అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు | Government restrictions on all sectors | Sakshi
Sakshi News home page

అన్నింటా ఏపీ సర్కారు ఆంక్షలు

Jul 2 2014 2:57 AM | Updated on Sep 2 2017 9:39 AM

సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది.

హైదరాబాద్: సర్కారు ప్రాధాన్యత ఇస్తున్న అభివృద్ధి పథకాలకు అవసరమైన నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధించనుంది. పలు శాఖల్లో వివిధ రంగాల వ్యయంపై అనేకరకాల ఆంక్షలను విధిస్తూ ఆర్థిక శాఖ త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది. మంత్రులకు కూడా ఈ ఆంక్షలు వర్తించనున్నారుు. మంత్రులైనా, అధికారులైనా విమానాల్లో ఇకపై ఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించాలని ఆదేశించనున్నారు. వీలైనంత మేర ప్రణాళికేతర వ్యయాన్ని తగ్గించాల్సిందిగా ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాఖ అధికారులను ఆదేశించారు. ప్రణాళికేతర వ్యయం తగ్గింపు, పొదుపు చర్యలపై మంత్రి మంగళవారం అధికారులతో సమీక్షించారు. పొదుపు చర్యల్లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.

ఈ మేరకు అధికారులు చేసిన ప్రతిపాదనలకు యనమల ఆమోదం తెలిపారు. ముఖ్యమంత్రి ఆమోదం లభించగానే ఆర్థిక శాఖ ఆంక్షల ఉత్తర్వులను జారీ చేయనుంది. కొత్తగా ఔట్ సోర్సింగ్ నియామకాలు చేపట్టరాదని, వీలైతే ఉన్న ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కూడా తగ్గించేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలకు ఈ ఆంక్షలు వర్తింప చేయనున్నారు.     
 

Advertisement
 
Advertisement
Advertisement