కడప సెవెన్రోడ్స్ : ఆంధ్రుల ఆవేశానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయిన టంగుటూరి ప్రకాశం పంతులు తెలుగు వారి పాలిట అపర భగీరథుడు అని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు అభివర్ణించారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుక జిల్లా రెవెన్యూ అధికారి అధ్యక్షతన, జిల్లా పరిపాలనా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు పేరు వినగానే తెలుగు వారికి ప్రకాశం జిల్లా, బెజవాడ ప్రకాశం బ్యారేజీ గుర్తుకు వస్తాయని తెలిపారు. కృష్ణా నదీ జలాలను సద్వినియోగం చేసి ఆయకట్టు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో బ్యారేజీ నిర్మాణానికి ఆయన కృషి చేశారని వివరించారు. 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో బ్రిటిష్ పోలీసుల ఎదుట గుండె చూపి నిలబడిన ధైర్యసాహసాల కారణంగా ‘ఆంధ్ర కేసరి’గా గుర్తింపు పొందారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అనంతరం తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రజలకు సేవలందించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా డీఆర్వో జ్యోతి ప్రజ్వలన చేసి.. అనంతరం, టంగుటూరి ప్రకాశం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టరేట్ పరిపాలన విభాగం సెక్షన్ల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘టంగుటూరి’ 155వ జయంతి
కార్యక్రమంలో డీఆర్వో మల్లికార్జునుడు


