తిరువనంతపురం: కేరళలో వలస కూలీల ముసుగులో భారీ ఎత్తున బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నారనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో ఇటీవల పోలీసులు పది మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ నకిలీ గుర్తింపు పత్రాల రాకెట్ గుట్టురట్టయింది. కేవలం 700 రూపాయలకే అసలైన వాటిని పోలిన నకిలీ ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డులను సృష్టిస్తూ, సుమారు 10,000 మందికి పైగా బంగ్లాదేశీయులు భారతీయ పౌరులుగా చలామణి అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామం దేశ రక్షణ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
రూ.700లకే గుర్తింపు పత్రాలు
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అక్రమ వలసదారులు మొదట పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ సరిహద్దు ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అక్కడ ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదించిన తర్వాత, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కేరళకు చేరుకుంటున్నారు. కేరళలోని స్థానిక చిరునామాలను ఉపయోగించుకుని, పూర్తి స్థాయి నకిలీ ఐడీలను సృష్టిస్తున్నారు. దీని వెనుక బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల మొబైల్ ఫోన్లను పరిశీలించి, వాటిలో బంగ్లాదేశ్ పాస్పోర్ట్ల కాపీలను కనుగొనడంతో వారి అసలు పౌరసత్వం బయటపడింది.
గొలుసుకట్టు వలసల గుట్టు
ఈ అక్రమ వలసల్లో గొలుసుకట్టు (చైన్ మైగ్రేషన్) విధానం సాగుతున్నట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. 13 ఏళ్ల క్రితం కేరళకు వచ్చిన ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ, ఇక్కడ ‘మామ్దాస్’ అనే నకిలీ పేరుతో అన్ని రకాల గుర్తింపు పత్రాలను పొందింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా ఇక్కడికి రప్పించింది. అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఆమె బంగ్లాదేశ్ పాస్పోర్ట్ ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి స్వదేశానికి వెళ్లివచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమ బెంగాల్ కూలీలకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉన్న స్వల్ప భాషా వ్యత్యాసాల ద్వారా వీరిని గుర్తించవచ్చని, అయితే భయం కారణంగా స్థానికులు సమాచారం ఇవ్వడం లేదని తెలుస్తోంది.
భద్రతా ఆందోళనలు
ఈ వ్యవహారాన్ని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ సంస్థలు అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. దేశ వ్యతిరేక శక్తులు లేదా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను వాడుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా, పోలీసుల నిఘా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు కేరళను విడిచి వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో కేరళలోని వలస కార్మికులందరి పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, అక్రమ చొరబాటుదారులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: సువేందు దూకుడు.. 2,980 అక్రమ వలసదారుల ఏరివేత!


