పిలిస్తే రాలేదని.. కుమ్మేశారు! | Sakshi
Sakshi News home page

పిలిస్తే రాలేదని.. కుమ్మేశారు!

Published Sat, May 2 2015 3:57 PM

పిలిస్తే రాలేదని.. కుమ్మేశారు! - Sakshi

ఎక్కడ అన్యాయం జరిగినా.. ప్రమాదం జరిగినా.. చటుక్కున ప్రత్యక్షం కావాల్సింది పోలీసులే. ప్రజలకు పక్షాన తామున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన ఆ రక్షకభటులే రాక్షసుల్లా ప్రవర్తిస్తే.. ఎవరికీ చెప్పుకోవాలి?  నెల్లూరు జిల్లా కావలి వన్టౌన్ పోలీసులు చేసిన నిర్వాకం ఘోరంగా ఉంది. ఓ చెవిటి వాడిని అకారణంగా చావబాదారు. కావలికి చెందిన అహ్మద్ అనే వ్యక్తికి చెవుడు ఉంది. సెకండ్ షో సినిమాకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వన్‌టౌన్‌ పోలీసులు ఇద్దరు అతనికి తారసపడ్డారు. ఆ వ్యక్తిని దగ్గరకు రమ్మని పిలిచారు.

చెవుడు ఉండటంతో వాళ్ల మాటలు అహ్మద్కు వినపడలేదు. దాంతో ఖాకీలకు కోపమొచ్చింది. పిలిస్తే పలకవా అంటూ.. అమాంతం అతడిపై విరుచుకుపడి ఇష్టమొచ్చినట్టు చావబాదారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న అహ్మద్ తల్లి.. తన బిడ్డను కొట్టవద్దంటూ పోలీసులను ప్రాధేయపడింది. అయినా.. ఖాకీలు కనికరించలేదు. ఆమె మాట వినకుండా అతన్ని కుళ్లబొడిచారు. దాంతో తీవ్రగాయాలైన అహ్మద్ను కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి తల్లి చికిత్స చేయిస్తోంది. తన కుమారుడిని ఎందుకు కొట్టారో అర్థం కావటం లేదని ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement
Advertisement