లిపులేఖ్‌ భారత్‌లో అంతర్భాగం.. నేపాల్‌ అభ్యంతరం! | Nepal Summons Indian Envoy Protest Against Road To Lipulekh | Sakshi
Sakshi News home page

భారత్‌, చైనాలతో చర్చించేందుకు సిద్ధం: నేపాల్‌

May 11 2020 7:23 PM | Updated on May 11 2020 8:59 PM

Nepal Summons Indian Envoy Protest Against Road To Lipulekh - Sakshi

ఖాట్మండూ: లిపూలేఖ్‌ ప్రాంతంలో భారత్‌ చేపట్టిన రోడ్డు నిర్మాణంపై నేపాల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ... తమ దేశంలోని భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వట్రాకు సోమవారం నోటీసులు జారీ చేసింది. లిపూలేఖ్‌ తమ ఆధీనంలోని ప్రాంతమని పేర్కొంది. కాగా భారత్‌- చైనా సరిహద్దులో గల లిపూలేఖ్‌ వెంబడి భారత ప్రభుత్వం ఇటీవల రహదారి నిర్మాణం చేపట్టింది. ఇందుకు అభ్యంతరం తెలిపిన నేపాల్‌ ప్రభుత్వం సదరు ప్రాంతం తమ భూభాగానికి చెందినదే అని శనివారం భారత్‌కు స్పష్టం చేసింది. ఈ విషయంపై స్పందించిన భారత్‌.. ‘‘లిపూలేఖ్‌ పూర్తిగా భారత అంతర్భాగం’’అని కౌంటర్‌ ఇచ్చింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య ఈ విషయంపై ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. (ఇండో–చైనా సరిహద్దులో ఉద్రిక్తత)

ఈ నేపథ్యంలో నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ గ్యావాలి మాట్లాడుతూ.. సరిహద్దు విషయంలో భారత్‌తో తలెత్తిన విభేదాలు పరిష్కరించుకోవడానికి కరోనా సంక్షోభం ముగిసేంత వరకు ఎదురుచూడబోమని వ్యాఖ్యానించారు. లిపూలేఖ్‌ గురించి భారత్‌తో పాటు చైనాతో కూడా చర్చించాల్సి ఉందన్నారు. ‘‘లిపూలేఖ్‌ నేపాల్‌, భారత్‌, చైనా ట్రై జంక్షన్‌లో ఉంది. భారత్‌తో మాట్లాడిన వెంటనే చైనాతోనూ చర్చలు జరుపుతాం. ఏ స్థాయి అధికారులతో చర్చించేందుకైనా మేం సిద్ధంగా ఉన్నాం. ప్రధాని లేదా విదేశాంగ మంత్రితో మేం మాట్లాడగలం’’అని పేర్కొన్నారు. కాగా ఉత్తరాఖండ్‌లోని ధార్‌చలా నుంచి లిపులేఖ్‌ వరకు భారత్‌ రోడ్డు నిర్మాణం చేపట్టింది. రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ఈ మేరకు కైలాశ్‌- మానస సరోవర్‌ వరకు 80 కిలోమీటర్ల మేర రోడ్డు మార్గానికి శంకుస్థాపన చేశారు.(చైనాకు దెబ్బ : ఇండియాకే ప్రాధాన్యం)

Advertisement
 
Advertisement
Advertisement