మిత్రపక్షాలతో చర్చించాకే.. | Amit Shah about presidential candidate selection | Sakshi
Sakshi News home page

మిత్రపక్షాలతో చర్చించాకే..

Jun 18 2017 2:22 AM | Updated on May 28 2018 3:58 PM

మిత్రపక్షాలతో చర్చించాకే.. - Sakshi

మిత్రపక్షాలతో చర్చించాకే..

అన్ని మిత్రపక్షాలతో చర్చించాకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై అమిత్‌ షా
ముంబై: అన్ని మిత్రపక్షాలతో చర్చించాకే రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా పేర్కొన్నారు. భారత హరిత విప్లవ పితామహుడు ఎం.ఎస్‌. స్వామినాథన్‌ పేరును రాష్ట్రపతి ఎన్నిక కోసం శివసేన చేసిన సూచనపై ఆయన స్పందించారు. బీజేపీ బలోపేతం కోసం మహారాష్ట్రలో పర్యటిస్తున్న షా శనివారం మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్‌ల మధ్య త్వరలో ద్వైపాక్షిక క్రికెట్‌ సంబంధాలు పునఃప్రారంభం అవుతాయన్న వార్తల్ని తోసిపుచ్చారు. ‘అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్, పాకిస్తాన్‌లు కలిసి ఆడడం కొనసాగుతుంది. అయితే పాకిస్తాన్‌లో భారత్‌ గానీ, భారత్‌లో పాకిస్తాన్‌ గానీ ఆడవ’ని సమాధానమిచ్చారు.

మహారాష్ట్రలో ముందస్తు ఎన్నికలకు బీజేపీ సిద్ధమన్న మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ఒకవేళ మధ్యంతర ఎన్నికలుS తప్పనిసరైతే వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమనేదే ఫడ్నవిస్‌ అభిప్రాయమని వివరణిచ్చారు.  రాష్ట్రపతి ఎన్నికల అభ్యర్థి రేసులో ఉన్నానంటూ వస్తోన్న వార్తల్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తోసిపుచ్చారు. శనివారం విలేకరుల ప్రశ్నకు సమాధానమిస్తూ..‘అవన్నీ పుకార్లు.. నేను విదేశాంగ శాఖ మంత్రిని.. అయితే మీరు పార్టీ అంతర్గత విషయంపై ప్రశ్నిస్తున్నార’ని చెప్పారు. కాగా రాష్ట్రపతి ఎన్నికల కోసం శనివారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement