గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీటిమట్టం తగ్గినా ఆలయాలు ముంపులోనే ఉన్నాయి.
రెండో ప్రవూద హెచ్చరిక ఉపసంహరణ
Aug 8 2013 3:28 AM | Updated on Sep 1 2017 9:42 PM
కొవ్వూరు, న్యూస్లైన్: గోదావరి వరద క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీటిమట్టం తగ్గినా ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. ఇక్కడ రెండు అడుగుల మేరకు వరదనీరు ప్రవహిస్తోంది. రహదారులపై బురద పేరుకుపోయింది. గురువారం సాయంత్రానికి వరద పూర్తిగా తగ్గే అవకాశముందని అధికారులు అంటున్నారు. ఏడు రోజులుగా వరద ముంచెత్తడంతో గీతామందిరం ప్రాంగణంలో సుమారు మూడు అడుగుల మేర ఒండ్రు మట్టి పేరుకుపోయింది. మద్దూరులంక గ్రామం వరద ముంపు నుంచి తేరుకుంది. అయినా లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచే ఉంది.
సముద్రంలోకి 13.02 లక్షల క్యూసెక్కులు
ఎగువ నుంచి వచ్చే వరద నీరు తగ్గడంతో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం తగ్గుతుంది. ఆనకట్ట వద్ద బుధవారం సాయంత్రం 6 గంటలకు నీటిమట్టం 13.70 అడుగులకు తగ్గడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఉదయం 6 గంటలకు 15.10 అడుగులున్న నీటిమట్టం సాయంత్రం 7 గంటలకు 13.50 అడుగులకు తగ్గింది. ఆనకట్ట నుంచి 13,02,785 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక గురువారం మధ్యాహ్నానికి ఉపసంహరించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దెబ్బతిన్న పంటలు : వరద ముంచెత్తడంతో పోలవరం, కొవ్వూరు, తాళ్లపూడి, నిడదవోలు, పెరవలి, ఆచంట, యలమంచిలి మండలాల్లో వేలాది ఎకరాల లంక భూముల్లోని పంటలు ముంపుబారిన పడ్డాయి. అరటి, దొండ, వంగ, కూరగాయలు, చెరకు, మొక్కజొన్న రైతులు నష్టపోయారు. చెరకు తోటల్లో బురద చేరి పంటలు కుళ్లిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు. అంటువ్యాధులు వ్యాపించే అవకాశముందని లంకవాసులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి బోర్లు, చేతిపంపుల్లో నుంచి వరద నీరు వస్తోందని అంటున్నారు. లోతట్టు ప్రాం తాల్లో బురద తొలగించేందుకు పారిశుధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement