ఎల్‌బీనగర్‌లో డేంజర్‌ బెల్స్‌

Coronavirus Danger Bells in LB Nagar Hyderabad - Sakshi

పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య

ఆదివారం తాజాగా 48 మందికి పాజిటివ్‌

గుట్టుచప్పుడు కాకుండా హోం క్వారంటైన్‌

ఆందోళనలో కాలనీవాసులు

ఎల్‌బీనగర్‌: ఎల్‌బీనగర్, సరూర్‌నగర్‌. హయత్‌నగర్‌  సర్కిళ్ల పరిధిలో కరోనా వైరస్‌ చాపకింద నీరులా విస్తరిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.  గత 16 రోజులుగా ఆయా సర్కిళ్ల పరిదిలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఎలాంటి లక్షణాలు లేకుండానే పలువరు ఈ వ్యాధి భారిన పడుతుంటడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. దగ్గు, జ్వరం వంటి సీజనల్‌ వ్యాధుల బారిన పడిన వారు సైతం నిర్ధారణ పరీక్షల కోసం ఆసుపత్రుల బాట పడుతుండగా, మరికొందరు ఇంటివద్దే ఉంటూ తమకు తెలిసిన వైద్య విధానాలను అవలంబిస్తున్నారు. ఇప్పటికే ఎల్‌బినగర్‌ డివిజన్‌ పరిధిలో 578 మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో కొందరు గుట్టుచప్పుడు హౌస్‌ క్వారంటైన్‌లో ఉండగా మరికొందరు గాంధి, ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆదివారం ఒక్కరోజే  చంపాపేట, హయత్‌నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డి, లింగోజిగూడ, చైతన్యపురి, మన్సురాబాద్, నాగోల్, సరూర్‌నగర్, ఎల్‌బినగర్‌ తదితర ప్రాంతాల్లో 48 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో దినసరి కూలీలు, వ్యాపారస్తులు, ప్రైవేటు, ప్రభుత్వ  ఉద్యోగులు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన కాలనీలను అధికారులు కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించి వైరస్‌ నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అనుమానితులను హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచి వైద్యుల పర్యవేక్షిస్తున్నారు. కాగా వైరస్‌ బారిన పడిన వారిలో కొందరు యథేచ్చగా రోడ్లపై తిరుగుతున్నందునే కరోనా విజృంభిస్తున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు çస్పందించి హౌమ్‌ క్వారంటైన్‌లో ఉన్న వారు కోవిడ్‌ నిభంధనలు పాటించేలా చర్యలు తీసుకోవటంతో పాటు కరోనా నిర్దారణ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని కోరుతున్నారు. 

మల్కాజిగిరి సర్కిల్‌లో 9 పాజిటివ్‌ కేసులు : ఇద్దరి మృతి
మల్కాజిగిరి/నేరెడ్‌మెట్‌: మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలో తొమ్మిది మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.సైనిక్‌పురి, ఆర్‌.కె.పురం ఆఫీసర్స్‌ కాలనీ,ఏపీఐఐసీ కాలనీ మౌలాలి, మీర్జాలగూడ, ఆర్‌.కె.పురం,యాప్రాల్, జి.కె. ప్రశాంతినిలయం, మౌలాలి మజిద్, గ్రీన్‌ గోల్డ్‌ అపార్ట్‌మెంట్‌  ప్రాంతాలకు చెందిన తొమ్మిది మంది కరోనా బారినపడినట్లు డీసీ దశరథ్‌ తెలిపారు. లాలాగూడ రైల్వే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాళ్లబస్తీకి చెందిన రైల్వే ఉద్యోగి(42), గాంధీలో చికిత్స పొందుతూ నేరెడ్‌మెట్‌ చంద్రగిరి కాలనీకి చెందిన వృద్ధుడు(66) ఆదివారం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

కాప్రాలో మరో 6 కేసులు నమోదు
కాప్రా: సర్కిల్‌ పరిధిలో ఆదివారం మరో 6 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మల్లాపూర్‌ డివిజన్‌ భవానీనగర్‌లో ఓ వ్యక్తి(60), మల్లాపూర్‌లో మహిళ(53), నాచారం డివిజన్‌ స్నేహపురి కాలనీలో యువతి(24), చర్లపల్లి డివిజన్‌ కుషాయిగూడలో మహిళ(36), ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ భవానీనగర్‌లో వ్యక్తి(48), మీర్‌పేట్‌–హెచ్‌బీ కాలనీ డివిజన్‌ స్వప్నా ఎన్‌క్లేవ్‌లో వ్యక్తి(37) కరోనా బారిన పడినట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు కాప్రా సర్కిల్‌ పరిధిలో కరోనా పాజిటివ్‌ కేసులు 256కు చేరగా, వైరస్‌తో ఆరుగురు మృతి చెందారు. కరోనా మహమ్మారిని జయించి 112 మంది డిశ్చార్జి కాగా, 138 యాక్టివ్‌ కేసులున్నట్లు వారు వివరించారు.

ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో..
ఉప్పల్‌: ఉప్పల్‌ పీహెచ్‌సీ పరిధిలో ఆదివారం 18 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. చిలుకానగర్‌ డివిజన్‌ పరిధిలో మూడు, హబ్సిగూడ డివిజన్‌ పరిధిలో 8, రామంతాపూర్‌ డివిజన్‌ పరిధిలో 3, ఉప్పల్‌ డివిజన్‌ పరిధిలో నాలుగు కేసులు నమోదయ్యాయన్నారు.

ఫీవర్‌లో 163 మందికి కోవిడ్‌ పరీక్షలు
నల్లకుంట: నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రిలో ఆదివారం 163 మంది కోవిడ్‌ అనుమానితులకు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించారు. వారిలో 31 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు  ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top