డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించగా పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా మారి ఒక స్థానాన్ని భర్తీ చేశారు.
► అట్టహాసంగా శశికళ తొలి అడుగు
► ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన చిన్నమ్మ
► శశికళను వ్యతిరేకిస్తూ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
► డీఎంకేలోకి మాజీ మంత్రి
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత స్థానాన్ని భర్తీ చేసిన శశికళ అట్టహాసంగా తన తొలి అడుగు వేశారు. నేతలు, కార్యకర్తలు జయ జయ ధ్వానాలు పలుకుతుండగా పార్టీ ప్రధాన కార్యాలయంలో శనివారం బాధ్యతలు స్వీకరించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించగా పన్నీర్సెల్వం ముఖ్యమంత్రిగా మారి ఒక స్థానాన్ని భర్తీ చేశారు. 29వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంతో రెండో స్థానం కూడా భర్తీ అయింది. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శిగా శశికళ బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ఆగమేఘాలపై పార్టీ ప్రధాన కార్యాలయానికి రంగులు వేశారు. పార్టీ ప్రాంగణంలో ఎంజీఆర్ విగ్రహం వద్ద స్టేజీ నిర్మించారు. శుక్రవారం సాయంత్రం సీఎం పన్నీర్సెల్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో సమావేశమై ఏర్పాట్లను సమీక్షించారు.
ప్రధాన కార్యదర్శిగా జయలలిత వినియోగించిన కారులోనే, అమ్మ వలే ముదురు ఆకుపచ్చ చీర ధరించి ఉదయం 12.12 గంటలకు పోయెస్గార్డెన్ నుంచి బయలుదేరారు. రోడ్లకు ఇరువైపులా ఉన్న కార్యకర్తలు రెండాకుల చిహ్నాన్ని చూపిస్తూ ఆమెకు స్వాగతం పలికారు. కార్యాలయం వద్ద సీఎం పన్నీర్సెల్వం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూధన్ తదితరులు ఆహ్వానం పలికారు. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి జయతో పాటూ అనేక సార్లు వచ్చిన శశికళ ప్రధాన కార్యదర్శి హోదాలో తొలిసారిగా అడుగుపెట్టారు.
ముందుగా ప్రాంగణంలోని ఎంజీ రామచంద్రన్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించి అనంతరం తన చాంబర్లోకి వెళ్లారు. తన చాంబర్లోని ఎంజీఆర్, జయలలితన చిత్రపటాలకు నమస్కరిస్తూ కన్నీళ్లను తుడుచుకున్నారు. ఆ తరువాత పార్టీ పేపర్ల సంతకం చేసి బాద్యతలు చేపట్టారు.అనంతరం పార్టీ నేతలను ఉద్దేశించి ఆమె ఆమె ప్రసంగిస్తూ,మరో వందేళ్లయినా రాష్ట్రాన్ని అన్నాడీఎంకేనే పాలిస్తుంది, ఇందుకు జయలలిత చూపిన మార్గంలో అందరం పయనించాలని అన్నారు. అమ్మ ఫోటోను చూపిస్తూనే ప్రజల్లోకి వెళ్లాలని కోరుతున్నాట్లు చెప్పారు. చారిత్రాత్మకమైన పార్టీకి జయలలిత తరువాత తనను ఎంపిక చేసిన పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతానని చెప్పారు.
తనకు 29 ఏళ్ల వయస్సు నాటి నుండి జయలలితను వెంటనడుస్తున్నానని, ప్రస్తుతం జయలలితకు 62 ఏళ్లుకాగా ఆమెతో తనకు 32 ఏళ్ల అనుబంధమని తెలిపారు. పార్టీ అధినేత్రిగా ఆమె సింహలా గర్జించేవారని చెప్పారు. జయకు తనకంటూ వ్యక్తిగతంగా కోర్కెలు ఏమీ లేవు, ప్రజల కోసమే నిరంతరం పాటుపడేవారని చెప్పారు. ఆమె చూపిన మార్గంలోనే తన పయనం సాగుతుందని తెలిపారు. ఒకటిన్న కోట్ల కార్యకర్తల భవిష్యత్తును నీకు అప్పగిస్తునానని జయ చెబుతున్నట్లు భావన కలుగుతోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమె మదిలోని లక్ష్య సాధనకు తన జీవితాన్ని అంకితం చేస్తున్నానని చెప్పారు. జయకు ఇచ్చిన సహకారాన్ని తనకు కూడా ఇవ్వాలని పార్టీ నేతలు, కార్యకర్తలను కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు. ఎంజీఆర్ వందేళ్ల జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించాలని జయ అనేకసార్లు చెప్పేవారని తెలిపారు. నేడు అమ్మ లేకున్నా ఎంజీఆర్ జయంతిని ఆమె ఆశించినట్లుగా నిర్వహించేందుకు శ్రేణులు సన్నద్దులు కావాలని పిలుపునిచ్చారు. ఎంజీఆర్ వందేళ్ల జయంతిని పురస్కరించుకుని ఆయన బొమ్మతో రూపాయి నాణం, పోస్టల్ స్టాంపు వెలువడేలా కేంద్రాన్ని కోరుతామని చెప్పారు.
కార్యకర్త ఆత్మహత్యాయత్నం:ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను నిరసిస్తూ పార్టీ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా స్వాతి అనంద్ (42) అనే కార్యకర్త మెరీనాబీచ్లోని అమ్మ సమాధి వద్ద కు చేరుకుని శశికళ పట్ల వ్యతిరేక నినాదాలు చేస్తూ అకస్మాత్తుగా విషం తాగాడు. స్పృహకోల్పోయిన అతన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
ఇదిలా ఉండగా, శశికళ నియామకం పట్ల అసంతృప్తి ప్రకటిస్తూ అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నాంజిల్ సంపత్ సొంత పార్టీని వీడి డీఎంకేలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు తన సహచరులకు ఆయన ఉత్తరాలు రాశారు.