breaking news
oil mills
-
ఏడుగురిని బలిగొన్న విష వాయువులు
సాక్షి ప్రతినిధి, కాకినాడ/సాక్షి, పాడేరు/పెదబయలు: కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి. రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్లో విష వాయువులు ఏడు నిండు ప్రాణాలను బలిగొన్నాయి. వంట నూనెల కర్మాగారానికి చెందిన ట్యాంక్ను శుభ్రం చేసేందుకు ట్యాంక్లోకి దిగిన కార్మికులు ఒకరి తర్వాత ఒకరుగా అరగంట వ్యవధిలో ఏడుగురు మృతి చెందారు. మృతులలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్లోని పెదబయలు మండలానికి చెందిన వారు కాగా, ఇద్దరు కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు వాసులు. మృతులంతా రోజు వారి కూలీలే. అంతా 45 ఏళ్ల లోపు వారే.. గురువారం ఉదయం 7 – 7.30 గంటల మధ్య ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురం పరిసర గ్రామాల నుంచి స్థానికులు బాధిత కుటుంబాలకు మద్ధతుగా ఫ్యాక్టరీ వద్దకు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రమాద విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా తోడ్పాటు అందివ్వాలని కాకినాడ జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. కుంటుంబానికి రూ.25 లక్షలు వంతున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ప్రత్యక్ష సాకు‡్ష్యలు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉక్కిరి బిక్కిరి.. జి రాగంపేటలోని అంబటి సుబ్బన్న ఆయిల్స్ ఫ్యాక్టరీ ఆవరణలోని ఏడు ఆయిల్ ట్యాంకర్లలో ఐదో నంబర్ ట్యాంక్ను గురువారం శుభ్రం చేయాలనుకున్నారు. 24 అడుగుల లోతున్న ఈ ట్యాంక్లో అడుగున ఉండే వంట నూనె మడ్డిని తొలగించేందుకు వీరు ట్యాంక్లోకి దిగారు. ట్యాంకులో నిల్వ చేసిన నూనెను ప్యాకింగ్కు తరలించిన తర్వాత క్లీన్ చేశాకే తిరిగి మరోసారి ఆయిల్తో నింపుతుంటారు. అలా ఖాళీ అయిన ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు ఎనిమిది మంది కార్మికులను ప్లాంట్ సూపర్వైజర్ రాజు పురమాయించారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ ట్యాంక్లోకి దిగారు. తొలుత ట్యాంక్లోకి దిగాక, కళ్లు తిరిగి ఊపిరాడక పోవడంతో బయటకు వచ్చిన వెచ్చంగి కిరణ్ మాత్రమే ప్రాణాలతో బయట పడ్డాడు. ఇతని పరిస్థితి గమనించి కూడా, మిగతా వారిని లోపలకు దింపడం దారుణం అని మిగతా కార్మికులు మండిపడుతున్నారు. ట్యాంక్లో ఆక్సిజన్ 20 శాతం లోపు ఉండటంతోనే కార్బన్ డయాక్సైడ్, మోనాక్సైడ్తో కూడిన విష వాయువులు కమ్మేసి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాధాకృష్ణ ‘సాక్షి ప్రతినిధి’కి చెప్పారు. ఈ ఫ్యాక్టరీలో ట్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు అనుమతి ఉందా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇక్కడున్న ఏడు ట్యాంకులన్నీ 18 నుంచి 24 అడుగుల లోతున ఉన్నాయి. మృతులను బయటకు తీసుకువచ్చేందుకు ట్యాంకర్ను కట్ చేయాల్సి వచ్చింది. ఫ్యాక్టరీ సీజ్.. దర్యాప్తునకు ఆదేశం కాకినాడ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కృతికా శుక్లా, ఎం రవీంద్రనాథ్బాబు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఫ్యాక్టరీని సీజ్ చేసి, కార్యకలాపాలను నిలిపివేశారు. యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ మొత్తం ఘటనపై విచారణకు జిల్లా జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో ఫ్యాక్టరీస్, కార్మిక శాఖ అధికారులతో త్రిసభ్య కమిటీని కలెక్టర్ ఏర్పాటు చేశారు. త్వరగా విచారణ పూర్తి చేసి, నివేదిక అందజేయాలని ఆదేశించారు. కాగా, పెద్దాపురం వద్ద కూడా ఇదే యాజమాన్యం ఏఎస్ ఆయిల్స్ పేరుతో మరో ఫాక్టరీని నడుపుతోంది. అందరూ రెక్కాడితే కానీ డొక్కాడని వారే.. మృతులంతా పొట్టకూటి కోసం వలస వచ్చిన వారే. రోజువారీ రూ.650 చొప్పున పని చేస్తున్నారు. ప్యాకింగ్ సెక్షన్లో పని చేసే వారిని ట్యాంక్లు శుభ్రంచేసే పనికి పురమాయించడం వల్లే అవగాహన లేక చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఇక తమకు ఎవరు దిక్కంటూ జగదీష్, ప్రసాద్ కుటుంబ సభ్యులు మృతదేహాల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. పోస్టుమార్టం కోసం ఇద్దరి మృతదేహాలను పెద్దాపురం ఆస్పత్రికి, ఐదుగురి మృతదేహాలను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. అనంతరం వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మంత్రి వేణుగోపాలకృష్ణ చెప్పారు. బాధితులకు అండగా సీఎం జగన్ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం తరఫున ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి మరో రూ.25 లక్షలు వంతున ఇచ్చేలా ఒప్పించారు. మొత్తంగా ఒక్కో కుటుంబానికి రూ.50 లక్షలు సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబంలో అర్హులైన వారికి పింఛన్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్మికుల మృతి విచారకరం : గవర్నర్ సాక్షి, అమరావతి : కాకినాడ జిల్లా జి.రాగంపేటలోని అంబటి ఆయిల్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతి చెందడంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారని రాజ్భవన్ వర్గాలు గురువారం ఓ ప్రకటరలో పేర్కొన్నాయి. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నలుగురికి 20 మంది పిల్లలు పెదబయలు మండలానికి చెందిన దగ్గరి బంధువులు ఐదుగురి మృతితో మన్యంలో విషాదం నెలకొంది వీరంతా సంక్రాంతి పండగకు స్వగ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపారు. రెండు వారాల క్రితమే ఫ్యాక్టరీకి తిరిగి వెళ్లారు. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొర్రా రామారావుకు భార్య కొమాలమ్మ, ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చిన్న వయసు వారే. వెచ్చంగి కృష్ణారావుకు భార్య లక్ష్మితో పాటు నలుగురు పిల్లలు. కుర్తాడి బొంజన్నకు భార్య నీలమ్మతో పాటు నలుగురు పిల్లలు ఉన్నారు. వెచ్చంగి సాగర్కు వివాహం కాలేదు. తల్లిదండ్రులు సీతారామ్, సత్యవతి, చెల్లెళ్లు ఇతనిపైనే ఆధారపడి ఉన్నారు. నర్సింగరావుకు భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. మృతులు వీరే.. అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పెదబయలు మండలం పరేడ∙ గ్రామ పంచాయతీ లక్ష్మీపురానికి చెందిన వెచ్చంగి కృష్ణారావు (36), వెచ్చంగి నరసింగరావు (40), వెచ్చంగి సాగర్ (23), ఉంచేడుపుట్టు గ్రామం కురుతాడుకు చెందిన కుర్తాడి బొంజుబాబు(35), బాండపల్లి గ్రామ పంచాయతీ సంపాపుట్టు గ్రామం కొర్రా రామారావు (45), పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన కట్టమూరి జగదేష్ (25), యల్లమిల్లి ప్రసాద్ (27). పెదబయలు మండలానికి చెందిన ఐదుగురూ దగ్గర బంధువులు. ఒక్కొక్కరం లోపలకు దిగేశాము. ఏదోలా అనిపించింది. వెంటనే ఊపిరాడక కళ్లు బైర్లు కమ్మేశాయి. ట్యాంక్ లోపల అరస్తూ పడిపోతున్న కృష్ణారావును పైకి లాగుదామనుకున్నా. అయితే అప్పటికే నాలో శక్తి సన్నగిల్లింది. ఎలాగోలా మిచ్చెన పట్టుకుని బయటికొచ్చి పడిపోయాను. – ప్రత్యక్ష సాక్షి కిరణ్ -
