దుమ్మురేపుతున్న ‘ఖిలాడీ’ వసూళ్లు | Good Newwz Crosses 100 Crore Today | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న ‘ఖిలాడీ’ వసూళ్లు

Jan 1 2020 12:04 PM | Updated on Jan 1 2020 12:27 PM

Good Newwz Crosses 100 Crore Today - Sakshi

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌, బాక్సాఫీస్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ తాజా సినిమా ‘గుడ్‌న్యూస్‌’ బాలీవుడ్‌కు నిజంగానే గుడ్‌న్యూస్‌గా మారింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల ప్రశంసలు పొందుతూ కళ్లుచెదిరేరీతిలో వసూళ్లు రాబడుతోంది. ఒకవైపు పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నప్పటికీ.. ఆ ప్రభావం అంతగా ‘గుడ్‌న్యూస్‌’పై లేదని బాక్సాఫీస్‌ లెక్కలు చాటుతున్నాయి. వీక్‌ డేస్‌లో నిలకడగా వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా మంగళవారం ఏకంగా 16 కోట్లు వసూలు చేసింది. దీంతో ఐదురోజుల్లో ఈ సినిమా వసూళ్లు రూ. 94 కోట్లకు చేరుకున్నాయి. ఈ రోజు కొత్త సంవత్సరం కావడంతో బుధవారం భారీగా ఈ సినిమా వసూళ్లు సాధించే అవకాశముంది. దీంతో ఆరు రోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల క్లబ్బులోకి చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

మంచి కంటెంట్‌, వినూత్నమైన కథనంతో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గత శుక్రవారం రూ. 17.56 కోట్లు, శనివారం రూ. 21.78 కోట్లు, ఆదివారం రూ. 25.65 కోట్లు, సోమవారం రూ. 13,41 కోట్లు, మంగళవారం రూ. 16.20 కోట్లు మొత్తంగా రూ. 94.60 కోట్లను ఈ సినిమా కలెక్ట్‌ చేసిందని బాలీవుడ్‌ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు.

అక్షయ్‌-కరీనా కపూర్‌, దిల్జిత్‌ దోసాన్జ్‌-కియారా అద్వానీ జోడీలుగా నటించిన ఈ సినిమాలో కృత్రిమ గర్బధారణ సమయంలో జరిగిన ఓ తప్పిదం వల్ల రెండు జంటలకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే కథ. ఇదొక సున్నిత అంశమైనప్పటికీ దర్శకుడు రాజ్‌ మెహతా దాన్ని ఎక్కడా అపహాస్యం చేయకుండా జాగ్రత్తపడుతూ ప్రేక్షకులకు చక్కని వినోదాన్ని పంచాడు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ చిత్రం స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ ‘దబాంగ్‌ 3’ను పక్కకునెట్టి మరీ గూడ్‌న్యూస్‌ వసూళ్లు రాబట్టడం.. ట్రెడ్‌ విశ్లేషకులను ఆశ్చర్యపరుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement