● విద్యార్థులకు పిలుపునిచ్చిన కలెక్టర్ శ్రీధర్. చెరుకూరి
● షైనింగ్ స్టార్ – 2026 అవార్డు బహూకరణ
కడప ఎడ్యుకేషన్ : కలల సాధనలో విద్యార్థులు రాజీ పడొద్దని... లక్ష్యం చేరే వరకు పట్టుదలతో శ్రమించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపు నిచ్చారు. సోమవారం కడపలోని మాధవి కన్వెన్షన్ హాలులో 2025–26 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో జిల్లా స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్–2026 పేరుతో ఒకొక్కరికి రూ. 20 వేల నగదుతోపాటు సర్టిఫికెట్, మెడల్స్ బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలెక్టర్ శ్రీధర్తోపాటు రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి, రాష్ట్ర షేక్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ఎస్. ముక్తియార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డి. భానుప్రకాశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కో ప్రతిభ ఉంటుందని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం కష్టం కాదని, లక్ష్యాన్ని చేరుకోవడంలో ప్రణాళిక ప్రకారం, దృఢ సంకల్పంతో అడుగులేయలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మనం ఎదుగుతూనే మన సమాజంలో తోటి వారి ఎదుగుదలను కూడా ఆకాంక్షించాలన్నారు. సబ్ కలెక్టర్ భావన, పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్, ఇంటర్ ఆర్ఐఓ ప్రకాష్ రావు పట్నాయక్, సమగ్రశిక్ష ఏిపీసీ బి.అనురాధ తదితరులు ప్రసంగించారు. అనంతరం జిల్లాలో 10వ తరగతిలో 248 మంది, ఇంటర్మీడియట్లో 33 మంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 281 మంది విద్యార్థులకు నగదు, ప్రశంసా పత్రాలు, మెడల్ లను విద్యార్థులకు అందజేశారు. ఉప విద్యాశాఖ అధికారులు రాజగోపాల్ రెడ్డి, శివ ప్రసాద్, నాగయ్య, కళాశాలల ప్రిన్సిపాళ్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


