టి-20 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ విజయం కోసం టీమిండియా పోరాడుతోంది. బంగ్లాదేశ్తో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినా చివర్లో కాస్త పట్టు సడలించారు.
మీర్పూర్: టి-20 ప్రపంచ కప్లో హ్యాట్రిక్ విజయం కోసం టీమిండియా పోరాడుతోంది. బంగ్లాదేశ్తో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు ఆరంభంలో అద్భుతంగా బౌలింగ్ చేసినా చివర్లో కాస్త పట్టు సడలించారు. దీంతో బంగ్లా సముచిత స్కోరు చేసి టీమిండియాకు 139 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. అమిత్ మిశ్రా మూడు, అశ్విన్ రెండు వికెట్లు తీశారు. భారత్ తొలి రెండు మ్యాచ్ల్లో దాయాది పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్లపై విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తాజా మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లకు 138 పరుగులు చేసింది. భారత ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఆరంభంలోనే బంగ్లాను కట్టడి చేశాడు. అశ్విన్ వరుస బంతుల్లో తమీమ్ ఇక్బాల్, షమ్సూర్ రహ్మాన్ను పెవిలియన్ చేర్చాడు. ఆ మరుసటి ఓవర్లో యువ పేసర్ భువనేశ్వర్ కుమార్ షకీబల్ను బౌల్డ్ చేశాడు. దీంతో బంగ్లా 21 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత బంగ్లా రన్రేట్ మందగించింది. అనముల్ హక్ (44), ముష్ఫికర్ రహీం (24) బంగ్లాను ఆదుకునే ప్రయత్నం చేశారు. కాగా భారత బౌలర్ షమీ.. రహీంను అవుట్ చేయగా.. ఆ వెంటనే అమిత్ మిశ్రా అనముల్ను బౌల్డ్ చేశారు. చివర్లో భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగించలేకపోయారు. మహ్మదుల్లా (33 నాటౌట్), నాసిర్ హుస్సేన్ (16) రాణించి బంగ్లాకు సముచిత స్కోరు అందించారు. చివరి ఓవర్లో మిశ్రా.. హుస్సేన్, జియావుర్ రహ్మాన్ ను అవుట్ చేశాడు.