ఆయిల్ మిల్లులపై పోలీసుల దాడులు
ఆదిలాబాద్ , జగిత్యాల క్రైం : జిల్లాలో కల్తీ నూనెలపై ‘కల్తీ..కల్తీ’ అనే శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో ఎస్పీ అనంతశర్మ స్పందించారు. బుధవారం జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతంలోగల రెండు ఆయిల్ మిల్లులపై దాడులు చేశారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకెట్లు తయారుచేస్తున్న ఆయిల్ మిల్లులను సీజ్చేశారు. సోమేశ్వర ట్రేడర్స్ ఆయిల్మిల్లుపై దాడులు చేయగా.. అందులో వివిధ కంపెనీల పేర్లతో లూజ్ ఆయిల్ను ప్యాకెట్లలో తయారుచేస్తున్నారు. ఆయిల్లో కల్తీతోపాటు చెత్తాచెదారం ఉండటంతోమిల్లును సీజ్ చేశారు. ఎస్పీ అనంతశర్మ మాట్లాడుతూ కల్తీ నూనెలపై ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పారు. కొంతమంది వ్యాపారులు నాణ్యత లేని నూనెలు తీసుకొచ్చి బ్రాండెడ్ కంపెనీల పేరుతో ప్యాకెట్లను ముద్రిస్తూ వ్యాపారం కొనసాగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమేశ్వర ఆయిల్మిల్లుపై కేసు నమోదు చేస్తామని, నాణ్యత ప్రమాణాలపై ఫుడ్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించి పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో టౌన్ ఇన్చార్జి సీఐ కృపాకర్, ఎస్సైలు లక్ష్మీనారాయణ, ప్రసాద్, జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
తగ్గుతున్న వేరుశనగ సాగు
ఆదోని: వేరుశనగ సాగు క్రమంగా తగ్గుతోంది. ఐదేళ్ల క్రితం లక్షా 70వేల హెక్టార్లలో ఈ పంట సాగు అయ్యేది. ఇందులో సగానికి పైగా ఆదోని రెవిన్యూ డివిజన్లో ఉండేది. ఎర్ర నేలలు ఎక్కువగా ఉండడంతో దిగుబడులు కూడా ఆశాజనకంగా చేతికి అందేవి. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపేవారు. ఈ పంటపై ఆధారపడి కర్నూలు, ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరులో రెండొందలకు పైగా నూనె మిల్లులు, డిగాటిగేటర్స్ ఏర్పాటు అయ్యాయి. అయితే ఏటేటా వేరుశనగ సాగు విస్తీర్ణం తగ్గిపోతుండడంతో నూనె మిల్లులకు ముడిసరుకు తగ్గుతోంది. ఫలితంగా అవి మూతపడుతున్నాయి. సాగు తగ్గడానికి ఇవీ కారణాలు.. మార్కెట్లో వేరుశనగకు మూడేళ్లుగా గిట్టుబాటు ధర లేదు. ప్రభుత్వపరంగా ప్రోత్సాహం కూడా తగ్గిపోయింది. సబ్సిడీ విత్తనాల కోటా కూడా తగ్గింది. ప్రస్తుతం క్వింటం ధర రూ.2400 నుంచి 3200 మధ్య మాత్రమే పలుకుతోంది. పెట్టుబడి ఖర్చులు పెర గడం, మార్కెట్లో దిగుబడులకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో ఈ పంట సాగు చేసిన రైతులు ఏటా నష్టాలను మూట కట్టుకుంటున్నారు. బీటీ రకం పత్తి విత్తనాలు రావడం, పెట్టుబడి తక్కువ కావడం, మార్కెట్లో ధర ఆశా జనకంగా ఉండడంతో రైతులు ఆ పంట వైపు దృష్టి మళ్లించారు. మూడేళ్లలో ఈ పంట సాగు విస్తీర ్ణం 150 శాతం పెరిగింది. వేరుశనగ సాగుకు ఎంతో అనువుగా ఉండే ఎర్ర నేలల్లో కూడా ఈ పంట గణనీయంగా సాగైంది. కొంపముంచిన వర్షాభావం జిల్లాలో ఈ ఏడాది 61వేల హెక్టార్లలో వేరుశనగ పంట సాగు అయింది. వర్షాభావం రైతులను తీవ్రంగా వేధిస్తోంది. పైర్లు పచ్చగా కనిపిస్తున్నా..