టీడీపీ బెండ తీసిన ఆ రెండూ | municipal elections Congress candidates win in ysr government | Sakshi
Sakshi News home page

టీడీపీ బెండ తీసిన ఆ రెండూ

Mar 12 2014 1:27 AM | Updated on Mar 18 2019 7:55 PM

టీడీపీ బెండ తీసిన ఆ రెండూ - Sakshi

టీడీపీ బెండ తీసిన ఆ రెండూ

ఆ రెండు పురపాలక సంఘాలూ టీడీపీకి మర్చిపోలేని చేదు అనుభవాలు మిగిల్చాయి. అవి రామచంద్రపురం, తుని. 22 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఘోరపరాజయాన్ని

ఆ రెండు పురపాలక సంఘాలూ టీడీపీకి మర్చిపోలేని చేదు అనుభవాలు మిగిల్చాయి. అవి రామచంద్రపురం, తుని. 22 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఎరుగని ఘోరపరాజయాన్ని గత మున్సిపల్ ఎన్నికల్లో అంటే 2005లో తుని పురపాలకసంఘం టీడీపీకి అందించింది. ఈ ఎన్నికల్లో మహానేత వైఎస్సార్ ప్రభావంతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఏక మొత్తంగా 30 కౌన్సిలర్ స్థానాలూ కాంగ్రెస్ పరమయ్యాయి. పార్టీ అగ్రనేత, 20 ఏళ్లకు పైగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న యనమల రామకృష్ణుడు సొంత నియోజకవర్గం కావడంతో ఈ పరిణామానికి రాష్ట్రస్థాయి ప్రాధాన్యం చేకూరింది. ఇక రామచంద్రపురంలో అయితే 1983 నుంచి ఇప్పటివరకూ ఏ ఎన్నికలోనూ మున్సిపల్ ఓటర్లు టీడీపీకి అధికారం కట్టబెట్టలేదు. ఈ   పురపాలకసంఘంపై పచ్చజెండా రెపరెపలాడాలన్న ఆ పార్టీనేతల కల మూడు దశాబ్దాలుగా నెరవేరనేలేదు. 
 
 2005లో సైకిల్
 తుని, న్యూస్‌లైన్ :అది 2005వ సంవత్సరం...తెలుగుదేశం కంచుకోట బద్ధలైన సంవత్సరం... చరిత్రలో వారికి చేదుజ్ఞాపకంగా మిగిలిపోయింది. రాజన్న పథకాలకు తుని మున్సిపాలిటీలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మొత్తం 30 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులే విజయబావుటా ఎగురవేశారు. చరిత్ర పుస్తకంలో తమకో పేజీ కేటాయించుకున్నారు. తుని పురపాలక సంఘం 1959 ఏప్రిల్ ఒకటిన ఆవిర్భవించింది. అంతకుముందు వీరవరం పేరుతో మేజర్ పంచాయతీగా ఉండేది. తుని ప్రథమ ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌వీవీ కృష్ణంరాజు (బుల్లిబాబు) పురపాలక సంఘం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. అప్పటికే తుని వాణిజ్య కేంద్రం గా ఉంది. అప్పటి జనాభా ప్రకారం పట్టణాన్ని 16 వార్డులుగా విభజించారు. 1959 నుంచి 1963 వరకు ప్రత్యేకాధికారి పాలనలో ఉండేది. 1963లో నిర్వహించిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ఎస్‌ఆర్‌వీవీ జగపతిబాబు (రాజబాబు) చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
 
 16 వార్డులకు గాను అత్యధిక వార్డులను కాంగ్రెస్ గెలుచుకుంది. 1963 నుం చి 1974 వరకు  ఎస్‌ఆర్‌వీవీ జగపతిబాబు రెండోసారి చైర్మన్‌గా చేశారు. 1974 నుంచి 1981 వరకు ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. 1981లో ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన బర్రె సూర్యనారాయణ చైర్మన్‌గా గెలుపొందారు. 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతో అవిశ్వాస తీర్మానం పెట్టి  మేడి ది మాధవరావును చైర్మన్‌గా చేశారు. ఒకొక్కరు రుం డున్నర ఏళ్ల పాటు పనిచేశారు. 1987లో ఓసీ మహిళకు రిజర్వు అయ్యింది. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన బొండా రత్నావతి చైర్మన్‌గా గెలుపొందారు.  1992 నుంచి 1995వరకు ప్రత్యేకాధికారి పాలనలో ఉంది. 1995లో వార్డుల పునర్విభజన జరిగింది. 16 నుంచి 24 వార్డులకు పెరిగాయి. 1995లో జరిగిన ఎన్నికల్లో  ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. 
 
