
సాక్షి, విజయవాడ: పెట్రోల్,డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరు రోడ్డులోని అప్సర సెంటర్ వద్ద రాస్తారోకో నిర్వహించిన సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ..కేంద్రం చీటికి మాటికి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేద ప్రజల నడ్డీ విరుస్తుందని మండిపడ్డారు. పెట్రోల్ ధర రూ.31 ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి యాభై రూపాయలను పన్ను రూపంలో వసూలు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. పెంచిన పన్నులను వెంటనే రద్దు చేయాలని, లేనట్లయితే ఆందోళనలు కొనసాగిస్తామని మధు పేర్కొన్నారు. అరెస్ట్ అయిన నేతల్లో మధు, బాబూరావు, కాశీనాధ్, తదితర నాయకులు ఉన్నారు.