నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా | 4th Test: Australia won the toss and elected to bat | Sakshi
Sakshi News home page

నాలుగో టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా

Jan 6 2015 5:07 AM | Updated on Sep 2 2017 7:15 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ సిడ్నీక్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది.

సిడ్నీ:  బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మంగళవారమిక్కడ సిడ్నీక్రికెట్ మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లగా రోజర్స్, వార్నర్ లు బరిలోకి దిగారు. ఇదిలా ఉండగా, భారత జట్టులో నాలుగు మార్పులు జరిగాయి. గత మూడు టెస్టు మ్యాచ్ లలో పేలవమైన ఆటను ప్రదర్శించి నిరాశపరిచిన భారత్ ఆటగాళ్లు ధావన్, పూజారా, ఇషాంత్ శర్మలకు సిడ్ని మైదానంలో జరిగే కీలకమైన నాలుగో టెస్టు మ్యాచ్ లో చోటు దక్కలేదు. వారు పెవిలియన్ కే పరమితమైయ్యారు. వారి స్థానంలో రైనా, సహా, రోహిత్, భువనేశ్వర్ లకు చోటు దక్కింది. అయితే టీమిండియా సారథిగా ధోని టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత కొత్త సారథి విరాట్ కోహ్లి నేతృత్వంలోని టీమిండియా తొలి మ్యాచ్ ఆడుతోంది. దీంతో ఐదు రోజుల ఫార్మాట్‌లో భారత్ దశా, దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే సిరీస్‌లో 0-2తో వెనుకబడిన భారత్.. మెల్‌బోర్న్‌లో డ్రాతో సరిపెట్టుకుంది. అయితే సిడ్నీలో మాత్రం పక్కా ప్రణాళికలతో విజయం కోసం బరిలోకి దిగుతోంది. ఈ సిరీస్‌లో మూడు శతకాలు సాధించిన కెప్టెన్ కోహ్లి నాయకత్వ ప్రతిభపై కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్... ఒత్తిడిని ఎలా జయిస్తాడని అందరూ ఎదురుచూస్తున్నారు. వ్యక్తిగత ప్రదర్శనతో అడిలైడ్‌లో జట్టును విజయం దరిదాపుల్లోకి తెచ్చినా... సిడ్నీలో సహచరులను నడిపించడంలో ఎలా వ్యవహరిస్తాడో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement