పెసరలో... ‘పల్లాకు’ నివారిస్తే లాభాలే !
పల్లాకు తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే పెసర పంట మంచి లాభదాయకమైనదేనని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి. సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు.
అనంతపురం అగ్రికల్చర్ : పల్లాకు తెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటే పెసర పంట మంచి లాభదాయకమైనదేనని ఏరువాక కేంద్రం (డాట్ సెంటర్) కో ఆర్డినేటర్ డాక్టర్ డి. సంపత్కుమార్, శాస్త్రవేత్త కె.రామసుబ్బయ్య తెలిపారు. 2015లో భారీ విస్తీర్ణంలో పంట సాగులోకి రాగా... ఊహించని రీతిలో పల్లాకు తెగులు ఆశించి పంట పసుపురంగులోకి మారడంతో రైతులకు నష్టం జరిగిందన్నారు. ఈ క్రమంలో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటించాలని తెలిపారు.
తెగులు యాజమాన్యం
పల్లాకు తెగులు తట్టుకునే రకాలైన ఎల్జీజీ–460, ఎల్జీజీ–407, పీడీఎం–54, ఎమ్ఎల్–267, డబుల్ 42 లాంటి విత్తనాలను ఎంచుకోవాలి. 5 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సామ్ + 1 గ్రాము కార్బండిజమ్ లేదా 2.5 గ్రాములు మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి తప్పనిసరిగా విత్తనశుద్ధి చేసుకోవాలి. దీని వల్ల తొలి దశలో పైరును ఆశించే వైరస్ తెగులు, రసంపీల్చే పురుగులు, వేరుకుళ్లు తెగులు బారి నుంచి కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీలోగా విత్తుకుంటే తెగుళ్లు, పురుగుల వ్యాప్తి బాగా తగ్గుతుంది.
వేసవిలో లోతుగా దుక్కులు చేసుకున్నా మంచి ప్రయోజనం ఉంటుంది. పైరు చుట్టూ నాలుగు వరుసలు జొన్న లేదా మొక్కజొన్న విత్తుకుంటే వైరస్ తెగుళ్లను వ్యాప్తి చేసే తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంక లాంటి రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలను వెంటనే పీకేసుకోవాలి. పొలంలో అక్కడక్కడా జిగురు పూసిన పసుపు రంగు రేకులు లేదా అట్టలు లేదా పళ్లాలు ఉంచితే తెల్లదోమ ఉనికి, ఉధృతిని అంచనా వేయవచ్చు. విత్తిన 15 లేదా 20 రోజులకు 5 మి.లీ వేపనూనె ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. తెల్లదోమ నివారణకు 1.25 మి.లీ ట్రైజోఫాస్ లేదా 1 గ్రాము అసిఫేట్ లేదా 1.5 మి.లీ ప్రొపినోఫాస్ ఇందులో ఒక మందును 10 నుంచి 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేసుకుంటే తెగుళ్లను సమూలంగా నివారించవచ్చు.


