సాక్షి, యాదాద్రి: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) లబ్ధిదారులు ఏటేటా తగ్గుతున్నారు. పథకం ప్రారంభించినప్పుడు జిల్లాలో 1,30,286 మంది రైతులు లబ్ధిపొందగా ప్రస్తుతం వారి సంఖ్య 85,214కి పడిపోయింది. ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తూ ఆమోదం తెలిపింది.
తొలి విడతలో రూ.26.05 కోట్లు
రైతులకు సాగు ఖర్చుల కోసం ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో కేంద్రం 2018 డిసెంబర్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు ఏటా రూ.6,000 చొప్పున అందిస్తున్నారు. ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ప్రతి నాలుగు నెలలకోసారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. పథకం ప్రారంభమైన తొలి విడతలో జిల్లాలోని 1,30,286 మంది రైతులకు రూ.26.05 కోట్ల ఆర్థిక సాయం అందింది. ఇప్పటివరకు మొత్తం 23 విడతల్లో కలిపి జిల్లా రైతులకు రూ.500 కోట్ల వరకు ఆర్థిక సాయం పంపిణీ చేశారు.
45వేలకు పైగా తగ్గిన లబ్ధిదారులు
కాలక్రమేణా జిల్లాలో పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య బాగా తగ్గిపోయింది. 22వ విడత నాటికి జిల్లాలో రైతుల సంఖ్య 85,214కి పడిపోయింది. ఈ విడతలో ప్రభుత్వం రూ.17.04 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తొలి విడతతో పోలిస్తే దాదాపు 45 వేలకు పైగా లబ్ధిదారులు తగ్గిపోవడం గమనార్హం.
తగ్గడానికి కారణాలివే..
లబ్ధిదారుల సంఖ్య తగ్గడానికి ప్రధానంగా కేంద్రం విధించిన కఠిన నిబంధనలే కారణమని అధికారులు చెబుతున్నారు. బయోమెట్రిక్/ఆధార్ ఆధారిత ఈ–కేవైసీ ప్రక్రియను తప్పనిసరి చేయడం. భూమి వివరాలను ఆధార్తో సీడింగ్ చేయడం, సరైన పత్రాలు లేని వారిని తొలగించడం. ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులను పథకం నుంచి మినహాయించడం. మరణించిన రైతుల పేర్లను రికార్డుల నుంచి తొలగించడం వంటి కారణాల వల్ల కూడా లబ్ధిదారుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
ఫ తొలి విడతలో 1.30 లక్షలకు పైగా రైతులు..
ఫ 22వ విడత నాటికి 85,214 మందికే పరిమితం
ఫ కఠిన నిబంధనలే కారణం


