కడప ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ.. జూలై 15వ తేదీ దాటిపోవడంతో వేరుశనగ సాగు అనుకూలం కాదని, రైతులు కరవును తట్టుకుని పశుగ్రాస కొరతను తీర్చే కొర్రలు, జొన్నలు, సజ్జలు, పెసలు వంటి చిరుధాన్యాల (మిల్లెట్స్) వైపు వెళ్లాలని సూచించారు. ఏరువాక కేంద్ర ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శిల్పకళ మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలే ఉత్తమమని, వర్షం 4 నుంచి 6 వారాలు ఆలస్యమైతే పెసర, మినుము, కొర్ర, ఆముదం, గోరుచిక్కుడు వంటి తక్కువ కాలపరిమితి పంటలు వేయాలని, 8 వారాలు దాటితే కరవును తట్టుకునే కంది, ఆముదం రకాలకు మారాలని, నీటి లభ్యత తక్కువగా ఉంటే వరికి బదులు జొన్న, ఆముదం వేసి సూక్ష్మసేద్యం ద్వారా పంటలు కాపాడుకోవాలని సలహా ఇచ్చారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్రమణేశ్వరావు మాట్లాడుతూ.. తక్కువ నీరు పట్టే పంటలను ఎంచుకుని డ్రిప్పు, స్ప్రింక్లర్లను అమర్చుకోవడంతో పాటు భూమిలో తేమ ఆరిపోకుండా మల్చింగ్ పద్ధతులను పాటించాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.


