మైండ్‌ ట్రీ 200% స్పెషల్‌ డివిడెండ్‌

IT major Mindtree joins $1-billion club - Sakshi

షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ 

వంద కోట్ల డాలర్లకు వార్షికాదాయం 

9 శాతం వృద్ధితో రూ.198 కోట్లకు నికర లాభం

న్యూఢిల్లీ: మిడ్‌– సైజ్‌ ఐటీ కంపెనీ మైండ్‌ ట్రీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో 9 శాతం పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.182 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.198 కోట్లకు పెరిగిందని మైండ్‌ట్రీ తెలిపింది. ఆదాయం రూ.1,464 కోట్ల నుంచి 26% వృద్ధితో రూ.1,839 కోట్లకు పెరిగిందని పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, నికర లాభం 32% వృద్ధితో రూ.754కు, మొత్తం ఆదాయం 29 శాతం వృద్ధితో రూ.7,021 కోట్లకు పెరిగాయని మైండ్‌ట్రీ సీఈఓ, ఎమ్‌డీ రోస్టో రావణన్‌ తెలిపారు.  

వంద కోట్ల డాలర్లు దాటిన వార్షికాదాయం.... 
ఒక్కో షేర్‌కు రూ.3 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని రావణన్‌ తెలిపారు. ఈ మధ్యంతర డివిడెండ్‌ను వచ్చే నెల 10లోగా చెల్లిస్తామని, అలాగే ఒక్కో షేర్‌కు రూ.4 తుది డివిడెండ్‌ను కూడా చెల్లించనున్నామని వివరించారు. అంతే కాకుండా  రూ.20 (200%) స్పెషల్‌ డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని పేర్కొన్నారు. వార్షికాదాయం వంద కోట్ల డాలర్లు దాటిందని, కంపెనీ 20వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, దీని కారణంగా ఈ స్పెషల్‌ డివిడెండ్‌ను ఇస్తున్నామని వివరించారు. 

రూ.368 కోట్ల డివిడెండ్‌ చెల్లింపులు... 
మొత్తం 16 కోట్ల ఈక్విటీ షేర్లున్నాయని, స్పెషల్‌ డివిడెండ్‌ కింద ప్రమోటర్లకు, వాటాదారులకు రూ.320 కోట్ల మేర చెల్లించనున్నామని ఈ సందర్భంగా రావణన్‌ తెలిపారు. మధ్యంతర డివిడెండ్‌ను కూడా కలుపుకుంటే మొత్తం డివిడెండ్‌ చెల్లింపులు రూ.368 కోట్లకు పెరుగుతాయని వివరించారు. ఈ స్పెషల్‌ డివిడెండ్‌ ప్రతిపాదనకు జూన్‌/జూలైల్లో జరిగే వార్షిక సాధారణ సమావేశంలో వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉందని పేర్కొన్నారు. (అప్పటికల్లా ఎల్‌ అండ్‌ టీ ఓపెన్‌ ఆఫర్‌ ముగుస్తుంది) గత ఆర్థిక సంవత్సరంలోనూ, గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లోనూ చెప్పుకోదగ్గ స్థాయి పనితీరు సాధించామని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కంపెనీని ఎల్‌అండ్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top