సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అదృశ్యమైన వారిలో తల్లి, ముగ్గురు పిల్లలు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఒకేసారి తల్లి, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన లయ (31), ఆమె పిల్లలు బిందు (16), శివ (13), దివిజ (8) కనిపించకుండా పోయారు. కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ వివరాలను పరిశీలిస్తున్నారు.
ఒకేసారి తల్లి, ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, వారి ఆచూకీ కోసం పోలీసులు అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


