5నిమిషాల్లో చంద్రబాబు రక్తం చల్లబడిందా! | Ummareddy Venkateswarlu Slams Chandrababu In Special Category Status Issue | Sakshi
Sakshi News home page

5నిమిషాల్లో చంద్రబాబు రక్తం చల్లబడిందా!

Jun 22 2018 2:18 PM | Updated on Jul 24 2018 1:16 PM

Ummareddy Venkateswarlu Slams Chandrababu In Special Category Status Issue - Sakshi

సాక్షి, విజయవాడ : దేశంలో 10కి పైగా రాష్ట్రాల్లో ఉన్న ప్రత్యేక హోదాను ఏపీకి ఇవ్వకుండా టీడీపీ అడ్డుకుందని ఏపీ శాసనమండలి విపక్షనేత, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. హోదా కనుక ‘ఇస్తే కేవలం నిరుద్యోగులకే కాదు అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఆనాడు కలుగుతుందని పార్లమెంట్‌లో చెప్పారు. వెంకయ్య నాయుడు సైతం 5 ఏళ్లు కాదు 15 ఏళ్లు హోదా కావాలని డిమాండ్‌ చేశారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ప్రధాని కావాలని భావించిన నరేంద్ర మోదీగానీ మేం అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాను ఇస్తామని హామీ ఇచ్చారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ, చంద్రబాబులు హోదాపై మాట మార్చారని’ ఉమ్మారెడ్డి గుర్తుచేశారు. 

2014 ఎన్నికల అనంతరం నూతన ప్రభుత్వాలు ఏర్పాటు తర్వాత 7 నెలలపాటు ఉన్న ప్లానింగ్‌ కమిషన్‌కు‌, ఆపై ఏర్పడిన నీతి ఆయోగ్‌కు అధ్యక్షుడు మోదీ అయినా నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్యాకేజీ, హోదాలలో చంద్రబాబు అడిగారన్న కారణంగా ప్యాకేజీ ఇస్తామని ఒప్పుకున్నట్లు కేంద్రం ఎన్నోమార్లు చెప్పింది. ప్యాకేజీ ప్రకటన వినగానే రక్తం మరిగిందన్న చంద్రబాబు.. 5 నిమిషాల్లో ఎందుకు చల్లపడ్డారో ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం నిర్ణయాలను సాదరంగా స్వాగతిస్తూ ఏపీ ప్రజలకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు.

జైళ్లలో వేస్తామని చంద్రబాబు బెదిరించారు
ఎట్టిపరిస్థితుల్లోనైనా రాష్ట్రానికి హోదా ఇస్తేనే అభివృద్ధి సాధ్యమని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో మా పార్టీ అనేక కార్యక్రమాలు చేపట్టింది. మా దీక్షలు, ధర్నాలను పలుమార్లు సీఎం చంద్రబాబు ఎగతాళి చేశారు. బెదిరింపుల ధోరణితో ఉండి, నిరుద్యోగులను సైతం బెదిరించారు. హోదా మీటింగ్‌లకు వెళ్తే జైళ్లలో వేస్తాం. మీ పిల్లలపై పీడీ యాక్ట్‌ పెడతామంటూ నిరుద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులను భయపెట్టారు. విశాఖలో కొవ్వొత్తుల ర్యాలీకి వెళ్తుంటే ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ను ఎయిర్‌పోర్టులోనే అడ్డుకోవడం దారుణం కాదా. గవర్నర్‌, రాష్ట్రపతి, ప్రధాన మంత్రి లాంటి కీలక రాజ్యాంగ నేతలు అందరి దగ్గరికి వెళ్లి వైఎస్‌ జగన్‌ ఏపీలో పరిస్థితిని వివరించారు. హోదా ఆవశ్యకతను వారితో చర్చించారు. కానీ టీడీపీ మాత్రం హోదా పోరాట చర్యలను అడ్డుకున్నారు.

హోదా ఇచ్చేది లేదని కేంద్రం చెబితే.. ఏ పార్టీని అవమానించినట్లు కాదని, ఏపీ ప్రజలు మొత్తాన్ని అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రం హోదా ఏమైనా సంజీవనా. హోదా ఉన్న రాష్ట్రాలు ఏం సాధించాయని ఎదురు ప్రశ్నించారు. ఆపై కేంద్రం ఏ ప్రకటన చేసినా శాలువాలు కప్పి వారికి ధన్యవాదాలు తెలిపారు. సిగ్గు లేకుండా టీడీపీ అలాంటి చర్యలకు పాల్పడింది. దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు. 

అవిశ్వాసంలోనూ కపట నాటకమే
అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెడితే 50 మంది ఎంపీల మద్దతు లభిస్తే చర్చ జరుగుతుందని చంద్రబాబుకు తెలుసు. తొలుత ఎవరు పోరాడినా మద్దతిస్తామన్న చంద్రబాబు 10 గంటల్లోనే మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. వైఎస్సార్‌సీపీకి మేం ఎందుకు మద్దతు ఇవ్వాలని ప్రశ్నించారు. సభ ఆర్డర్‌లో లేదని సాకుగా చూపించి అవిశ్వాస తీర్మానాన్ని పక్కనపెట్టిన స్పీకర్‌.. ఇతరత్రా కీలకబిల్లులని ఆమోదించారని గుర్తుచేశారు. చివర్లో ఏదైనా ప్రకటన వస్తుందని ఎదురుచూసినా నిరాశే ఎదురైంది. ఏప్రిల్‌ 6న వైఎస్సార్‌సీపీ నేతలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి ఎంపీ పదవులకు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టగా ఏదో ఓ సాకు చూపిస్తూ ఒక్కో రోజు ఒక్కరిని ఆస్పత్రికి తరలించి మా దీక్షను భగ్నం చేశారు.

25 మంది ఎంపీలు రాజీనామా చేసి ఉంటే..
ఏపీకి హోదా సాధన కోసం టీడీపీ, బీజేపీ ఎంపీలను సైతం రాజీనామా చేయాలని అప్పీల్‌ చేశాం. కానీ వారు రాజీనామా అనగానే దూరం జరిగారు. వాళ్లు సహకరిస్తే పరిస్థితి మరోలా ఉండేది. అవిశ్వాసం విషయంలో వెనక్కి తగ్గింది, డ్రామాలాడింది టీడీపీయేనంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏపీ ప్రత్యేక హోదాకు సంబంధించిన కథనాల కోసం ఈ కింది లింక్స్ క్లిక్ చేయండి :

టీడీపీ భయపడుతోంది : మిథున్‌ రెడ్డి

‘రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రక ఘట్టం’

ఒకటే మాట.. ఒకటే బాట

‘స్పీకర్‌ ఆమోదాన్ని స్వాగతిస్తున్నాం’

‘టీడీపీకి కచ్చితంగా చెప్పుదెబ్బ’

వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం

మీ త్యాగం వృథా కాదు : వైఎస్‌ జగన్‌

చిత్తశుద్ధి నిరూపించుకున్నాం..

చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి..

వైఎస్‌ జగన్‌కు, చంద్రబాబుకు అంత వ్యత్యాసమా!

ఉప ఎన్నికలు: చంద్రబాబు పోటీకి రారు!

‘వంచన’పై వైఎస్సార్‌ సీపీ గర్జన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement