నాన్నా.. డబ్బు పంపండి! | Indian students Troubles in America foreign education | Sakshi
Sakshi News home page

నాన్నా.. డబ్బు పంపండి!

Jun 16 2025 12:56 AM | Updated on Jun 16 2025 12:56 AM

Indian students Troubles in America foreign education

తల్లిదండ్రులకు అమెరికా నుంచి పిల్లల ఫోన్లు

డాలర్‌ దెబ్బకు మన విద్యార్థుల విలవిల 

భారీగా పెరిగిన ట్యూషన్‌ ఫీజులు 

సన్నగిల్లిన పార్ట్‌ టైం ఉద్యోగాలు.. ఆదాయం నిల్‌.. డబ్బులు పంపితే తప్ప గడవని పరిస్థితి 

హడలిపోతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

అప్పులు చేస్తున్నాం... డబ్బులు పంపుతున్నాం
మా బాబును అమెరికా పంపినప్పుడు ఎంతో సంతోషించాం. కానీ ఇప్పుడు ప్రతీ రోజూ ఏడుస్తున్నాం. ఫీజులు పెరిగాయి. ఉద్యోగాల్లేవు. అమ్మా డబ్బులు పంపు అనడం మాత్రమే ప్రతీ ఫోన్‌ కాల్‌లో విన్పిస్తోంది. అప్పులు చేసి మరీ పంపుతున్నాం. ఈ పరిస్థితి ఎక్కడి వరకూ వెళ్తుందో అనే ఆందోళన ఉంది.  
– వరలక్ష్మి పల్లవ (విద్యార్థి తల్లి, హైదరాబాద్‌)

సాక్షి, హైదరాబాద్‌: అమెరికాలో మన విద్యార్థులు అనుకున్నదొకటి... అక్కడ జరుగుతున్నది మరోటి. భౌగోళిక పరిస్థితులు, అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయాలు మన విద్యార్థులను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెడుతున్నాయి. ఈ ఇబ్బందులు భారత్‌లో ఉన్న తల్లిదండ్రులకూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. రానురాను డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తోంది. దీంతో విద్య కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులకు ఊహించని విధంగా ఖర్చులు పెరిగిపోతున్నాయి. 

2014లో డాలర్‌ విలువ రూ.60.95 ఉంటే, ఇప్పుడు రూ.86.25కు చేరింది. దీంతో విదేశీ విద్య కోసం వెళ్లిన మన విద్యార్థులు తిప్పలు పడుతున్నారు. దీనికితోడు పార్ట్‌ టైం ఉద్యోగాలకు అవకాశాలు సన్నగిల్లడంతో భారత్‌లోని తల్లిదండ్రుల వైపు విద్యార్థులు దీనంగా చూసే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫోన్‌ చేసి డబ్బులు పంపండి అని అడుగుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ అన్ని దేశాల్లోనూ భారత విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 

విదేశీ విద్యకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న విద్యార్థులూ ఇప్పుడు వెనుకడుగు వేస్తున్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.  

ఏటా రూ.4.32 లక్షల కోట్లు.. 
ఏటా 13 లక్షల మంది భారతీయులు వివిధ దేశాలకు వెళ్తున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇందులో టూరిస్టులు, విద్యార్థులూ ఉన్నారు. అయితే, విదేశీ చదువుల కోసం వెళ్లే వారిలో 38 శాతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులే ఉన్నారు. 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు ఉంటే.. 2022 నాటికి ఇది రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. 

రూపాయి మారకం విలువ పెరగడంతో 2024లో చేస్తున్న ఖర్చు 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ.4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం లెక్కగట్టింది. ఇటీవల కాలంలో రూపాయి విలువ ఊహించని విధంగా పతనమవ్వడంతో 2025లో విదేశాలకు వెళ్లే విద్యార్థులపై 14 శాతం అదనపు భారం పడే వీలుంది. అంటే, రూ.5.86 లక్షల మేర భారం ఉండొచ్చని విదేశాంగ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. 

అమెరికాకు వెళ్లడానికి ముందు విద్యార్థులు అక్కడి వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా అంచనా వేసుకున్నారు. డాలర్‌ ముందు రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. కెనడాలో రూ.1.60 లక్షలు, ఆ్రస్టేలియాలో రూ.1.80 లక్షలు, బ్రిటన్‌లో రూ.2 లక్షలకు పైగా అదనపు వ్యయం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి. 

దీనికితోడు వసతి ఖర్చులు 15 శాతం వరకు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఇతర సంక్షోభాల నేపథ్యంలో జీవన వ్యయం ఏకంగా 22 శాతం పెరిగింది. అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్‌ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడది రూ.52 లక్షల వరకూ వెళ్లింది. 
 
ప్రధాన సమస్య అదే.. 
అమెరికాలో చదవడం కంటే ముందు పార్ట్‌టైం ఉద్యోగంపైనే మన దేశ విద్యార్థులు ఆధారపడుతున్నారు. భారత్‌లో ఉద్యోగాలు రాని వాళ్లు, వస్తాయనే నమ్మకం లేని వాళ్లు ఎక్కువగా అమెరికా వెళ్తున్నారు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశాంగ శాఖ అధ్యయనంలో గుర్తించారు. 

అమెరికాకు దాదాపు 3 లక్షల మంది భారతీయులు వెళ్తుంటే, వారిలో 1.25 లక్షల మంది తెలుగువాళ్లే ఉంటున్నారు. 2024లో భారత్‌తోపాటు ఇతర దేశాల విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్‌టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. 

ఇక్కడ అమెరికాతో పోలిస్తే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు వచ్చాయి. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్‌టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. బ్రిటన్, ఆ్రస్టేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి.  

దిగితే గానీ లోతు తెలియదు: కూర్మం దామోదర్‌ (అమెరికాలో ఎంఎస్‌ చేస్తున్న వరంగల్‌ విద్యార్థి) అమెరికా చదువు కోసం కలలు కన్నాం. ఇక్కడికి వస్తే చాలు ఎన్ని అప్పులు చేసినా తీర్చి, ఎంతో కొంత వెనకేసుకుని వెళ్తామని ఆశించాం. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. పార్ట్‌టైం ఉద్యోగాల్లేవు. డాలర్‌ ధర పెరగడంతో ఫీజులూ ఊహించని విధంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఏంటో మాకే అంతుబట్టడం లేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement