సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన, న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి (Governing Council)సమావేశం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు , లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. అభివృద్ధి వ్యూహాలు, రాష్ట్రాల ప్రాధాన్యతలు, వికసిత్ భారత్ లక్ష్యసాధన కోసం సమ్మిళిత వృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై ఇందులో ప్రధానంగా చర్చలు జరగనున్నాయి.
ఈ సమావేశంలో వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి, పీఎం ధనధాన్య కృషి యోజన పై నీతి ఆయోగ్ ఒక ప్రజెంటేషన్ ఇవ్వనుంది. అలాగే ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్, స్కూలింగ్, స్కిల్లింగ్, హయ్యర్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ పై ప్రత్యేక చర్చ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ , ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ , అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ,హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఈ సమావేశం కోసం రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్కు బయలుదేరారు. నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రులు బెంగాల్ సువేందు అధికారి, తమిళనాడు సి. జోసెఫ్ విజయ్, కర్ణాటక డి.కె. శివకుమార్, వీడీ సతీశన్ తదితరులు కూడా రాజధాని నగరానికి చేరుకున్నారు.


