టీడీపీ నేతలే చేశారంటున్న వైఎస్సార్సీపీ నాయకుడు
బాధితుడికి రూ.15.90 లక్షల నష్టం !
అత్తిలి: గుర్తుతెలియని వ్యక్తులు రొయ్యల చెరువులో విష ప్రయోగం చేయడంతో రొయ్యలు మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లిలో జరిగింది. దీనిపై బాధితుడు అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరవల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ వెలగల అమ్మిరెడ్డి, ఆయన సోదరులు స్కిన్నెరపురం, కంచుమర్రు గ్రామాల సరిహద్దులో ఉన్న 4.20 ఎకరాల చెరువును లీజుకు తీసుకుని కొన్నేళ్లుగా రొయ్యల సాగు చేస్తున్నారు. చెరువులో 3 లక్షల పిల్లలను వేయగా ప్రస్తుతం 94 కౌంట్కు చేరుకున్న రొయ్యలను మరో వారం రోజుల్లో పట్టుబడి పట్టనున్నారు.
ఈ తరుణంలో రొయ్యల చెరువులో విష ప్రయోగం జరగడంతో సుమారుగా ఆరు టన్నుల రొయ్యలు మృతిచెందినట్లుగా చెబుతున్నారు. వీటి విలువ సుమారుగా రూ.15.90 లక్షలు ఉంటుందని బాధితుడు వెలగల అమ్మిరెడ్డి వెల్లడించారు. దీనిపై ఆయన అత్తిలి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు చెరువును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. దీనిపై వెలగల అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఆరవల్లిలో తనను రాజకీయంగా ఎదుర్కోలేకే తన కుటుంబానికి చెందిన రొయ్యల చెరువులో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు విషం కలిపారని ఆరోపించారు.


