దూసుకొచ్చిన మృత్యువు | two men met with accident | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

Oct 6 2016 12:57 AM | Updated on Apr 3 2019 7:53 PM

మృత్యువు ఐచర్‌ వాహన రూపంలో దూసుకొచ్చింది. ఆటోను బలంగా ఢీకొంది. అందులో ఉన్న ఇద్దర్ని కబళించింది. ఈ సంఘటన మడకశిర రూరల్‌ మండలం కల్లుమర్రి–అగ్రంపల్లి గ్రామాల మధ్య బుధవారం జరిగింది.

మడకశిర రూరల్‌ : మృత్యువు ఐచర్‌ వాహన రూపంలో దూసుకొచ్చింది. ఆటోను బలంగా ఢీకొంది. అందులో ఉన్న ఇద్దర్ని కబళించింది. ఈ సంఘటన మడకశిర రూరల్‌ మండలం కల్లుమర్రి–అగ్రంపల్లి గ్రామాల మధ్య బుధవారం జరిగింది. మడకశిర ఎస్‌ఐ మగ్బుల్‌బాషా కథనం ప్రకారం... కల్లుమర్రికి  చెందిన రామప్ప(65), హనుమంతరాయుడు(21) సహా కలూమ్‌ అనే వ్యక్తులు ఆటోలో హిందూపురానికి బయలుదేరారు. కల్లుమర్రి–అగ్రంపల్లి మార్గమధ్యంలో మడకశిర వైపు నుంచి విపరీతమైన వేగంతో వచ్చిన ఐచర్‌ వాహనం ఆటోను ఢీకొనడంతో అది అదుపు తప్పి బోల్తాపడింది. అందులోని ముగ్గురూ గాయపడ్డారు.వారిని 108లో హిందూపురం ఆస్పత్రికి తరలిస్తుండగానే రామప్ప మృతి చెందగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హనుమంతరాయుడు మరణించారు. తీవ్రంగా గాయపడిన కలూమ్‌ను మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మగ్బుల్‌బాషా తెలిపారు. కాగా ఘటన స్థలంలో జనం భారీగా గుమిగూడారు.
నాన్న చనిపోయిన నాలుగు రోజులకే...
హనుమంతరాయుడు తండ్రి అంజప్ప నాలుగు రోజుల కిందట మరణించారని గ్రామస్తులు తెలిపారు. ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి తేరుకోకనే ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకులిద్దరూ చనిపోవడంతో కల్లుమర్రిలో విషాదం నెలకొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement