కారును ఢీకొన్న లారీ, పెళ్లింట విషాదం

Gooty Road Accident: Lorry hits Car, one lost breath - Sakshi

సాక్షి, గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కలచెరువు వద్ద ఆదివారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో పెళ్లి కుమార్తె తండ్రి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో పెళ్లికూమార్తె సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివాహ కార్యక్రమానికి కర్నూలు నుంచి కొండాపురం వెళుతున్న ఓ కారును లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

నల్లవాగు వద్ద ఘోర ప్రమాదం
కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలో నల్లవాగు వద్ద నిన్న (శనివారం) జరిగిన ప్రమాదంలో మృతి చెందినవారి సంఖ్య నాలుగుకి చేరింది. కర్ణాటక రాయచూర్‌ జిల్లా తుంగభద్ర గ్రామానికి చెందిన గురుస్వామి తన కుటుంబసభ్యులతో కలిసి నిన్న ఉదయం ఎమ్మిగనూరుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. స్థానికంగా ఉన్న సోదరిని చూసి తిరిగి స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే మంత్రాలయం గ్రామ శివారులోని నల్లవాగు వద్ద బైక్‌ అదుపు తప్పి పక్కనున్న ఇనుప దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుస్వామి కుమారుడు మహేష్‌ (4) అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నభార్య నాగవేణి, కుమార్తెలు మౌనిక, శైలజ ఆదివారం ఉదయం మృతి చెందారు. మరోవైపు గురుస్వామి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top