అదృశ్యమైన యువతులుగుంటూరులో ప్రత్యక్షం | five girls are appeared in guntur, who escaped from hostel | Sakshi
Sakshi News home page

అదృశ్యమైన యువతులుగుంటూరులో ప్రత్యక్షం

Nov 20 2013 1:59 AM | Updated on Jul 11 2019 7:49 PM

స్థానిక నవజీవన్ బాలభవన్ హాస్టల్ నుంచి ఆదివారం అదృశ్యమైన ఐదుగురు యువతులు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు.

 పెనమలూరు, న్యూస్‌లైన్ :  స్థానిక నవజీవన్ బాలభవన్ హాస్టల్ నుంచి ఆదివారం అదృశ్యమైన ఐదుగురు యువతులు గుంటూరులో ప్రత్యక్షమయ్యారు. బాలభవన్ నిర్వాహకులు వారిని పెనమలూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి సీఐ ధర్మేంద్ర ఎదుట హాజరుపరిచారు. తమకు హాస్టల్ జీవితం నచ్చలేదని, బయట స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో వెళ్లిపోయామని ఆ యువతులు             
 వివరించారు. వివరాలిలా ఉన్నాయి. పెనమలూరులోని నవజీవన్ బాలభవన్ ఆధ్వర్యంలో అనాథ బాలికలు, యువతుల సంక్షేమార్థం ఏర్పాటుచేసిన హాస్టల్‌లో మొత్తం 19 మంది ఉంటున్నారు. గత ఆదివారం వారిలో ఐదుగురు యువతులు ఎం.రమణ, ఎస్.లక్ష్మి, ఎన్.గాయత్రి, ఎం.సంతోషి, కె.కావ్య హాస్టల్ నుంచి పారిపోయారు.
 
  ఈ ఘటనతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరోపక్క హాస్టల్ నుంచి బయటికొచ్చిన యువతులు ఆదివారం నాడే విజయవాడ రైల్వేస్టేషన్‌కు వెళ్లి రెలైక్కి హైదరాబాదు వెళ్లారు. అక్కడ ఎటువెళ్లాలో తెలీక వెయిటింగ్ హాల్లోనే ఉండిపోయారు. వారిలో ఓ యువతి బంధువులకు ఫోన్‌చేసి తాము హైదరాబాదులో ఉన్నామని తెలిపింది. వారు నచ్చచెప్పటంతో మంగళవారం ఆ యువతులు శబరి ఎక్స్‌ప్రెస్ ఎక్కి గుంటూరుకు చేరారు. ఈ సమాచారం తెలుసుకున్న బాలభవన్ నిర్వాహకులు గుంటూరు రైల్వేస్టేషన్ నుంచే వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
 
 మేము హాస్టల్‌లో ఉండం...
 తాము నవజీవన్ హాస్టల్‌లో ఉండబోమని యువతులు సీఐ ధర్మేంద్ర ఎదుట తేల్చిచెప్పారు. తాము ఉద్యోగం చేసుకుని స్వేచ్ఛగా బయటే ఉంటామని తెలిపారు. హాస్టల్ జీవితం తమకు ఇష్టం లేదని వివరించారు. స్వేచ్ఛగా జీవించేలా తమకు న్యాయం చేయాలని కోరారు.
 
 సీఐ కౌన్సెలింగ్
 ఈ నేపథ్యంలో యువతులకు సీఐ ధర్మేంద్ర ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆడపిల్లలు బయట ఒంటరిగా ఉంటే మంచిది కాదన్నారు. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకపోతే చైల్డ్‌లైన్‌లో ఉండమని వారికి నచ్చచెప్పారు. అనంతరం వారి వద్ద స్టేట్‌మెంట్‌లు తీసుకుని చైల్డ్‌లైన్‌కు పంపించారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement