ప్రభుత్వం క్లస్టర్ పాలనను తెరపైకి తెస్తోంది. ఇంత వరకూ గ్రామ పంచాయతీల వారీ సాగే పాలన ఇక మీదట క్లస్టర్ స్థాయిలో కొనసాగనుంది.
♦ కార్యదర్శుల కుదింపునకు కొత్త విధానం!
♦ 925 పంచాయతీలు 558 క్లస్టర్లుగా విభజన
మహారాణిపేట(విశాఖ) : ప్రభుత్వం క్లస్టర్ పాలనను తెరపైకి తెస్తోంది. ఇంత వరకూ గ్రామ పంచాయతీల వారీ సాగే పాలన ఇక మీదట క్లస్టర్ స్థాయిలో కొనసాగనుంది. రెండు మూడు పంచాయతీలను కలిపి ఒకే గొడుగు కిందకు తెచ్చి క్లస్టర్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. బదిలీలు ఇందుకు అనుగుణంగా చేపట్టాలని జిల్లా ఉన్నతాధికారులను సర్కార్ ఆదేశించింది. అంటే బదిలీల అనంతరం ఈ విధానం అమల్లోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులను కుదించుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల కొరతతో కుంటుపడుతున్న గ్రామాభివృద్ధికి ఇది గొడ్డలిపెట్టని చెప్పకతప్పదు. ఇప్పటికే కార్యదర్శులు అందుబాటులో లేక పల్లెల్లో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. విద్యార్థులు ధ్రువ పత్రాలకు రోజుల తరబడి నోచుకోవడం లేదు. కొన్ని గ్రామాల్లో వీథి దీపాలు వెలగని దుస్థితి. జిల్లాలోని 925 పంచాయతీలను 558 క్లస్టర్లుగా విభజిస్తారు. వీటి ద్వారా కార్యదర్శులు ఇకపై పంచాయతీ పాలన సాగించనున్నారు.
త్వరలో జరగబోయే కార్యదర్శుల బదిలీలు తరువాత ఈ విధానం అమల్లోకి రానుంది. ప్రస్తుతం జిల్లాలో 396 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. కొత్త విధానం అమలులోకి వచ్చినా.. 162 క్లస్టర్లకు కార్యదర్శుల కొరత ఏర్పడ నుంది. అంటే క్లస్టర్లకు ఇన్చార్జీల పాలన తప్పదన్నమాట. జిల్లాలో సరిపడినంత మంది కార్యదర్శులు లేరు. గత ప్రభుత్వం కొత్తగా భర్తీ చేసిన కార్యదర్శుల్లో 152 మంది కొత్తవారు. వీరు ఒక పంచాయతీ పాలన, పనుల నిర్వహణ చేపట్టడానికే తంటాలు పడుతున్నారు. అలాంటిది వీరికి క్లస్టర్ విధానంలో ఉన్న రెండు, మూడు పంచాయతీలు అప్పగిస్తే అక్కడ సర్పంచ్లు, ప్రజలతో ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.