ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్షాన్ బాషా తెలిపారు. ఈ నెల 15న స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమం వేదిక వద్ద నేలపైనే త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేశారన్నారు. వేదికపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో సహా నాయకులు, అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండా ఎత్తయిన స్థాయిలో గర్వంగా, హుందాతనంగా రెపరెపలాడాలని, త్రివర్ణ రంగులను నేలపై, ప్రజలు నడిచే ప్రదేశంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 ప్రకారం జాతీయ జెండాను తొక్కడం లేదా దానికి ఇతర విధాలుగా అవమానం చేయడం శిక్షార్హమని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టంలో జాతీయ జెండా చిత్రం, పెయింటింగ్, డ్రాయింగ్ లేదా ఇతర కనిపించే ప్రతిరూపం కూడా ప్రస్తావించబడిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


