ఏటా సుమారు కోట్లమంది సందర్శిస్తున్న కేరళలోని అయ్యప్ప ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది.
న్యూఢిల్లీ: ఏటా సుమారు 10 కోట్ల మంది సందర్శిస్తున్న కేరళలోని అయ్యప్ప ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. శబరిమలలో 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం 18 ఎత్తై కొండల మధ్య ఉంది. సముద్రమట్టానికి 4,133 అడుగుల ఎత్తులో నిర్మితమైంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే సరైన రవాణా మార్గం లేదు. దాదాపు 50 కి.మీ. కాలినడక సాగించి అయ్యప్ప దర్శనం చేసుకోవాలి. ఏటా కార్తీక మాసంలో 40 రోజుల కఠోర దీక్షను అనుసరించి భక్తులు శబరిమలకు వెళ్తారు. అయితే ఆలయ నిబంధనల ప్రకారం 10-50 ఏళ్ల మధ్య ఉన్న (రుతుచక్రంలో ఉండే) మహిళలకు ఈ గుడిలోకి ప్రవేశం లేదు.
దీనికి 1991లో కేరళ హైకోర్టు కూడా చట్టబద్ధత కల్పిస్తూ ఆయా మహిళల అనుమతిపై నిషేధం విధించింది. తర్వాత కేరళ ప్రభుత్వం కూడా దీన్ని సమర్థించింది. అయితే వయోభేదం లేకుండా మహిళలందరినీ ఆలయంలోకి అనుమతించాలంటూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది సుప్రీంకోర్టుకు చేరింది. మహిళలందరికీ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశం కల్పించి, పూజలు చేసే అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కేరళ ప్రభుత్వం కూడా తన వాదనపై వెనక్కి తగ్గి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అనుకూలమేనని తెలిపింది.