● కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో ఎస్సీ, ఎస్టీలది కీలక పాత్ర అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ విభాగాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అనుబంధ సంఘాలు చురుగ్గా వ్యవహరించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు. తన మంత్రివర్గంలోనేగాక కార్పొరేషన్ ఛైర్మెన్లు, నామినెటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని, వారిపై నిత్యం దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయన్నారు. జగనన్న 2.0లో కార్యకర్తలకే పెద్దపీట వేయడం జరుగుతుందని, ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. అధికార పార్టీ కూటమి చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక విధానాలను సోషల్ మీడియా వేదికగా నిలదీయాలని పిలుపునిచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీలకు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆయా వర్గాలపై ప్రతినిత్యం దాడులు, అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బడుగు, బలహీన వర్గాలకు ధైర్యం కల్పించాలనే ఉద్దేశ్యంతో వైఎస్సార్సీపీ పనిచేస్తోందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆదుకొని వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, ఎస్టీ విభాగం అధ్యక్షుడు బి. వేణుగోపాల్ నాయక్, రాష్ట్ర నాయకులు త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.