దిగుబడి ఆశించిన మేరకు వచ్చే అవకాశం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేరుశనగ అత్యధికంగా పండించే ఆదోని డివిజన్లో జూన్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూలైలో 60 నుంచి 70 శాతం వర్షం కురిసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక్క సారి కూడా పొలాలు పొదునఅయ్యే స్థాయిలో వర ్షం కురువ లేదు. అడపా దడపా పడుతున్న జల్లులు పైరు ఎండి పోకుండా కాపాడుతున్నాయి. ప్రస్తుతం 40 నుంచి 60 రోజుల పంట ఉంది. అయితే పైరు పెరుగుదల పెద్దగా కనిపిండం లేదు. ఆగస్టులో మూడు రోజుల క్రితం జల్లులు పడ్డాయి తప్ప పొలంలో నీరు పార లేదు. ప్రస్తుతం పూత పూసి, ఊడలు దిగే కీలక దశలో వర్షం ఎండ బెట్టింది. దీంతో పూత, ఊడలు పెరుగుదల నిలిచి పోయింది. మరో వారం రోజుల వాన ఎండ బెడితే ఎకరాకు నాలుగైదు బస్తాల దిగుబడి రావడం కూడా కష్టమని రైతులు వాపోతున్నారు. -
ఆయిల్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం
సిద్దిపేట, న్యూస్లైన్: మెదక్ జిల్లా సిద్దిపేట పట్టణ శివారులోని ఓ ఆయిల్ మిల్లులో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రూ. కోటి విలువైన ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది చొరవతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలు...స్థానిక రాంనగర్లోని ఎర్ర చెరువు పక్కన గల అరుణ్ ఎంటర్ప్రైజెస్కు చెందిన ఆయిల్ మిల్ నుంచి శనివారం తెల్లవారుజాము 5.30 గంటల ప్రాంతంలో పొగలు రావడాన్ని వాచ్మన్ సిద్ధిరాములు గమనించాడు. షట్టర్ తీసి చూడగా మంటలు చెలరేగాయి. వెంటనే బయటకు వచ్చి అరవడంతో చుట్టు పక్కల వారితోపాటు ఆయిల్ మిల్ యజమాని లక్ష్మణ్ బంధుమిత్రులు వందల సంఖ్యలో హుటాహుటిన తరలివచ్చి మంటలు ఆర్పడానికి ప్రయత్నించారు. సిద్దిపేట ఫైర్ ఆఫీసర్ శ్రవణ్ నేతృత్వంలో ఫైర్ ఇంజన్, సిబ్బంది మంటలను ఆర్పడం ప్రారంభించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో గజ్వేల్ నుంచి మరో ఫైర్ ఇంజన్ను తెప్పించారు. నీరు సరిపోకపోవడంతో 12 వాటర్ ట్యాంకులను తెప్పించారు. దీంతో మంటలు ముందు భాగంలోని షెడ్డుకు వ్యాపించలేదు. మిల్లులోని వివిధ రకాల వంట నూనెలు, ప్యాకింగ్ మిషన్లు, విద్యుత్ మోటార్లు, ప్యాకింగ్ సామగ్రి దగ్ధమైంది. సుమారు 10 గంటల కృషి తరువాత పరిస్థితి అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మంటలతో భవనం గోడలు, పార్టీషన్ భాగం, షెడ్డు పైకప్పు రేకులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. కోటి విలువైన ఆస్తి నష్టం సంభవించినట్టు అంచనా వేస్తున్నారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ శ్రీధర్ సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాజిద్, వీఆర్వో లింగం పంచనామా నిర్వహించారు. రూ. కోటి నష్టం: లక్ష్మణ్, ఆయిల్ మిల్లు యజమాని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని ఆయిల్ మిల్లు యజమాని లక్ష్మణ్ తెలిపారు. వివిధ రకాల వంట నూనెలు, సున్నితమైన మిషనరీలు, ప్యాకింగ్ మెటీరియల్స్ దగ్ధమయ్యాయన్నారు. షెడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. రూ. కోటి రూపాయల నష్టం జరిగిందన్నారు.