
ఫూలే విద్యానిధి కోటా పెంపుపై చేతులెత్తేసిన బీసీ సంక్షేమ శాఖ
అర్హుల పరిమితి పెంచుతామంటూ ఏడాదిన్నరగా ఎంపిక జాబితాలు నిలుపుదల
తాజాగా పాత కోటా ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ
పథకం కింద అర్హత సాధిస్తామనుకున్న అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
అప్పులు చేసి ఫీజులు చెల్లించిన వారి పరిస్థితి అగమ్యగోచరం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం కోటా పెంపుపై రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ చేతులెత్తేసింది. ఈ పథకం కింద వెయ్యి మంది విద్యార్థులకు అవకాశం కల్పిస్తామంటూ ఏడాదిన్నరగా చెప్పుకొచ్చిన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా పరిమిత కోటాతోనే పథకానికి ఎంపికైన అర్హుల జాబితా విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన జాబితాలో కేవలం 300 మంది మాత్రమే అర్హత సాధించారు. దీంతో పథకం కింద లబ్ధి కలుగుతుందని ఎన్నో ఆశలతో విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులను తాజా అర్హుల జాబితా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
మహాత్మా జ్యోతిబా ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఏటా 300 మందిని బీసీ సంక్షేమ శాఖ ఎంపిక చేస్తుంది. ఎంపికైన ఒక్కో లబి్ధదారుకు రూ.20 లక్షల వరకు గరిష్టంగా ఆర్థిక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని లబ్ధిదారు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇతర శాఖలతో పోలిస్తే కోటా తక్కువగా ఉండటంతో కనీసం వెయ్యి మందికి అవకాశం కల్పిoచాలని బీసీ సంఘాలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధుల నుంచి వినతులు వెల్లువెత్తడంతో బీసీ సంక్షేమ శాఖ ఈ పథకం కింద కోటాను పెంపు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమరి్పంచింది. ఈ క్రమంలో 2023, ఆగస్టు నుంచి దరఖాస్తుల స్వీకరణ తప్ప ఎంపిక ప్రక్రియ పూర్తిచేయకుండా నిలిపివేసింది.
ముగింపు దశలో కోర్సు..
విద్యానిధి పథకం కింద సంక్షేమ శాఖలు ప్రతి విద్యా సంవత్సరం రెండుసార్లు దరఖాస్తులు స్వీకరిస్తాయి. ఫాల్ సీజన్లో భాగంగా ఆగస్టు–సెప్టెంబర్ లో, స్ప్రింగ్ సీజన్లో భాగంగా జనవరి–ఫిబ్రవరిలో దరఖాస్తులు స్వీకరించి వాటిని నెలరోజుల్లో పరిశీలన చేసి అర్హతలు నిర్ధారిస్తాయి. అర్హత సాధించిన విద్యార్థులకు ప్రయాణ ఖర్చుల కింద రూ.50 వేలు కూడా ప్రభుత్వం అదనంగా చెల్లిస్తుంది. ఈ క్రమంలో 2023 ఫాల్ సీజన్లో, 2024 స్ప్రింగ్ సీజన్లో 6 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల అనంతరం మెరిట్ జాబితాలను ప్రకటించిన బీసీ సంక్షేమశాఖ.. తుది జాబితాను విడుదల చేయలేదు.
పథకం కింద వెయ్యి మందికి అవకాశం కల్పిస్తామని అధికారులు పలు సందర్భాల్లో చెప్పకొచ్చారు. కోటా పెంపు ప్రతిపాదనలు సీఎం వద్దకు చేరాయని, ఆదేశాలు వచ్చిన తర్వాత తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. కానీ తుది జాబితా విడుదల ఏడాదిన్నర ఆలస్యమైంది. ఇంతలో మెరిట్ జాబితాను పరిశీలించుకుని అంచనాకు వచ్చిన పలువురు విదేశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు.
వీరిలో 2023 ఫాల్ సీజన్లో దరఖాస్తు చేసుకున్న పలువురు విద్యార్థులు ఒకట్రెండు నెలల్లో కోర్సు కూడా పూర్తి చేసుకోనున్నారు. మరికొందరు కోర్సు చివరి దశకు చేరుకున్నారు. అయితే ఇంత కాలం తుది జాబితా విడుదలను నాని్చన బీసీ సంక్షేమ శాఖ.. తాజాగా గతంలో నిర్దేశించిన కోటా ఆధారంగా 300 మంది విద్యార్థులనే ఎంపిక చేస్తూ వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది.
ఆశలపై నీళ్లు..
బీసీ ఓవర్సీస్విద్యానిధి పథకం కింద కోటా పెరుగుతుందనే ప్రచారంతో ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు ప్రక్రియ తర్వాత మెరిట్ జాబితాను విడుదల చేయగా.. చాలామంది మెరిట్లో ముందున్నామన్న భావనతో విదేశాల్లో పీజీ కోర్సులో చేరారు. కొంతమంది విద్యార్థుల ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగానే ఉన్నా.. అర్హత సాధిస్తామన్న నమ్మకంతో అప్పులు చేసి విదేశాలకు వెళ్లిపోయారు.
కోటా పెంపు చేయకపోవడంతో మెరిట్లో ఉన్న వారికి అవకాశం దక్కకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. విదేశాల్లో పీజీ కోర్సు కోసం ఒక్కో విద్యార్థికి సగటున రూ.30 లక్షలకు పైబడి ఖర్చు చేశామని, ప్రభుత్వ సహకారం అందుతుందని కోర్సులో చేర్చామని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటా పెంపు చేసే పరిస్థితి లేదని తెలిస్తే విదేశాలకు పంపించేవారమే కాదంటూ అధికారుల తీరుపై మండిపడుతున్నారు.