యూపీ, ఢిల్లీలో హాట్‌స్పాట్లు మూసివేత

Corona Virus: Uttar Pradesh, Delhi Seal Covid-19 Hotspots - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 343కు చేరడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో 15 జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను (హాట్‌స్పాట్లు) ఈ నెల 15వ తేదీ వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే తివారి బుధవారం ప్రకటించారు. హోమ్‌ డెలివరీ, వైద్య బృందాలను మాత్రమే ఇక్కడికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉండటంతో ఒకరి నుంచి మరొకరి కోవిడ్‌ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నట్టు వెల్లడించారు.

లక్నో, ఆగ్రా, ఘజియాబాద్‌, గౌతమ్‌బుద్ధ నగర్‌(నోయిడా), కాన్పూర్‌, వారణాసి, షామ్లి, మీరట్‌, బరేలీ, బులంద్‌షహర్‌, ఫిరోజాబాద్‌, మహరాజ్‌గంజ్‌, సీతాపూర్‌, సహరన్‌పూర్‌, బస్తీ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌లను మూసివేసినట్టు తెలిపారు. మొత్తం జిల్లాలను మూసివేయడం లేదని, హాట్‌స్పాట్ల వరకే ఇది పరిమితమని హెంశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ్‌ అవస్థి స్పష్టం చేశారు. అలాగే ఢిల్లీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న 20 హాట్‌స్పాట్లు మూసివేశారు. (ఆ ప్రచారం తప్పు: ప్రధాని మోదీ)

ఆగ్రాలో 22, ఘజియాబాద్‌లో 13, లక్నో, కాన్పూర్‌, నోయిడాల్లో  12, మీరట్‌లో 7, వారణాసి, షహరన్‌పూర్‌, మహరాజ్‌గంజ్‌లలో  4, షామ్లి, బులంద్‌షహర్‌, ఫిరోజాబాద్‌, బస్తిల్లో 3 చొప్పున హాట్‌స్పాట్‌లను గుర్తించినట్టు యూపీ ప్రభుత్వం తెలిపింది. హాట్‌స్పాట్‌లుగా గుర్తించిన ప్రాంతాల్లో రాకపోకలను పూర్తిగా నిషేధిస్తారు. అత్యవసర సేవలు, మీడియా సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇళ్లలోని వారు బయటకు రాకుండా ఆంక్షలు ఉంటాయి. ప్రతి ఇంటిని శానిటైజ్‌ చేస్తారు. (కరోనా: లాక్‌డౌన్‌ కొనసాగించాలి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top