 టీడీపీ మద్దతుతో పోటీచేసిన బెందుర్తి సుశీల చైర్మన్‌గా గెలుపొందారు. 2000  వరకు చైర్మన్‌గా ఉన్నారు. 2000లో బీసీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. టీడీపీ మద్దతుతో చందక తలుపులరావు పోటీ చేసి గెలి చారు. 2005వరకు చందక తలుపుల రావు చైర్మన్‌గా చేశారు. 2005లో ఓసీ  మహిళకు కేటాయించారు. కాంగ్రెస్ తరఫున కుసుమంచి శోభారాణి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో 30 వార్డులను కాంగ్రె స్ పార్టీ గెలుచుకుంది. టీడీపీ ఒక్క స్థానాన్ని గెలుచుకోలేదు. ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం పురపాలక ఎన్నికలపై స్పష్టంగా కనిపించింది. రెండుసార్లు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జగపతిరాజు, రెండుసార్లు వైశ్య సామాజిక వర్గం నుంచి చైర్మన్‌లుగా చేశారు. మూడవసారి వైఎస్సార్ సీపీ తరఫున వైశ్య సామాజిక వర్గానికి చెందిన కుసుమంచి శోభారాణి పోటీ చేస్తున్నారు. 
 
 ‘దేశం’ నుదుట... ఓటర్ల ఓటమి రాత
 రామచంద్రపురం, న్యూస్‌లైన్ :రామచంద్రపురం మున్సిపాలిటీని గత 55 ఏళ్లుగా ఏడుగురు చైర్మన్లు పాలించారు. కాంగ్రెస్ పార్టీతో పాటు స్వతంత్రులు సైతం ఈ పురపాలక సంఘాన్ని ఏలారు. అయితే 1983లో టీడీపీ వచ్చింది మొదలు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవి ఆ పార్టీకి దక్కలేదు. 1983లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రభంజనం నెలకొన్న సమయంలో కూడా ఇక్కడ మున్సిపల్ చైర్మన్, అధిక శాతం కౌన్సిలర్ స్థానాలు  ఇతర పార్టీలకే దక్కాయి. 1959లో గ్రేడ్-3  మున్సిపాలిటీగా ఆవిర్భవించిన రామచంద్రపురం 1980లో గ్రేడ్-2గా మారింది. ఇప్పటివరకూ పాలించిన ఏడుగురిలో ఎక్కువమంది క్షత్రియ సామాజిక వర్గీయులే. ఈ మున్సిపాలిటీ 1959లో ఆవిర్భవించగా 1962 వరకు ప్రత్యేకఅధికారి పాలన  సాగింది. 
 
 అనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో నందివాడ సత్యనారాయణరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆయన 1968 ఆ పదవిలో కొనసాగారు. తదుపరి 1972వరకు  చైర్మన్‌గా ఉన్న అడ్డూరి పద్మనాభరాజు కాంగ్రెస్ తరఫున గెలిచారు. 1972 నుంచి 1981వరకు తిరిగి ప్రత్యేక అధికారుల పాలన సాగింది. 1981 నుంచి 83వరకు స్వతంత్ర అభ్యర్థి ఎస్‌ఆర్‌కే రామచంద్రరాజు (రాజబాబు) చైర్మన్‌గా గెలుపొందారు. ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి  గెలుపొందడంతో ఎస్‌ఆర్‌కే గోపాలబాబు 1985వరకు చైర్మన్‌గా కొనసాగారు. తర్వాత 1987లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రామచంద్రరాజు(రాజబాబు) కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి తిరిగి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అనంతరం 1993 నుంచి 95వరకు రెండేళ్లపాటు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1995 నుంచి 2000వరకు స్వతంత్ర అభ్యర్థి కొండపల్లి కనకలింగేశ్వరరావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 
 
 2000లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్దిగా  ఎస్‌ఆర్‌కే విజయాదేవి విజయం సాధించి 2005 వరకు చైర్మన్‌గా కొనసాగారు. 2005లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావటంతో పంతగడి జీవనజ్యోతి కాంగ్రెస్‌అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.  జీవనజ్యోతి 2010 వరకు ఈ పదవిలో ఉన్నారు. అప్పటినుంచి నేటివరకూ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి పాలనలోనే ఉంది. పట్టణంలో 43,683 మంది జనాభా కాగా ఓటర్ల సంఖ్య 31188. వీరిలో పురుషులు 15108, మహిళలు 16079. ఈ దఫా రామచంద్రపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవిని జనరల్‌కు కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement