క్యూ1లో 46% అప్; రూ.3,226 కోట్లు
ముంబై: దేశీ వాహన దిగ్గజం బజాజ్ ఆటో బంపర్ ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2026–27, క్యూ1)లో కంపెనీ రూ.3,226 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది క్యూ1తో పోలిస్తే 46 శాతం దూసుకెళ్లింది. మొత్తం ఆదాయం 64 శాతం ఎగసి రూ. 22,377 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 13,642 కోట్లుగా నమోదైంది. టూ, త్రీవీలర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల జోరు, రికార్డు స్థాయి ఎగుమతులు క్యూ1లో మెరుగైన పనితీరుకు దన్నుగా నిలిచాయి. స్టాండెలోన్ ప్రాతిపదికన కూడా కంపెనీ నికర లాభం 42 శాతం వృద్ధితో రూ. 2,983 కోట్లకు జంప్ చేసింది. స్టాండెలోన్ ఆదాయం 37 శాతం పెరిగి రూ. 17,244 కోట్లను తాకింది.
వాహన విక్రయాలు జూమ్..
క్యూ1లో బజాజ్ ఆటో మొత్తం 14,38,251 వాహనాలను విక్రయించింది. క్రితం ఏడాది అమ్ముడైన 11,11,237 వాహనాలతో పోలిస్తే 29 శాతం పెరిగాయి. దేశీ వాహన సేల్స్ 11 శాతం వృద్ధి చెందగా, ఎగుమతులు ఏకంగా 54 శాతం ఎగబాకాయి. ఎగుమతులు తొలిసారి 7 లక్షల మార్కును అధిగమించాయని కంపెనీ వెల్లడించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్కు సరఫరాను మించి డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో ఉత్పత్తి పెంచేందుకు మరిన్ని పెట్టుబడులు పెడుతున్నామని వివరించింది.
ఫలితాల నేపథ్యంలో బజాజ్ ఆటో షేరు 1 శాతం నష్టంతో రూ.10,408 వద్ద ముగిసింది.


