ఆ జంట ఆతిథ్యానికే రూ 4 కోట్లు.. | Priyanka And Nick Have Spent Rs Four Crore On Wedding Festivities In Jodhpur | Sakshi
Sakshi News home page

ఆ జంట ఆతిథ్యానికే రూ 4 కోట్లు..

Nov 27 2018 4:14 PM | Updated on Apr 3 2019 6:34 PM

Priyanka And Nick Have Spent Rs Four Crore On Wedding Festivities In Jodhpur - Sakshi

ఆ జంట పెళ్లికి కోట్లు వెదజల్లుతున్నారు..

ముంబై : బాలీవుడ్‌లో ఈ ఏడాది సెలబ్రిటీల పెళ్లిళ్లు హాట్‌ టాపిక్‌లా మారాయి. ముంబైలో అట్టహాసంగా సోనం కపూర్‌, ఆనంద్‌ అహుజాల పెళ్లి వేడుకతో మొదలైన హంగామా ఆ తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పడుకోన్‌ల ఇటలీ వెడ్డింగ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక జోథ్‌పూర్‌లో దేశీ గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా, అమెరికన్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ల పెళ్లి వేడుకకు చారిత్రక ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ సన్నద్ధమవుతోంది. నవంబర్‌ 29న ప్రారంభమయ్యే వేడుకలు డిసెంబర్‌ 2, 3 తేదీల్లో రెండు సంప్రదాయాల ప్రకారం సాగే పెళ్లి వేడకుతో ముగుస్తాయి. అంగరంగ వైభవంగా సాగే పెళ్లి తంతు కోసం నవంబర్‌ 29 నుంచి డిసెంబర్‌ 3 వరకూ ప్రియాంక, నిక్‌ జోడీ తాజ్‌ ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌ను బుక్‌ చేసినట్టు సమాచారం.

మెహ్రాన్‌గర్‌ కోటలో మెహంది, సంగీత్‌లను ఆర్భాటంగా నిర్వహిస్తారు. జోధ్‌పూర్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌కు ప్రియాంక, ఆమె తల్లి మధు చోప్రా, సోదరుడు సిద్ధార్ధ్‌లు నిక్‌ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో చేరుకోనున్నారు. మొత్తం 64 గదులున్న ఈ ప్యాలెస్‌లో 22 రూమ్‌లు 42 సూట్స్‌ ఉన్నాయి. వీటిలో ప్యాలెస్‌ రూమ్‌లు రోజుకు గదికి రూ 47,300 చార్జ్‌ చేస్తుండగా, సూట్స్‌కు రూ 65,300 వసూలు చేస్తారు. రాయల్‌ సూట్‌ ఖరీదు రోజుకు రూ 1.45 లక్షలు కాగా, గ్రాండ్‌ రాయల్‌ సూట్‌కు రూ 2.3 లక్షలు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌కు రూ 5.04 లక్షల చార్జ్‌ చేస్తారు. 

ఐదు రోజుల వసతికి గాను ప్రియాంక, నిక్‌ జోడీ రూ 3.2 కోట్లు తమ బృందం ప్యాలెస్‌లో గడిపేందుకే వెచ్చిస్తోంది. మెహ్రన్‌గర్‌ కోటలో వేడుకలు జరపాలంటే ప్యాలెస్‌లో కనీసం 40 రూమ్‌లు బుక్‌ చేయాల్సి ఉంటుందని మెహ్రనగర్‌ ఫోర్ట్‌ అధికారి వెల్లడించారు. ఇక ఒక్కో వ్యక్తికి కేటరింగ్‌ కోసం రూ 18,000 వసూలు చేస్తారు. మూడు వేడుకలకు కలిపి కేటరింగ్‌కే రూ 43 లక్షల ఖర్చవుతుందని అంచనా. మొత్తంమీద ప్రియాంక, నిక్‌ జొనాస్‌ జోధ్‌పూర్‌ వివాహ వేడుకలకు రూ 4 కోట్లు ఖర్చు చేయనున్నారు.

ఇక రణ్‌వీర్‌, దీపికల తరహాలోనే రెండు సంప్రదాయాల ప్రకారం ప్రియాంక జోడీ వివాహం జరగనుంది. డిసెంబర్‌ 2న క్రిస్టియన్‌ వివాహం జరగనుండగా, డిసెంబర్‌ 3న హిందూ సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగనుంది. కాగా వివాహం అనంతరం ఢిల్లీ, ముంబైల్లో భారీ రిసెప్షన్‌లు ఏర్పాటు చేయనున్నారు. దేశ రాజధానిలో ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో ఘనంగా రిసెప్షన్‌ ఇచ్చేందుకు ప్రియాంక, నిక్‌ జోడీ సిద్ధమవుతోంది. ఇక బాలీవుడ్‌ ప్రముఖులు, స్నేహితుల కోసం ముంబైలో ఘనంగా విందు ఇవ్వనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement