రష్యా చమురు టార్గెట్గా ఉక్రెయిన్ దాడులు చేసింది. క్రాస్నోడార్ క్రాయ్, క్రిమియాలోని చమురు క్షేత్రాలపై దాడులు చేసినట్లు ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలిపారు. ఈ కాంప్లెక్స్ దక్షిణ రష్యాలో చమురు, పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు సంబంధించిన అతిపెద్ద కేంద్రాలలో ఒకటి. మరో వైపు రష్యాతో పాటు, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపైనా డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడుల్లో ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోగా.. 18 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు మాస్కో ప్రాంతం, పశ్చిమ, నైరుతి రష్యా, రష్యా ఆక్రమిత క్రిమియా, నల్లసముద్రం, అజోవ్ సముద్రాలపై వచ్చిన 310 ఉక్రెయిన్ డ్రోన్లను తమ దళాలు కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అదే సమయంలో రష్యా 155 డ్రోన్లతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకోగా.. వాటిలో 124 డ్రోన్లను ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలు కూల్చివేసాయని ఆ దేశ వైమానిక దళం పేర్కొంది.


