‘పెట్రో’ ధరలకు మళ్లీ రెక్కలు | Petrol, diesel prices touch record highs | Sakshi
Sakshi News home page

‘పెట్రో’ ధరలకు మళ్లీ రెక్కలు

Sep 10 2018 2:14 AM | Updated on Sep 10 2018 9:05 AM

Petrol, diesel prices touch record highs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపుతో ఇప్పటికే అల్లాడుతున్న సామాన్య ప్రజలకు ప్రభుత్వ ఆయిల్‌ కంపెనీలు మరోసారి షాకిచ్చాయి. ఆదివారం లీటర్‌ పెట్రోల్‌పై 12 పైసలు, డీజిల్‌పై 10 పైసలు పెంచాయి. దీంతో దేశరాజధానిలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.80.50కు చేరగా, డీజిల్‌ రూ.72.61కు చేరి ఆల్‌టైం రికార్డును సృష్టించాయి. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకూ లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.42, డీజిల్‌పై రూ.3.84ను ఆయిల్‌ కంపెనీలు పెంచాయి. ప్రస్తుతం ఆయిల్‌ రిఫైనరీల వద్ద లీటర్‌ పెట్రోల్‌ రూ.40.50, డీజిల్‌ రూ.43గా ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకాలతో పాటు ఆయా రాష్ట్రాలు విధిస్తున్న వ్యాట్‌ను తగ్గించకపోవడంతో తాజాగా చమురు ధరలు చుక్కల్ని తాకుతున్నాయి.

ప్రస్తుతం కేంద్రం లీటర్‌ పెట్రోల్‌పై రూ.19.48, డీజిల్‌పై రూ.15.33 ఎక్సైజ్‌ సుంకాన్ని విధిస్తోంది. ఇక మహారాష్ట్రలోని ముంబైలో పెట్రోల్‌పై అత్యధికంగా 39.12 శాతం వ్యాట్‌ విధిస్తుండగా, తెలంగాణలో డీజిల్‌పై అత్యధికంగా 26 శాతం వ్యాట్‌ విధిస్తున్నారు.  2014–15లో రూ.99,184 కోట్లుగా ఉన్న కేంద్ర ఎక్సైజ్‌ రాబడి..2017–18 నాటికి రూ.2,29,019 కోట్లకు ఎగబాకింది. రాష్ట్రాల వ్యాట్‌ 2014–15లో రూ.1,37,157 కోట్ల నుంచి 2017–18 నాటికి రూ.1,84,091 కోట్లకు పెరిగింది. రాజస్తాన్‌లో పెట్రోల్, డీజిల్‌ ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం వసుంధరా రాజే తెలిపారు. దీంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటర్‌కు రూ.2.4 మేర తగ్గుతాయన్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్‌ ధరల్ని తగ్గించేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement