జీవో 111 ఉల్లంఘనలపై నిజ నిర్ధారణ కమిటీ

NGT Notices To KTR And Telangana Government - Sakshi

కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ నోటీసులు

సాక్షి, న్యూఢిల్లీ: జీవో 111కు విరుద్ధంగా హైదరాబాద్‌ శివార్లలోని జన్వాడ ప్రాంతంలో మంత్రి కేటీఆర్‌ ఫాంహౌస్‌ నిర్మించారని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. ప్రతివాదులైన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మెట్రో వాటర్‌ వర్క్స్, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, హైదరాబాద్‌ లేక్స్‌ అండ్‌ వాటర్‌ బాడీస్‌ మేనేజ్‌మెంట్‌ సర్కిల్‌కు నోటీసులు జారీచేసింది.

జస్టిస్‌ రామకృష్ణన్, సభ్య నిపుణుడు సైబల్‌ దాస్‌ గుప్తాతో కూడిన చెన్నై బెంచ్‌ శుక్రవారం ఈ పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్‌ న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. జీవోలు, చట్టాలు అమలు చేయాల్సిన మంత్రే వాటిని ఉల్లంఘించారని, జీవో 111 ఉల్లంఘనలపై గతంలో ఎన్జీటీ ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని నివేదించారు. నాలాను కబ్జా చేసి రోడ్డు నిర్మించారని చెప్పారు. దీనిపై ఎన్జీటీ స్పందిస్తూ.. అక్రమ నిర్మాణం, జీవో 111 ఉల్లంఘనలపై తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపింది. కేంద్ర పర్యావరణ శాఖ, కేంద్ర, రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు, జీహెచ్‌ఎంసీ, వాటర్‌ వర్క్స్, హెచ్‌ఎండీఏ ప్రతినిధులు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వెల్లడించింది. కట్టడం అక్రమమైతే పర్యావరణ పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలు, వసూలు చేయాల్సిన పరిహారం అంచనా వేసి రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 2018లో జీవో 111 ఉల్లంఘనలపై ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వుల అమలు నివేదికను కూడా ఇవ్వాలని ఎన్జీటీ పేర్కొంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top