మర్రిగూడ : ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళ డబ్బులు తీసుకుని ఉద్యోగం ఇప్పించకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లెంకలపల్లి గ్రామానికి చెందిన చాపల వెంకటయ్య, భారతమ్మ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు శివ(25) డిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉంటున్నాడు. హైదరాబాద్లోని ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ మహిళ తాను హైదరాబాద్లో పనిచేస్తున్న కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని శిను నమ్మించి రూ.55 వేలు తీసుకుంది. డబ్బులు తీసుకొని ఉద్యోగం ఇప్పించకపోవడంతో మనస్తాపానికి గురైన శివ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి అన్న వినయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బి. రాంబాబు తెలిపారు.
ఫ పురుగుల మందు తాగి
యువకుడి బలవన్మరణం


