తగ్గుతున్న వేరుశనగ సాగు | Declining groundnut cultivation | Sakshi
Sakshi News home page

తగ్గుతున్న వేరుశనగ సాగు

Aug 18 2014 2:43 AM | Updated on Jun 4 2019 5:04 PM

ఐదేళ్ల క్రితం లక్షా 70వేల హెక్టార్లలో ఈ పంట సాగు అయ్యేది.

 ఆదోని: వేరుశనగ సాగు క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్ల క్రితం లక్షా 70వేల హెక్టార్లలో ఈ పంట సాగు అయ్యేది. ఇందులో సగానికి పైగా ఆదోని రెవిన్యూ డివిజన్‌లో ఉండేది. ఎర్ర నేలలు ఎక్కువగా ఉండడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగా చేతికి అందేవి. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపేవారు. ఈ పంటపై ఆధారపడి కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరులో రెండొందలకు పైగా నూనె మిల్లులు, డిగాటిగేటర్స్ ఏర్పాటు అయ్యాయి. అయితే ఏటేటా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గిపోతుండడంతో నూనె మిల్లులకు ముడిసరుకు తగ్గుతోంది. ఫలితంగా అవి మూతపడుతున్నాయి.

 సాగు తగ్గడానికి ఇవీ కారణాలు..
 మార్కెట్‌లో వేరుశనగకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. సబ్సిడీ విత్తనాల కోటా కూడా తగ్గింది. ప్రస్తుతం క్వింటం ధర రూ.2400 నుంచి 3200 మధ్య మాత్రమే పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు పెర గడం, మార్కెట్‌లో దిగుబడులకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు ఏటా నష్టాలను మూట కట్టుకుంటున్నారు.

బీటీ రకం పత్తి విత్తనాలు రావడం, పెట్టుబడి తక్కువ కావడం, మార్కెట్లో ధర ఆశా జనకంగా ఉండడంతో రైతులు ఆ పంట వైపు దృష్టి మళ్లించారు. మూడేళ్లలో ఈ పంట సాగు విస్తీర ్ణం 150 శాతం పెరిగింది. వేరుశనగ సాగుకు ఎంతో అనువుగా ఉండే ఎర్ర నేలల్లో కూడా ఈ పంట గణనీయంగా సాగైంది.

 కొంపముంచిన వర్షాభావం
 జిల్లాలో ఈ ఏడాది 61వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు అయింది. వర్షాభావం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పైర్లు పచ్చగా కనిపిస్తున్నా..దిగుబడి ఆశించిన మేరకు వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ అత్యధికంగా పండించే ఆదోని డివిజన్‌లో జూన్‌లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో  60 నుంచి 70 శాతం వర్షం కురిసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.

 ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సారి కూడా పొలాలు పొదునఅయ్యే స్థాయిలో వర ్షం కురువ లేదు. అడపా దడపా పడుతున్న జల్లులు పైరు ఎండి పోకుండా కాపాడుతున్నాయి. ప్రస్తుతం 40 నుంచి 60 రోజుల పంట ఉంది. అయితే పైరు పెరుగుదల పెద్దగా కనిపిండం లేదు. ఆగస్టులో మూడు రోజుల క్రితం జల్లులు పడ్డాయి తప్ప పొలంలో నీరు పార లేదు. ప్రస్తుతం పూత పూసి, ఊడలు దిగే కీలక దశలో వర్షం ఎండ బెట్టింది. దీంతో పూత, ఊడలు పెరుగుదల నిలిచి పోయింది. మరో వారం రోజుల వాన ఎండ బెడితే ఎకరాకు నాలుగైదు బస్తాల దిగుబడి రావడం కూడా కష్టమని రైతులు వాపోతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement