‘నమో’ ప్రసారాలపై ఈసీ కీలక ఆదేశాలు

EC Says NaMo TV Have To Follow Silence Period As Per Election Law - Sakshi

న్యూఢిల్లీ : బీజేపీ ఇటీవల ప్రారంభించిన ‘నమో టీవీ’పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రసారాలను నిలిపివేయాలని ఆదేశించింది. ప్రచారాలకు సంబంధించిన వార్తలు ప్రసారం చేయడం ద్వారా ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున వాటిని నిషేధించాలని పేర్కొంది. ఈ మేరకు పోలింగ్‌ ప్రతీ దశలో రెండు రోజుల ముందు నుంచి నమో టీవీ ప్రసారాల తీరును గమనించాల్సిందిగా ఢిల్లీ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది. అదే విధంగా నమోటీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలు, వాటికి వస్తున్న అడ్వర్టైజ్‌మెంట్ల వివరాలు, వివిధ కార్యక్రమాలకు అవుతున్న ఖర్చు వివరాలను పరిశీలించాల్సిందిగా పేర్కొంది. ప్రజాప్రాతినిథ్య చట్టంలోని 126 సెక్షన్‌ కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.

కాగా రాజకీయ ప్రచారానికి సంబంధించిన సమాచారాన్ని తొలుత సర్టిఫికేషన్‌ చేయకుండా నమో చానల్‌లో ప్రసారం చేయరాదని ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏవైనా వీడియోలు ప్రసారమైతే వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ ఎన్నికల ప్రధానాధికారికి సూచించింది. తాము నియమించిన మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ ఆమోదం పొందినవాటినే ప్రసారం చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘నమో టీవీ’ ప్రసారాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశముందని కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ఢిల్లీ సీఈవోను ఈసీ ఆదేశించింది. నమో టీవీ సర్టిఫికేషన్‌ లేకుండానే పలు వీడియోను ప్రసారం చేసినట్లు సీఈవో గుర్తించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top