ వలసదారులను వెనక్కి పంపారు. మే 19న ముఖ్యమంత్రి సువేందు అధికారి ‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్’ (గుర్తించు, తొలగించు, దేశం దాటించు) అనే కఠినమైన విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పాలసీ అమల్లోకి వచ్చిన నాటి నుండి సరిహద్దుల్లో గస్తీ, తనిఖీలు ముమ్మరమయ్యాయి.

ఢిల్లీలో ఉన్నత స్థాయి చర్చలు
ఒకవైపు సరిహద్దుల్లో ఈ విధమైన భారీ బహిష్కరణల పర్వం కొనసాగుతుండగానే, మరోవైపు దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక చర్చలు జరుగుతున్నాయి. భారత్‌కు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ , బంగ్లాదేశ్‌కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ ఉన్నతాధికారులు ప్రస్తుతం ఢిల్లీలో సమావేశమయ్యారు. అక్రమ వలసల నిరోధంతో పాటు ఇరు దేశాల సరిహద్దుల్లో మెరుగైన సమన్వయం, పరస్పర సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ ద్వైపాక్షిక చర్చలు సాగుతున్నాయి.

రిపోర్టుతో వెల్లడైన నిజాలు
‘ది ప్రింట్’ సేకరించిన సరిహద్దు భద్రతా దళాల (బీఎస్‌ఎఫ్‌) అంతర్గత వర్గాల డేటా ప్రకారం ఈ షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హకీంపూర్ బోర్డర్ అవుట్‌పోస్ట్‌తో పాటు బెంగాల్‌లోని పలు కీలక సరిహద్దు తనిఖీ కేంద్రాల ద్వారా ఈ వలసదారులను గుర్తించి, చట్టపరమైన ప్రక్రియల అనంతరం బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. ఈ సరిహద్దు నియంత్రణ చర్యలు రాబోయే రోజుల్లో మరింత తీవ్రతరం కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement