బొమ్మలరామారం: మార్కెటింగ్ సమస్యలు, రవాణా భారం, కూలీల కొరతతో పాటు గిట్టుబాటు ధర లభించక కుదేలవుతున్న కూరగాయల రైతులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సరికొత్త అడుగు వేసింది. జిల్లాకు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో ఆహార శుద్ధి కేంద్రాలు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా బొమ్మలరామారంలో రూ. 13.05 లక్షల ఖర్చుతో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్, భూదాన్ పోచంపల్లిలో రూ. 17.91 లక్షల వ్యయంతో రైస్ ఫ్లేక్స్ (అటుకులు), పఫ్డ్ రైస్ (బొరుగులు) ప్రాసెసింగ్ యూనిట్, గుండాలలో రూ. 19.03 లక్షలతో దాల్ (పప్పు దినుసుల) ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ఫ్), అంతర్జాతీయ పొడి ప్రాంత వ్యవసాయ పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) సంయుక్తంగా ఈ యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. బొమ్మలరామారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్ కోసం ఒక ఎకరం అనువైన స్థలాన్ని కేటాయించాలని సెర్ఫ్ ప్రతినిధులు రెవెన్యూ అధికారులను కోరారు. ప్రస్తుతం మండలంలో గిట్టుబాటు ధర లేక సుమారు 80 శాతం మంది రైతులు కూరగాయల సాగును వదిలేసి వరి వైపు మళ్లారు. ప్రాసెసింగ్ యూనిట్ అందుబాటులోకి వస్తే యావపూర్, సోలీపేట్ వంటి గ్రామాల్లో కొత్తిమీర, కాలీఫ్లవర్, పాలకూర సాగు మరింత పెరగడంతో పాటు మహిళా రైతుల ఆర్థిక స్వాలంబనకు దోహదపడనుంది.
ఇక్రిశాట్ ఆధ్వర్యంలో అత్యాధునిక శిక్షణ
మండలంలోని రైతులకు ఇక్రిశాట్ సహకారంతో నాణ్యమైన పంటల సాగుకు మార్గం సులభం కానుంది. చీడపీడలను తట్టుకునే విత్తనాల పంపిణీ, మెరుగైన సాగు పద్ధతులు, నేల ఆరోగ్యం, వాతావరణ సూచనలు, డిజిటల్ వ్యవసాయం, నీటి సంరక్షణ యాజమాన్యంపై రైతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
గ్రేడింగ్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెటింగ్
ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా మహిళా రైతులు పండించిన పంటలను నేరుగా తక్కువ ధరకు అమ్ముకోకుండా, ప్రాసెసింగ్ ప్రక్రియ ద్వారా గ్రేడింగ్ చేస్తారు. ఆపై హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లోని సూపర్ మార్కెట్లతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికల ద్వారా నేరుగా మార్కెటింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తారు.
జిల్లాకు మూడు కేంద్రాలు మంజూరు
ఫ బొమ్మలరామారంలో వెజిటబుల్ ప్రాసెసింగ్ యూనిట్
ఫ పోచంపల్లిలో అటుకులు,
బొరుగులు, గుండాలలో పప్పుదినుసుల కేంద్రం ఏర్పాటు


