నువ్వా..నేనా

india vs sri lanka third one day in visakhapatnam - Sakshi

సిరీస్‌ కోసం భారత్‌–శ్రీలంక తుదిపోరు

ఇండియా ట్రాక్‌ రికార్డ్‌ సూపర్‌

అందరి చూపు రో‘హిట్‌’ వైపు..

ధోని మెరుపులు ఖాయమంటున్న అభిమానులు

విజయం కోసం పోరాడతామంటున్న ఫెరారీ

వైఎస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏలో నేడు వన్డే

సాక్షి, విశాఖపట్నం‌: వైఎస్‌ఆర్‌ ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియం మరోసారి సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌కు సిద్ధమైంది. ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌ జట్టును నిలువరిస్తామంటున్నాడు శ్రీలంక కెప్టెన్‌ ఫెరీరా.  సిరీస్‌ తొలి వన్డేలో పరాజయానికి ధీటుగానే సమధానమిచ్చిన కెప్టెన్‌ రోహిత్‌కు ఇక్కడి పిచ్‌పైన చక్కటి ట్రాక్‌ రికార్డే ఉంది. గతేడాది ఇక్కడే జరిగిన న్యూజిలాండ్‌ సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లోనూ రాణించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

బ్యాటింగ్‌కే అనుకూలించేలా ఉన్న ఇక్కడ పిచ్‌పై రోహిత్‌ చెలరేగితే విశాఖ క్రీడాభిమానులకు పండుగే. అయితే విశాఖలో గడచిన ఏడాది జరిగిన టెస్ట్, వన్డే, టీ20 మ్యా చ్‌ల్లోనూ స్పిన్నర్లు ఆధిపత్యం చాటుకున్నా రు. అయితే ఈసారి అశ్విన్‌ లేకపోవడంతో అతని స్థానంలో చాహల్, కులదీప్‌ పాత్ర పోషించే అవకాశాలే మెండు. శనివారం భారత్‌ జట్టు తొలుత స్టేడియంలో వార్మప్‌ చేసుకుని అనంతరం నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేసుకుంది. 

దారులన్నీ స్టేడియంవైపే..
అసలే ఆదివారం. అందులో ఇండియా..శ్రీలంక మధ్య ఫైనల్‌ మ్యాచ్‌. టికెట్లనీ కేవలం మూడు రోజుల్లోనే ఆన్‌లైన్లో హాట్‌కేక్‌ల్లా అమ్ముడుపోయాయి. డాక్టర్‌ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఏసీఏవీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో డే అండ్‌ నైట్‌గా సాగే మ్యాచ్‌ ఒంటిగంటన్నరకు ప్రారంభం కానుండగా ఇరుజట్ల కెప్టెన్లు ఒంటిగంటకే టాస్‌కు వెళ్లనున్నారు. వాతావరణం కూడా అనుకూలంగా ఉండటంతో క్రికెట్‌ పండుగకు ఎటువంటి ఆటంకం లేదు. వికెట్‌ను సయితం ఆట ఆరంభానికి 24గంటల ముందుగానే గ్రీనిష్‌గా ఉంచడంతో  స్టేడియంలో పరుగుల వరద పారనుంది. అయితే స్పిన్‌కు పిచ్‌ అనుకూలమనే సంకేతాలందుతున్నాయి. 

గట్టి భద్రత...
డీసీపీ పకీరప్ప నేతృత్వంలోని పన్నెండు మంది ఏసీపీలతో సహా 763 మంది పోలీస్‌ సిబ్బందితో స్టేడియంలోనూ, బయట గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు హోటల్‌ నుంచి బయలు దేరి తిరిగి చేరేంత వరకు పోలీస్‌ సిబ్బంది పహారా కాస్తున్నారు. సాయుధులైన పోలీసులు 54 మంది ఉండగా బాంబ్‌ స్క్వాడ్‌లే వంద వరకు ఉన్నాయి. 

భారత్‌ తరఫున...
వాషింగ్టన్‌ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నా ప్రాక్టీస్‌కు రాకపోవడంతో ఆడతాడా అనేది సందేహమే. డ్రై అవుతూ స్పిన్‌కు అనుకూలంగా పిచ్‌ మారుతుండటంతో కులదీప్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. రోహిత్‌(  కెప్టెన్‌), శిఖర్‌ధావన్, శ్రేయాస్, దినేష్, మనీష్, హార్దిక్, చాహల్, భువనేశ్వర్, బుమ్రా ఆడనున్నారు. స్టేడియంలోనే బెస్ట్‌ రికార్డు ఉన్న ధోని వికెట్ల వెనుక నిలవనున్నాడు. 

శ్రీలంక తరపున...
తిరిమన్నే స్థానంలో సమరవిక్రమను తీసుకునే అవకాశాలుండగా వికెట్ల వెనుక డిక్‌ వెల్లా నిలవనున్నాడు. పెరీరా(కెప్టెన్‌), తరంగ, గుణరత్నే, పతిరాణా, లక్మల్, ధనుంజయ, ప్ర దీప్‌లతోపాటు రెండో వన్డేలో ప్రతిఘటించి సెంచరీ చేసిన మాథ్యూస్‌ ఆడనున్నారు.  
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top