సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీవో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతు కూడగట్టడానికి బుధవారం ఆర్టీసీ క్రాస్రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఏపీ ఎన్జీవో నగర నేతలను టీఎన్జీవో నాయకులు అడ్డుకుని వెళ్లగొట్టారు.
హైదరాబాద్, న్యూస్లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 12 అర్ధరాత్రి నుంచి ఏపీఎన్జీవో చేపట్టనున్న నిరవధిక సమ్మెకు మద్దతు కూడగట్టడానికి బుధవారం ఆర్టీసీ క్రాస్రోడ్డులోని కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయానికి వచ్చిన ఏపీ ఎన్జీవో నగర నేతలను టీఎన్జీవో నాయకులు అడ్డుకుని వెళ్లగొట్టారు. ఏపీ ఎన్జీవో నగర అధ్యక్షుడు జీవీ సత్యానారాయణ ఆధ్వర్యంలో పలువురు సీమాంధ్ర ఉద్యోగులు కార్మిక శాఖలో పనిచేసే సీమాంధ్ర ఉద్యోగులను సమ్మెకు సిద్ధం చేయడానికి వచ్చి వారితో మాట్లాడేందుకు వచ్చారు. సమాచారమందుకున్న అదే శాఖలోని టీఎన్జీవో నాయకులు ‘తెలంగాణ ముద్దు.. సమైకాంధ్ర వద్దు అన్నదమ్ములుగా విడిపోయి కలిసుందాం.. జై తెలంగాణ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అడ్డుకున్నారు. దీంతో ఏపీ ఎన్జీవో నాయకులు వెనుదిరిగారు.
12న సచివాలయం ముట్టడి: ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపు
ఈ నెల 12న సచివాలయం ముట్టడి, భారీ ర్యాలీ కార్యక్రమానికి ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది. బుధవారం విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి కరాటే రాజు విలేకర్లతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులు సచివాలయంలో తిష్టవేసి తెలంగాణలోని అన్నిరంగాలను నష్టపరిచి... ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మహానగరంపై అనవసరపు రాద్ధాంతం చేయొద్దని ఏపీఎన్జీవోస్ నేతలను హెచ్చరించారు. సీఎం కిరణ్ ఏపీఎన్జీవోల వెనక ఉండి ఆందోళనలు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగమన్నారు.