వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

Congress Leader Sunitha Reddy Criticise On KCR Medak - Sakshi

కౌడిపల్లి(నర్సాపూర్‌): రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి తెలిపారు. సోమవారం మండలంలోని మహ్మద్‌గనర్‌గేట్‌ తండా, కొత్త చెరువుతండా, మొండి తండా, శేరితండాలలో  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నికల్లో  ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకుండానే ముందస్తుకు వెళ్లి ప్రజలను మోసం చేశారని తెలిపారు.  మళ్లీ ఇప్పుడు గ్రామాల్లోరి వచ్చి ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయని టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలకు ప్రజలు అధికారం అప్పగిస్తే కేసీఆర్‌ కుటంబంలో ఐదు ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు.

ప్రజలకు డబుల్‌బెడ్‌రూం, మూడెకరాల భూపంపిణీ తదితర ఏ ఒక్కహామీని సైతం నెరవేర్చలేదన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులకు సంక్షేమ పథకాలు, ట్రాక్టర్లు పంపిణీ చేశారని విమర్శించారు.  గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ చేసిన అభివృద్ధి పనులు తప్ప టీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని ముందస్తుకు వెళుతున్నారని విమర్శించారు. గ్రామాలలో మంచినీళ్లు లేవుకాని మద్యం మాత్రం ఏరులై పారుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎల్లం, యూత్‌ అధ్యక్షుడు ప్రవీన్‌కుమార్, మాజీ ఎంపీపీ యాదాగౌడ్, మాజీ సీడీసీ దుర్గారెడ్డి, బీసీ, ఎస్సీ, మైనార్టీ సెల్‌ అధ్యక్షులు బోయిని వీరయ్య, శివ, సయ్యద్‌పాష, సోషల్‌ మీడియా అధ్యక్షుడు జీవన్‌గౌడ్, నాయకులు మధుసూదన్‌గౌడ్, ర«ఘు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
నర్సాపూర్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సునీతారెడ్డి ఆరోపించారు. సోమవారం రాత్రి ఆమె స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నాయకులు అధికారంలో ఉన్నంత కాలం ప్రజలకు ఏమీ చేయలేదని, ప్రస్తుతం ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తూ ఆకట్టుకునేందుకు కుతంత్రాలు పన్నుతున్నారని ఆమె చెప్పారు.  కాంగ్రెస్‌ పార్టీ నాయకులను తమ పార్టీలోకి లాక్కుంటున్నారన్నారు. ఇంకా  నాయకులను లాక్కునేందుకు కుట్రలు పన్నుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. నర్సాపూర్‌ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంచి బలం ఉందని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆమె అన్నారు. ఉమ్మడి జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసకుంటామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top